కోదాడ బస్టాండ్ వద్ద నడిరోడ్డుపై వెంటాడి.. భార్యను చంపిన భర్త
- Author : Vamsi Chowdary Korata
Date : 07-05-2026 - 8:56 IST
Published By : Hashtagu Telugu Desk
సూర్యాపేట జిల్లా కోదాడలో దారుణం చోటుచేసుకుంది. కట్టుకున్న భార్యను ఓ భర్త నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే కత్తితో పొడిచి అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. బుధవారం రాత్రి కోదాడ బస్టాండ్ వద్ద ఈ ఘోరం జరిగింది. పోలీసులతో కౌన్సెలింగ్ తీసుకుని బయటకు వచ్చిన కొద్దిసేపటికే ఈ దారుణానికి పాల్పడటం తీవ్ర కలకలం రేపుతోంది.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. కోదాడలోని బాబునగర్కు చెందిన మణిదీప్ లారీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా జగ్గయ్యపేటకు చెందిన శిరీష (24)ను ఆరేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి రెండేళ్ల కుమారుడు ఉన్నాడు. కొంతకాలంగా వీరిద్దరి మధ్య కుటుంబ కలహాలు జరుగుతున్నాయి. రెండు రోజుల క్రితం జరిగిన గొడవతో బుధవారం శిరీష, ఆమె పెద్దమ్మ, మణిదీప్ కోదాడ పోలీస్ స్టేషన్కు వెళ్లారు. పోలీసులు ఇరువర్గాలకు సర్దిచెప్పి పంపించారు.
అయితే, పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చాక ఈ ఘోరం జరిగింది. జగ్గయ్యపేట వెళ్లేందుకు పెద్దమ్మతో కలిసి శిరీష ఆటో ఎక్కగా, మణిదీప్ ఆమెను బలవంతంగా బయటకు లాగాడు. ప్రాణభయంతో ఆమె సమీపంలోని టీ స్టాల్లోకి పరుగెత్తగా కత్తితో వెంటాడి విచక్షణారహితంగా పొడిచాడు. తీవ్ర రక్తస్రావంతో ఉన్న శిరీషను ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
ఈ దాడి దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. నిందితుడు మణిదీప్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శివశంకర్ తెలిపారు.