Hyderabad First IT Tower: హైదరాబాద్లో మొదటి ఐటీ టవర్ చరిత్ర పుటల్లోకి…
- Author : Vamsi Chowdary Korata
Date : 25-06-2026 - 2:11 IST
Published By : Hashtagu Telugu Desk
నేటి తరం యువతకు ఐటీ కారిడార్, హైటెక్సిటీ అనగానే అందరికీ గుర్తొచ్చే ఏరియాలు మాదాపూర్, గచిబౌలి, నానక్రామ్గూడ, రాయదుర్గం. ఎటు చూసినా ఆకాశాన్ని తాకే గగనతలాలు, అత్యాధునిక గ్లాస్ బిల్డింగులే నేటి ఐటీ నగర రూపురేఖలు. కానీ.. హైదరాబాద్ నగరానికి చెందిన మొదటి తరం ఐటీ ఉద్యోగులను, అనుభవజ్ఞులను అడిగితే వారికి మొదటగా గుర్తొచ్చే ప్రాంతం బేగంపేట. ఎందుకంటే భాగ్యనగరంలో ఐటీ సామ్రాజ్యానికి తొలి పునాది ఇక్కడే పడింది. నగరంలోనే నిర్మితమైన మొట్టమొదటి ఐటీ టవర్గా ఖ్యాతిగాంచిన ఇంటర్గ్రాఫ్ కన్సల్టింగ్ భవనం పూర్తిగా కాలగర్భంలో కలిసిపోతోంది. ఆ ఐటీ భవన సముదాయాన్ని కూల్చివేసేందుకు యాజమాన్యం సిద్ధమైంది.
అమెరికాకు చెందిన ప్రముఖ సాంకేతిక సంస్థ ఇంటర్గ్రాఫ్ కన్సల్టింగ్ 1987లో బేగంపేటలో ఐటీ టవర్ నిర్మించింది. నగరంలో స్థాపించబడిన మొట్టమొదటి అంతర్జాతీయ బహుళజాతి సంస్థ (MNC) ఇదే కావడం విశేషం. ఐటీ రంగంలో హైదరాబాద్ పేరు గ్లోబల్ మ్యాప్పైకి ఎక్కడానికి ఈ సంస్థే తొలి కారణం. దశాబ్దాల పాటు ఎంతోమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లను తయారుచేసిన ఈ ఐకానిక్ భవనం ఇప్పుడు శాశ్వతంగా కనుమరుగవుతోంది. భవన భూగర్భంలో ఉన్న నీటి సంపుటి దెబ్బతినడం, పునాదులు బలహీనపడటంతో భవన భద్రతను దృష్టిలో ఉంచుకుని దానిని కూల్చివేయాలని యాజమాన్యం నిర్ణయించింది. ఈ మేరకు కూల్చివేత పనులు జరుగుతున్నట్లు స్థానిక పోలీసులు ధృవీకరించారు. పాత భవనాన్ని పూర్తిగా తొలగించిన అనంతరం.. అదే స్థలంలో సరికొత్త అధునాతన కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మించే యోచనలో యాజమాన్యం ఉన్నట్లు తెలుస్తోంది.
మాదాపూర్లో సైబర్ టవర్స్ను నిర్మించి.. విప్రో, ఇన్ఫోసిస్ వంటి దిగ్గజ దేశీయ ఐటీ సంస్థలకు పెద్ద ఎత్తున భూములు కేటాయించేంత వరకు నగర ఐటీ రంగానికి బేగంపేట, అమీర్పేట ప్రాంతాలే ప్రధాన కేంద్రాలుగా ఉన్నాయి. అప్పట్లో అంతర్జాతీయ ప్రయాణాలకు అత్యంత అనువుగా.. నగర నడిబొడ్డున బేగంపేట విమానాశ్రయం అందుబాటులో ఉండటం కూడా ఈ ప్రాంతం ఐటీ హబ్గా ఎదగడానికి ప్రధాన కారణమైంది. ఆ రోజుల్లో బ్రిగేడ్, టాటా సెర్విజోల్, విప్రో, ఎయిర్టెల్, ఇంటర్గ్రాఫ్ వంటి దిగ్గజ సంస్థలన్నీ బేగంపేట కేంద్రంగానే తమ కార్యకలాపాలను సాగించాయి.
వీటితో పాటు మేఫిర్, సిటీ సెంటర్ కాంప్లెక్స్లలో సత్యం కంప్యూటర్స్ సంస్థ తన కార్యకలాపాలను నడపగా.. పంజాగుట్టలో ఓఎస్ఐ, బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10లో హెచ్ఎస్బీసీ, సియారా అట్లాంటిక్ సంస్థలు ఉండేవి. సోమాజిగూడ కేంద్రంగా ఏడీపీ, 24/7 కస్టమర్ వంటి అగ్రశ్రేణి కంపెనీలు నగరంలో ఐటీ విప్లవానికి ఊతమిచ్చాయి. నాడు కొన్ని వందల మందితో ప్రారంభమైన ఐటీ ఉద్యోగుల ప్రస్థానం.. నేడు లక్షల మందికి ఉపాధి కల్పించే స్థాయికి చేరింది. ఎందరో మొదటి తరం సాఫ్ట్వేర్ నిపుణులకు ఉపాధినిచ్చి, జీవితాలను నిలబెట్టిన హైదరాబాద్ మొదటి ఐటీ టవర్ ఇంటర్గ్రాఫ్ భవనం నేడు జ్ఞాపకంగా మిగిలిపోతుండటంతో పాత తరం టెక్కీలు తీవ్ర భావోద్వేగానికి లోనవుతున్నారు.