‘ఒరేయ్ పొట్టోడా’ అంటూ మరోసారి సీఎం రేవంత్ కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు
భూపాలపల్లి ప్రచార పర్వంలో కేటీఆర్ అభ్యంతరకర భాషను వాడుతూ ముఖ్యమంత్రిపై విరుచుకుపడ్డారు. "భూపాలపల్లి జిల్లాను తొలగించబోమని చెప్పడానికి నువ్వెవరు? అసలు నువ్వు పెడితే కదా తీసేయడానికి?" అంటూ రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు.
- Author : Sudheer
Date : 09-02-2026 - 3:35 IST
Published By : Hashtagu Telugu Desk
Telangana Municipal Election Campaign : తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచారం క్లైమాక్స్ దశకు చేరుకోవడంతో రాజకీయ వాతావరణం సెగలు పుట్టిస్తోంది. తాజాగా భూపాలపల్లిలో జరిగిన బహిరంగ సభలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి చేసిన ఘాటు వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారం రేపుతున్నాయి.
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల సమరంలో గెలుపే లక్ష్యంగా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ప్రచారం ముగియడానికి కొన్ని నిమిషాల ముందే నేతల మధ్య మాటల యుద్ధం పరాకాష్టకు చేరుకుంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి సర్కార్ వైఫల్యాలను ఎండగట్టడమే లక్ష్యంగా కేటీఆర్ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. గత పదేళ్లలో కేసీఆర్ నిర్మించిన వ్యవస్థలను ప్రస్తుత ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని, ప్రజల పక్షాన పోరాడేందుకు తాము ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని ఆయన కార్యకర్తల్లో జోష్ నింపుతున్నారు.
‘ఒరేయ్ పొట్టోడా’ అంటూ కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు
భూపాలపల్లి ప్రచార పర్వంలో కేటీఆర్ అభ్యంతరకర భాషను వాడుతూ ముఖ్యమంత్రిపై విరుచుకుపడ్డారు. “భూపాలపల్లి జిల్లాను తొలగించబోమని చెప్పడానికి నువ్వెవరు? అసలు నువ్వు పెడితే కదా తీసేయడానికి?” అంటూ రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. కేసీఆర్ను వ్యక్తిగతంగా విమర్శిస్తే సహించేది లేదని హెచ్చరిస్తూ, ‘ఒరేయ్ పొట్టోడా.. నిన్ను వదిలిపెట్టం’ అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి పాలన కేవలం రెండేళ్లు మాత్రమేనని, ఆ తర్వాత మళ్ళీ గులాబీ జెండా ఎగరడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
పోలీసులకు హెచ్చరిక.. కార్యకర్తలకు భరోసా
కేవలం రాజకీయ ప్రత్యర్థులనే కాకుండా, ప్రభుత్వ యంత్రాంగాన్ని కూడా కేటీఆర్ వదిలిపెట్టలేదు. బీఆర్ఎస్ కార్యకర్తలను వేధిస్తున్న పోలీసు అధికారులకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. “మా కార్యకర్తలను ఇబ్బంది పెడితే పోలీసుల తోకలు కట్ చేస్తాం” అంటూ తీవ్ర స్థాయిలో వ్యాఖ్యానించారు. రెండేళ్ల తర్వాత తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, అప్పుడు లెక్కలన్నీ సరిచేస్తామని హెచ్చరించారు. తొర్రూరు, భూపాలపల్లి సభల్లో కేటీఆర్ చేసిన ఈ ‘ఘాటు’ ప్రసంగాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.