Manikkam Tagore Vs KTR : కేటీఆర్కు ‘పరువు నష్టం’ నోటీసులు పంపిన మాణిక్కం ఠాగూర్
Manikkam Tagore Vs KTR : తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల మాజీ ఇంఛార్జ్ మాణిక్కం ఠాగూర్ చెప్పినంత పనిచేశారు.
- Author : Pasha
Date : 31-01-2024 - 1:31 IST
Published By : Hashtagu Telugu Desk
Manikkam Tagore Vs KTR : తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల మాజీ ఇంఛార్జ్ మాణిక్కం ఠాగూర్ చెప్పినంత పనిచేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు ఝలక్ ఇస్తూ ఆయనకు పరువు నష్టం నోటీసులను పంపారు. ఒకవేళ ఈ నోటీసులు అందిన వారం రోజుల్లోగా కేటీఆర్ బేషరతు క్షమాపణ చెప్పకుంటే మధురై హైకోర్టు బెంచ్ను ఆశ్రయిస్తానని స్పష్టం చేశారు. ఈ నెల 28న సొంత నియోజకవర్గమైన సిరిసిల్లలో పర్యటించిన కేటీఆర్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి, మాణిక్కం ఠాగూర్లపై వివాదాస్పద ఆరోపణలు చేశారు.
We’re now on WhatsApp. Click to Join
‘‘నువ్వు ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రివి కాదు.. ఢిల్లీ ద్వారా మేనేజ్మెంట్ కోటాలో, మేనేజ్ చేసుకుని.. మాణిక్కం ఠాగూర్కు రూ.50 కోట్లిచ్చి, మళ్లీ ఢిల్లీకి వెళ్లి మేనేజ్ చేసుకుని తెచ్చుకున్న పదవి తప్పా.. ప్రజలంతా కూడబలుక్కొని ఎన్నుకోలేదు. ఎన్నటికీ నువ్వు కేసీఆర్ కాలిగోటికి సరిపోవు’’ అని ఆ సందర్భంగా కేటీఆర్ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై వెంటనే స్పందించిన మాణిక్కం ఠాగూర్.. ‘‘మధురై హైకోర్టు బెంచ్లో కేటీఆర్పై పరువు నష్టం దావా వేయాలనుకుంటున్నా’’ అని ట్విట్టర్ (ఎక్స్) వేదికగా ఒక పోస్టు చేశారు. ఇప్పుడు అదేవిధంగా చేస్తూ కేటీఆర్కు పరువు నష్టం నోటీసులను పంపారు. ఒకవేళ వారంలోగా స్పందించకుంటే కోర్టు ద్వారా కేటీఆర్పై న్యాయపోరాటం కొనసాగిస్తానని మాణిక్కం ఠాగూర్ తేల్చిచెప్పారు. రూ.50 కోట్లను తాను రేవంత్ రెడ్డి నుంచి పుచ్చుకున్నాననేది వట్టి అబద్ధమని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ సీఎం ఎంపిక కేవలం అధిష్టానం ఆలోచన ప్రకారం జరిగిందన్నారు. కనీసం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పదవుల్లో లేని తన గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల తన పరువుకు నష్టం వాటిల్లిందని మాణిక్కం ఠాగూర్ తన నోటీసుల్లో ప్రస్తావించారు.
Also Read : Panjagutta PS : పంజాగుట్ట పోలీస్ సిబ్బంది మొత్తం బదిలీ ..సీపీ సంచలన నిర్ణయం
తాజాగా వికారాబాద్లో జరిగిన పరిగి నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలోనూ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కారు కేవలం సర్వీసింగ్కు పోయిందని, మళ్లీ వంద స్పీడుతో దూసుకొస్తదన్నారు. కాంగ్రెస్ హామీ ఇచ్చింది ఆరు గ్యారంటీలు కాదు…420 హామీలని గుర్తు చేశారు. ‘‘ఉచిత బస్సు తో మహిళలు కొట్టుకునే పరిస్థితి ఏర్పడింది. ఆరున్నర లక్షల మంది ఆటో డ్రైవర్లు రోడ్డున పడ్డారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం ఓ గల్లీ కాంగ్రెస్ కార్యకర్త మాట్లడినట్టు ఉంది. ఇచ్చిన హామీలు అమలు చేయకుంటే కాంగ్రెస్ పార్టీని బట్టలిప్పి చౌరస్తాలో నిలబెడతాం. బీజేపీ పెద్ద నేతలను ఓడగొట్టింది బీఆర్ఎస్ కాదా బీజేపీ బీఆర్ఎస్కు పొత్తు ఉంటే మా ఆడ బిడ్డపై కేసు ఉంటుండెనా’’ అని కేటీఆర్ చెప్పారు. ‘‘యాభై రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటోంది. రానున్న రోజుల్లో ఇంకా చాలా చూస్తాం. కాంగగ్రెస్సోళ్లు ఐదేళ్లు ఉంటారా.. మధ్యలో పోతారా చూస్తాం. మూడు అడుగులు లేనోడు బీఆర్ఎస్ పార్టీని వంద మీటర్ల లోతులో పెడ్తడంటా..’’ అని సీఎం రేవంత్పై కేటీఆర్ సెటైర్స్ పేల్చారు.