Jubilee Hills Bypoll : జూబ్లీహిల్స్ బైపోల్లో గెలిచేది ఆ పార్టీనే – KK సర్వే కీలక రిపోర్ట్
Jubilee Hills Bypoll : జూబ్లీహిల్స్ ఉపఎన్నిక వేళ రాజకీయ ఉత్కంఠ రోజురోజుకీ పెరుగుతోంది. ప్రధానంగా బీఆర్ఎస్ (BRS) మరియు కాంగ్రెస్ పార్టీల మధ్య నేరుగా పోటీ నెలకొన్న పరిస్థితి కనిపిస్తోంది
- Author : Sudheer
Date : 01-11-2025 - 8:30 IST
Published By : Hashtagu Telugu Desk
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక వేళ రాజకీయ ఉత్కంఠ రోజురోజుకీ పెరుగుతోంది. ప్రధానంగా బీఆర్ఎస్ (BRS) మరియు కాంగ్రెస్ పార్టీల మధ్య నేరుగా పోటీ నెలకొన్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే, తాజా కేకే సర్వే అంచనా ప్రకారం ఈ పోటీలో బీఆర్ఎస్ విజయానికి అధిక అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది. ఏరియా వారీగా చేసిన విశ్లేషణలో బీఆర్ఎస్కు కాంగ్రెస్పై 12 నుండి 13 శాతం మెజార్టీ లభించే అవకాశం ఉందని సర్వే పేర్కొంది. ఇది ఉపఎన్నిక ఫలితంపై ప్రభావం చూపే స్థాయిలో ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
సర్వే ప్రకారం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని బోరబండ, శ్రీనగర్ కాలనీ, ఎర్రగడ్డ, షేక్పేట ప్రాంతాల్లో బీఆర్ఎస్ బలంగా ఉందని తేలింది. ఈ ప్రాంతాల్లో మునుపటి ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కుటుంబానికి ఉన్న స్థానిక అనుబంధం, అభ్యర్థి మాగంటి సునీత ప్రజలతో కొనసాగిస్తున్న సాన్నిహిత్యం పార్టీకి అదనపు బలం ఇచ్చిందని సర్వే విశ్లేషణ చెబుతోంది. మరోవైపు రెహమత్ నగర్, వెంగల్ రావు నగర్ ప్రాంతాల్లో మాత్రం కాంగ్రెస్ ప్రభావం కనిపిస్తోంది. ముఖ్యంగా యువత, మధ్యతరగతి ఓటర్లు నవీన్ యాదవ్ పట్ల సానుకూలంగా ఉన్నారని నివేదిక పేర్కొంది.
రాబోయే రోజుల్లో ప్రచార తీరే తుది ఫలితాన్ని నిర్ణయించే అంశమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ తరఫున బడా నాయకుల ర్యాలీలు, బీఆర్ఎస్ తరఫున కవిత, హరీశ్ రావు వంటి నేతల పర్యటనలు ఎన్నికను మరింత రసవత్తరంగా మార్చనున్నాయి. అయితే ఇప్పటి వరకు లభించిన సర్వే డేటా ప్రకారం, జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బీఆర్ఎస్ ఆధిక్యం స్పష్టంగా కనిపిస్తోందని కేకే సర్వే తేల్చిచెప్పింది. ఫలితంగా, ఈ ఎన్నిక హైదరాబాద్ రాజకీయ దిశను నిర్ణయించే సూచికగా మారనుందని భావిస్తున్నారు.