శంషాబాద్ విమానాశ్రయానికి అంతర్జాతీయ అవార్డు
- Author : Vamsi Chowdary Korata
Date : 20-03-2026 - 10:07 IST
Published By : Hashtagu Telugu Desk
Rajiv Gandhi International Airport హైదరాబాద్లోని శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఆర్జీఐఎ) మరోసారి అంతర్జాతీయ స్థాయిలో తన ప్రత్యేకతను చాటుకుంది. ప్రఖ్యాత స్కైట్రాక్స్ సంస్థ నుంచి ‘బెస్ట్ ఎయిర్పోర్ట్ స్టాఫ్ ఇన్ ఇండియా & సౌత్ ఏషియా 2026’ (భారత్, దక్షిణాసియాలో ఉత్తమ విమానాశ్రయ సిబ్బంది) అవార్డును గెలుచుకుంది. ఈ విమానాశ్రయానికి ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారం లభించడం ఇది ఐదోసారి కావడం విశేషం.
లండన్లో జరిగిన ప్యాసింజర్ టెర్మినల్ ఎక్స్పో 2026 కార్యక్రమంలో ఈ అవార్డును అధికారికంగా ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రయాణికుల నుంచి సేకరించిన అభిప్రాయాల ఆధారంగా విమానాశ్రయ సిబ్బంది స్నేహపూర్వక వైఖరి, సేవల నాణ్యతను అంచనా వేసి స్కైట్రాక్స్ ఈ పురస్కారాలను అందిస్తుంది. చెక్-ఇన్, సెక్యూరిటీ, ఇమ్మిగ్రేషన్, బోర్డింగ్ వంటి అన్ని విభాగాల్లో సిబ్బంది పనితీరును దీనికోసం పరిగణనలోకి తీసుకుంటారు.
ఈ అవార్డుతో పాటు శంషాబాద్ విమానాశ్రయం మరికొన్ని ఘనతలను కూడా సాధించింది. భారత్, దక్షిణాసియాలో ‘రెండో ఉత్తమ ప్రాంతీయ విమానాశ్రయం’గా, ‘మూడో ఉత్తమ విమానాశ్రయం’గా నిలిచింది.