KCR Jangaon Public Meeting : జనగాం జిల్లా ఫై హామీల వర్షం కురిపించిన కేసీఆర్
పల్లా రాజేశ్వర్రెడ్డిని గెలిపిస్తే..చేర్యాలను రెవెన్యూ డివిజన్గా ప్రకటిస్తామని ఈ సందర్బంగా కేసీఆర్ హామీ ఇచ్చారు.
- By Sudheer Published Date - 06:59 PM, Mon - 16 October 23

ఎన్నికల ప్రచారం (KCR Election Campaign)లో భాగంగా నేడు సోమవారం బిఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ (KCR) జనగాం జిల్లాలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో (Jangaon Public Meeting) పాల్గొన్నారు. ఈ సందర్బంగా జనగాం జిల్లాకు కేసీఆర్ హామీల వర్షం కురిపించారు.
‘ఎన్నికలు రాంగనే ఆగం కావొద్దు. పరేషన్ కావొద్దు. ఎవరో చెప్పారని ఓటు వేయవద్దు. మా బావమరిది చెప్పిండు. మా మ్యాన మామ చెప్పిండు.. మా అన్నగాడు చెప్పిండని ఓటు వేయొద్దు. ఓటు అనేది మన తలరాతను మారుస్తుంది. మన రాష్ట్ర దశ, దిశను మారుస్తుంది. చాలా ముఖ్యమైన ఆయుధం. ప్రజాస్వామ్యంలో మన చేతిలో ఉండే బలమైన ఆయుధమే ఓటు. దాన్ని ఎటు వినియోగిస్తమో మన ఖర్మ అటే పోతది. ఎవరో చెప్పారని నమ్మితే చాలా ప్రమాదం ఉంటది. కొందరు ఆపద మొక్కులు మొక్కే వారుంటారు. ఐదేళ్లు ఎక్కడ కనిపించరు.. ఎన్నికలు మొపుగాంగనే వస్తరు.. ఇష్టం వచ్చినట్లు మాట్లడుతరు. నోటికి వచ్చినట్లు మాట్లడుతరు. మంచి, చెడు గుర్తించి.. మంచి వైపు వెళితే బ్రహ్మాండమైన ఫలితాలు వచ్చే ఆస్కారం ఉంటుంది’ అని అన్నారు.
బిఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డి (Jangaon BRS Candidate Palla Rajeshwar Reddy)ని గెలిపిస్తే..చేర్యాలను రెవెన్యూ డివిజన్గా ప్రకటిస్తామని ఈ సందర్బంగా కేసీఆర్ హామీ ఇచ్చారు. అలాగే జిల్లాలో మెడికల్ కాలేజీతోపాటు నర్సింగ్, పారామెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తామన్నారు. తెలంగాణ ఏర్పాటు కాకముందు కొన్ని జిల్లాలకు వెళ్తే ఏడుపొచ్చేదని, జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాల పరిస్థితి చూస్తే బాధనిపించేదని ..కానీ ఇప్పుడు రాష్ట్రంలో అన్ని జిల్లాలు , మండలాలు ఎంతగా అభివృద్ధి జరిగాయో చెప్పాల్సిన పనిలేదన్నారు. ఇక రాష్ట్ర రాజధాని హైదరాబాద్కు సమీపంలో ఉన్నందున భవిష్యత్లో జనగామ అభివృద్ధికి విస్త్రృత అవకాశాలు ఉన్నాయన్నారు.
We’re now on WhatsApp. Click to Join.
9 ఏళ్ల కింద తెలంగాణ పరిస్థితి ఎట్ల ఉండే. ఆ నాడు మనం ఏడ్చినా ఎవరూ పట్టించుకోలేదు. ట్రాన్స్ఫార్మర్లు, మోటార్లు కాలిపోతే లంచాలు పెట్టే పరిస్థితి. మూడు నాలుగు రోజులకు వచ్చే వరకు పొలాలు ఉండుతుండే. ఇప్పుడు 24 గంటల కరెంటు ఉంటుంది. నాణ్యమైన కరెంటు వస్తుంది. ఎక్కడా ట్రాన్స్ఫార్మర్లు, మోటర్లు కాలుతలేవు. ఎన్ని మోటర్లు ఉన్నయ్.. ఐదు హెచ్పీ పెట్టినవా అని అడిగే కొడుకే లేడు. ఎందుకంటే తెలంగాణలో వ్యవసాయ స్థిరీకరణ జరగాలే. గ్రామాలు రైతుల పంటలు పండితే.. తింటే దంగుతయా? అని పెద్దలు అన్నరు. ఇప్పుడు పంటలు ఎంట్ల పండుతున్నయో చూస్తున్నరు. రెండు నెలలు కొనుగోలు చేసినా దంగుతలేవు. హెలికాప్టర్లో పోతుంటే గ్రామంలో, రోడ్లపై ఎండబోసిన లక్షల టన్నుల ధాన్యం కండ్లారా కనిపిస్తుంది. దాన్ని చూస్తే మనసు పులకిస్తుంది. తెలంగాణలో అమ్మవారి దయ లక్ష్మీదేవి తాండవం ఆడినట్లు పల్లెలన్నీ కళకళలాడుతున్నయ్. జరంతా మొఖం తెలివికి వచ్చినం. రైతులు ఇప్పుడిప్పుడే అప్పులు మాఫీ చేసుకొని.. వడ్లన్నీ ప్రభుత్వం కొనడంతో మొఖం తెలివి అయినం. ఒకమాదిరి అయినం’ అన్నారు.
Read Also : Revanth Reddy: జర్నలిస్టుల సమస్యలు, సంక్షేమంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి వినతి