KCR: ఈసారి కేంద్రంపై తన గురి పక్కా అంటున్న కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, సీఎం కేసీఆర్ నిర్ణయాలు అనేవి ఎప్పుపూ కూడా ఊహకందనివిగానే ఉంటాయని ప్రత్యర్ధులతో పాటు తలపండిన మేధావులు కూడా చెబుతూ ఉంటారు. కేసీఆర్ ఆలోచనలు, వ్యూహాలు అనేవి ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి.
- By Hashtag U Published Date - 12:33 PM, Wed - 19 January 22
తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, సీఎం కేసీఆర్ నిర్ణయాలు అనేవి ఎప్పుపూ కూడా ఊహకందనివిగానే ఉంటాయని ప్రత్యర్ధులతో పాటు తలపండిన మేధావులు కూడా చెబుతూ ఉంటారు. కేసీఆర్ ఆలోచనలు, వ్యూహాలు అనేవి ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఆయన సొంతం. రాష్ట్రస్థాయి నుంచి మొదలుకుంటే జాతీయస్థాయి వరకు రాజకీయాలు అంటే ఏంటో పక్కాగా తెలిసిన వ్యక్తి. కొన్ని సందర్భాల్లో కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు బెడిసికొట్టి ఉండొచ్చు.
అలా బెడిసికొట్టిన నిర్ణయాల్లో హుజూరాబాద్ బైపోల్ రిజల్ట్ ఒకటి. జీహెచ్ఎంసీ ఎన్నికలను మినహాయిస్తే… మిగిలిన అన్ని చోట్లా ఆయన వ్యూహాలు ఫలించాయనే చెప్పాలి. దళితబంధు కాస్త ఇబ్బంది పెడుతున్నా… దాన్నుంచి టాపిక్ డైవర్ట్ చేసేందుకు వరి అంశాన్ని తెరమీదకి తెచ్చారు. ఇక ఇదంతా పక్కన బెడితే… ప్రస్తుతం ఆయన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వరుసగా రెండోసారి ఎన్నికై వచ్చే ఏడాది చివరినాటికి మరోసారి ఎన్నికలకు సిద్ధం కాబోతున్నారు. ఆ తర్వాత ఆరు నెలలకు జాతీయస్థాయి ఎన్నికలకు సిద్ధం కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇప్పటి నుంచే తన వ్యూహాలకు పదును పెడుతున్నారు. నిజానికి గత సార్వత్రిక ఎన్నికల సమయంలోనే బీజేపీకి వ్యతిరేకంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలని భావించారు. అందులో భాగంగా ఆయన ఇతర రాష్ట్రాల సీఎం లను కలిశారు. ప్రాంతీయ పార్టీలు కేంద్రంలో చక్రం తిప్పాల్సిన అవసరం ఉందని చెప్పే ప్రయత్నం చేశారు. అప్పట్లో సాధ్యం కాకపోయినా.. ఇప్పుడు తనదైన వ్యూహాలకు మరింత పదునుబెడుతున్నారు కేసీఆర్.
అప్పట్లో మిస్ ఫైర్ అయింది కాబట్టి… ఈ దఫా అలా కాకుండా ఉండేందుకు చాలా జాగ్రత్త పడుతున్నారు గులాబీ దళపతి కేసీఆర్. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం పై రైతుల్లో ఉన్న వ్యతిరేకతను తమకు అనుకూలంగా చేసుకుంటూనే… ఇతర రాష్ట్రాల్లోని బలమైన ప్రాంతీయ పార్టీలను కలుపుకుని సెంట్రల్ పాలిటిక్స్ లో తన పవర్ చూపించాలనుకుంటున్నారు. ఇదే అంశంపై ఇటివలే కేరళ సీఎం పినరయి విజయన్, బీహార్ లో ఆర్జేడీ సారధి తేజస్వి యాదవ్ తో ప్రగతి భవన్ లో ఆయన సమావేశమయ్యారు.
దీనికంటే ముందు.. కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని మోదీ ప్రభుత్వంపై తన వాగ్భాణాలను సంధించారు. రైతు వ్యతిరేక సర్కార్ గా చూపేందుకు ప్రయత్నించారు. కేంద్రం నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నారు. బీజేపీని ఇరుకున పెట్టేందుకు.. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి అధికారం దూరం చేయాలనే ప్రయత్నాలను కేసీఆర్ ప్రారంభించారు. వామపక్ష నేతల్ని కలుపుకునేందుకు కేరళ సీఎం పినరయి విజయన్ తో సమావేశం అయ్యారు. ఇతర రాష్ట్రాల్లోని బీజేపీ వ్యతిరేక పార్టీలను ఒక్కతాటిపైకి తీసుకురావాలనే దృఢ సంకల్పంతో గులాబీ బాస్ ఉన్నారనని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. గత ఎన్నికలకు ముందే బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో భేటీ అయ్యారు.
మరోవైపు ఒడిశా సీఎంతోనూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సన్నిహిత సంబంధాలున్నాయి. అయితే.. భారతీయ జనతా పార్టీ పై కేసీఆర్ ఎంత ఫైర్ అవుతున్నా.. నేషనల్ మీడియాలో అనుకున్నంత కవరేజీ రావడం లేదని తెలుస్తోంది. జాతీయ స్థాయి చానళ్ళ లో ఫోకస్ అయితేనే బీజేపీకి వ్యతిరేకత చూపగలరు. నార్త్ లో భారతీయ జనతా పార్టీకి ఉన్న పాజిటివిటీ అలాంటిది మరి. అందుకే.. ఈనెల 17న జరిగిన కేబినెట్ మీటింగ్ తర్వాత మీడియా సమావేశం నిర్వహించాల్సి ఉంది. కేంద్రం పై ఫైర్ అవ్వాలన్న ఉద్దేశంతో ప్రత్యేకించి నేషనల్ మీడియాకు ఆహ్వానం ఇచ్చారు కూడా. కానీ.. సీఎం ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించలేదు. ఒకవేళ ప్రెస్ మీట్ గనుక పెడితే… ప్రస్తుత కోవిడ్ సమస్యలు కాకుండా జాతీయ రాజకీయాల పైనే ప్రశ్నలు వస్తాయనే ఉద్దేశంతోనే క్యాన్సిల్ చేసుకున్నారని అంటున్నారు. పరిస్థితులను నిశితంగా గమనించిన తర్వాతనే సరైన సమయంలో జాతీయ రాజకీయాలపై మాట్లాడాలనే కేసీఆర్ ఆలోచనగా ఉందని ఆయన సన్నిహితులు అంటున్నారు. ఈసారి మాత్రం పక్కా దేశ రాజకీయాల్లో కేసీఆర్ సంధించే బాణం గురి తప్పకూడదని స్కెచ్ వేస్తున్నారు. అది ఏ మేరకు ఫలిస్తుందో చూడాలి.
Related News
Telangana BJP : తెలంగాణలో బీజేపీకి డబుల్ డిజిటా.. సాధ్యమేనా..?
దేశ వ్యాప్తంగా ఎన్నికల జాతర జరుగుతోంది. మరోమారు అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ ఊవిళ్లూరుతోంది.