Hydra : జగద్గిరిగుట్ట ఆలయ భూముల కబ్జాలపై హైడ్రా కమిషనర్ పరిశీలన
Hydra : గోవిందరాజుల స్వామి ఆలయం, పర్కి చెరువు ప్రాంతాల్లో జరుగుతున్న కబ్జాలపై కమిషనర్ సీరియస్గా స్పందించారు
- By Sudheer Published Date - 03:45 PM, Sat - 18 January 25

కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని జగద్గిరిగుట్ట ఆలయ భూముల (Jagadgirigutta temple) ఆక్రమణలపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ (Hydra Commissioner Shri AV Ranganath) శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టారు. గోవిందరాజుల స్వామి ఆలయం, పర్కి చెరువు ప్రాంతాల్లో జరుగుతున్న కబ్జాలపై కమిషనర్ సీరియస్గా స్పందించారు. ఆలయ పూజారులు అందించిన సమాచారం, వీడియో ఆధారాలతో సంఘటన స్థలాలను పరిశీలించారు.
Madhavi Latha : జెసి ప్రభాకర్ రెడ్డి పై ‘మా’కు మాధవీలత ఫిర్యాదు
2024 జూలై తర్వాత జరిగిన కబ్జాలపై చర్యలు తీసుకుంటామని కమిషనర్ రంగనాధ్ స్పష్టం చేశారు. గూగుల్ మ్యాప్స్ వంటి ఆధారాల సాయంతో కబ్జాల స్థితిని పరిశీలించి కబ్జాదారులకు నోటీసులు జారీ చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలో హైడ్రా పోలీసు స్టేషన్ కూడా 15 రోజుల్లో ప్రారంభమవుతుందని, నాన్-బెయిలబుల్ కేసులు పెట్టడం ద్వారా కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పర్కి చెరువు కబ్జాలను నివారించడానికి పరిరక్షణ కమిటీ ఏర్పాటు చేయాలని, దేవాలయ భూముల పరిరక్షణ కోసం స్థానికులు కూడా కమిటీగా ఏర్పడి చర్యలు తీసుకోవాలని కమిషనర్ సూచించారు. ఈ కమిటీల ద్వారా సమాచారాన్ని వెంటనే హైడ్రాకు చేరవేయాలని, వాట్సాప్ గ్రూప్లను వినియోగించుకోవాలని ఆయన కోరారు. కమిషనర్ తన పరిశీలనలో దేవాలయ ప్రాంతాల కబ్జా వివరాలను పూర్తిగా గుర్తించి, అందుకు కారణమైన అధికారుల నిర్లక్ష్యంపై ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని తెలిపారు. హైడ్రా, రెవెన్యూ, ఇరిగేషన్, దేవాదాయ శాఖల అధికారుల సహకారంతో భూముల రక్షణ చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
ఈ సందర్బంగా జగద్గిరిగుట్ట వేంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కమిషనర్ రంగనాథ్ గారికి ఆశీర్వచనాలు అందజేశారు. భూముల రక్షణకు హైడ్రా కమిషనర్ తీసుకున్న చొరవ పట్ల స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు. ఆలయ భూములు కబ్జా విముక్తి చెందుతాయని, హైడ్రా అధికారులతో కలిసి పని చేస్తామని వారు అభినందనలు తెలిపారు.