EC – Karnataka Ads : తెలంగాణ పత్రికల్లో కర్ణాటక ప్రభుత్వ యాడ్స్ ఆపేయండి :ఈసీ
EC - Karnataka Ads : కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి తెలంగాణ న్యూస్ పేపర్లలో యాడ్స్ ఇవ్వడాన్ని ఆపేయాలని కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) ఆదేశించింది.
- Author : Pasha
Date : 28-11-2023 - 7:45 IST
Published By : Hashtagu Telugu Desk
EC – Karnataka Ads : కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి తెలంగాణ న్యూస్ పేపర్లలో యాడ్స్ ఇవ్వడాన్ని ఆపేయాలని కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) ఆదేశించింది. ఇప్పటివరకు తెలంగాణ న్యూస్ పేపర్లలో ఇచ్చిన యాడ్స్పై సంజాయిషీ ఇవ్వాలని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సోమవారం రాత్రి నోటీసులు ఇష్యూ చేసింది. బీజేపీ నాయకుల ఫిర్యాదుతో ఈమేరకు ఈసీ చర్యలు తీసుకుంది.
We’re now on WhatsApp. Click to Join.
కేంద్ర ప్రభుత్వం కానీ.. ఎన్నికలు జరగని రాష్ట్రాలు కానీ వాటి సంక్షేమ పథకాల గురించి ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో ప్రకటనలు ఇవ్వడం ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందికి వస్తుందని గతంలోనే ఈసీ పేర్కొంది. అయినా తెలంగాణ న్యూస్ పేపర్లలో కర్ణాటక ప్రభుత్వం యాడ్స్ ఇవ్వడాన్ని తప్పుబడుతూ కేంద్ర మంత్రి భూపేందర్యాదవ్, బీజేపీ నాయకులు ప్రకాశ్ జావడేకర్, సునీల్బన్సల్, తరుణ్ఛుగ్, సుధాంశు త్రివేది, ఓంపాఠక్లు ఈసీఐకి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఈసీఐ.. తెలంగాణలో అలాంటి యాడ్స్ ఇక ఇవ్వొద్దని, ఇలా ఎందుకు చేశారో మంగళవారం సాయంత్రం 5 గంటల్లోగా వివరణ ఇవ్వాలని కర్ణాటక సీఎస్కు ఆర్డర్ ఇచ్చింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు కర్ణాటక ప్రభుత్వ సమాచార, ప్రజాసంబంధాల విభాగం సెక్రెటరీ ఇన్ఛార్జిపై క్రమశిక్షణ చర్యలు ఎందుకు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని(EC – Karnataka Ads) సూచించింది.