Lal Darwaza Bonalu: ఘనంగా లాల్ దర్వాజ బోనాలు.. అమ్మవారికి ఎమ్మెల్సీ కవిత బోనం!
హైదరాబాద్లో జరుగుతున్న బోనాల పండుగ ఉత్సవాల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చురుకుగా పాల్గొన్నారు. హరిబౌలిలోని అక్కన్న మాదన్న మహంకాళి ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేకంగా బోనం సమర్పించారు.
- Author : Gopichand
Date : 20-07-2025 - 3:01 IST
Published By : Hashtagu Telugu Desk
Lal Darwaza Bonalu: హైదరాబాద్లోని పాతబస్తీలో బోనాల పండుగ సందడి వాతావరణం నెలకొంది. ఆషాఢమాసం చివరి ఆదివారం సందర్భంగా ఉదయం నుంచే వివిధ ఆలయాల్లో అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు భారీగా బారులు తీరారు. భక్తులు భక్తిశ్రద్ధలతో అమ్మవారికి బోనాలు సమర్పిస్తూ తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు.
ఈ వేడుకల్లో భాగంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత లాల్ దర్వాజ (Lal Darwaza Bonalu) సింహవాహిని మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించారు. ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆమె, తెలంగాణ రాష్ట్రం అమ్మవారి చల్లని దీవెనలతో బాగుండాలని, సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని కోరుకున్నారు. అలాగే, తెలంగాణ ప్రజలందరూ సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని అమ్మవారిని ప్రార్ధించారు. ఈ మేరకు కవిత తన ‘ఎక్స్’ (గతంలో ట్విట్టర్) ఖాతాలో ఫోటోలను పంచుకున్నారు.
Also Read: Earthquakes: రష్యాలో భారీ భూకంపం.. హెచ్చరికలు సైతం జారీ!
లాల్ దర్వాజ సింహవాహిని మహంకాళి బోనాల సందర్భంగా అమ్మవారికి బోనం సమర్పించాను
అమ్మవారి చల్లని దీవెనలతో తెలంగాణ రాష్ట్రం బాగుండాలని, సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని…తెలంగాణ ప్రజలందరూ సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని ప్రార్ధిస్తున్నాను. pic.twitter.com/J5Z2kYeB9D
— Kavitha Kalvakuntla (@RaoKavitha) July 20, 2025
అంతకుముందు ఎమ్మెల్సీ కవిత ఉదయం కార్వాన్లోని దర్బార్ మైసమ్మను దర్శించుకొని బోనం సమర్పించారు. ఆ తర్వాత హరిబౌలిలోని అక్కన్న మాదన్న మహంకాళి ఆలయంలో కూడా బోనం సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు. బోనాల పండుగ సందర్భంగా నగరమంతా భక్తిభావంతో నిండిపోయింది.
బోనాల వేడుకల్లో ఎమ్మెల్సీ కవిత
హైదరాబాద్లో జరుగుతున్న బోనాల పండుగ ఉత్సవాల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చురుకుగా పాల్గొన్నారు. హరిబౌలిలోని అక్కన్న మాదన్న మహంకాళి ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేకంగా బోనం సమర్పించారు. అలాగే మీర్ ఆలం మండిలోని మహా కాళేశ్వర దేవాలయంలో కూడా అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. బోనాల పండుగ సందర్భంగా నగరంలోని పలు ఆలయాల్లో ఎమ్మెల్సీ కవిత అమ్మవారిని దర్శించుకున్నారు.
ఘనంగా లాల్ దర్వాజ బోనాలు
హైదరాబాద్లోని పాతబస్తీలో లాల్ దర్వాజ బోనాలు ఘనంగా జరిగాయి. ఆషాఢమాసం చివరి ఆదివారం సందర్భంగా శ్రీ సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయంలో భక్తులు ఉదయం నుంచే భారీగా తరలివచ్చి బోనాలు సమర్పించారు. ఈ వేడుకలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా, క్రమశిక్షణతో దర్శనం చేసుకునేందుకు ప్రత్యేక క్యూలైన్లు, నీరు, షెడ్లు వంటి సౌకర్యాలను కల్పించారు. ఆలయ ప్రాంగణం విద్యుత్ దీపాలతో అలంకరించబడి, పండుగ శోభను సంతరించుకుంది.
లాల్ దర్వాజ బోనాలు హైదరాబాద్ బోనాల పండుగలో ఒక ముఖ్యమైన ఘట్టం. ఇది హైదరాబాద్లోని అత్యంత పురాతన, ప్రసిద్ధ ఆలయాలలో ఒకటి కావడంతో ఇక్కడ జరిగే ఉత్సవాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. పోతురాజుల విన్యాసాలు, డప్పుల మోతలు, సాంప్రదాయ నృత్యాలతో పండుగ వాతావరణం ఉత్సాహంగా సాగింది.