Dark politics : ముసుగు వీరులు! రాష్ట్రాల్లో ఖేదం ఢిల్లీలో మోదం!
రాజకీయాల్లో ఎవరు ఎవరితో ఒప్పందాలు కుదుర్చుకున్నారు? అనేది తేల్చడం కష్టంగా మారింది.
- By CS Rao Published Date - 01:49 PM, Fri - 16 December 22
తెలుగు రాజకీయాల్లో ఎవరు ఎవరితో చీకిటి(dark) ఒప్పందాలు కుదుర్చుకున్నారు? అనేది తేల్చడం కష్టంగా మారింది. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం, వైఎస్సాఆర్ తెలంగాణ పార్టీ మధ్య అవగాహన ఉందని కాంగ్రెస్ చెబుతోంది. అందుకే, కేవలం ఆరుగురు ఎంపీలున్న బీఆర్ఎస్ పార్టీకి ఢిల్లీ నడిబొడ్డున ఖరీదైన స్థలాన్ని ప్రధాని నరేంద్ర మోడీ(Modi) ఇప్పించారని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పదేపదే చెప్పే మాట. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఒకటేనని బీజేపీ చీఫ్ బండి సంజయ్(Sanjay) పదేపదే చేసే వ్యాఖ్య. కాంగ్రెస్ పార్టీ సహకారంతోనే మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిచిందని బీజేపీ చెబుతోంది. అంతేకాదు, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎంలు జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ మధ్య విడదీయరాని రాజకీయబంధం ఉందని సంజయ్(Sanjay) చెబుతున్నారు.
ప్రజా సంగ్రామ యాత్ర ఐదో విడత ముగింపు సభలో ఇద్దరు సీఎంల మధ్య ఉన్న బంధాన్ని చెప్పారు. జై ఆంధ్రా, జై తెలంగాణ నినాదాలను అందుకుని మళ్లీ సీఎంలుగా కావాలని జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ ప్లాన్ చేశారని బండి చేస్తోన్న ఆరోపణ. ఇద్దరు సీఎంలు ఒక్కటేనని, `దోచుకో, దాచుకో` అనే సిద్ధాంతం ప్రకారం పాలన సాగిస్తున్నారని బండి సంజ య్(Sanjay) ఆరోపించారు. తెలంగాణ సెంటిమెంట్ ను ఉపయోగించుకుని రాజకీయ లబ్ది పొందాలని ప్లాన్ చేస్తున్నారని ఆయన అనుమానిస్తున్నారు. ఏపీ ప్రజలు తిరస్కరించకుండా జై ఆంధ్రా అంటూ జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ ప్రజలు ఛీ కొట్టకుండా జై తెలంగాణ నినాదాన్ని కేసీఆర్ వినిపిస్తారని అన్నారు. అందుకు తగిన విధంగా విభజన చట్టంలోని హామీలపై సుప్రీం కోర్టుకు జగన్ సర్కార్ ఇప్పుడు వెళ్లడం గమనార్హం.
ఉమ్మడి ఆస్తిగా ఉన్న హైదరాబాద్
వాస్తవంగా విభజన చట్టంలోని 9, 10 షెడ్యూల్ ఆస్తుల పంపకం 2014 నుంచి జరగలేదు. వాటికి సంబంధించిన సంప్రదింపులు చంద్రబాబు సీఎంగా ఉన్నపుడు జరిగాయి. ఆ తరువాత 2019లో సీఎంగా బాధ్యతలు స్వీకరించిన జగన్మోహన్ రెడ్డి ఉమ్మడి ఆస్తుల పంపకంపై ఎలాంటి సంప్రదింపులు జరపలేదు. పైగా ఆయన సీఎం అయిన తొలి రోజుల్లో ఉమ్మడి ఆస్తిగా ఉన్న హైదరాబాద్ లోని సచివాలయం, అసెంబ్లీలోని వాటాను ఉదారంగా కేసీఆర్ కు అప్పగించారు. తెలంగాణ వ్యాప్తంగా ఉమ్మడి ఆస్తుల్లో ఏపీకి వాటా ఉంది. సుమారు 6 లక్షల కోట్ల విలువగల సంపద పంపకానికి నోచుకోలేదు. ప్రత్యేకించి హైదరాబాద్ కేంద్రంగా ఏపీ ఆస్తులు ఉన్నాయి. వాటి గురించి మూడున్నరేళ్లుగా మౌనంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి తాజాగా సుప్రీం కోర్టు మెట్లు ఎక్కారు. ఫలితంగా ఇరు రాష్ట్రాల మధ్య సెంటిమెంట్ రేగనుంది. దాన్ని రాజకీయంగా వాడుకోవాలని ఇద్దరు సీఎంలు చూస్తున్నారని బీజేపీ తెలంగాణ చీఫ్ బండి చేస్తోన్న వాదన.
వాస్తవంగా ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్ మధ్య విడదీయరాని అనుబంధం ఉంది. సామాజిక, రాజకీయ, ఆర్థిక సహాయ సహకారాలను జగన్మోహన్ రెడ్డికి 2019 ఎన్నికల సందర్భంగా కేసీఆర్ సంపూర్ణంగా అందించారు. ఆనాటి నుంచి ఇద్దరూ కలిసిమెలసి ఉన్నారు. అంతేకాదు, కేంద్రంలోని మోడీ సర్కార్ కు అన్ని విధాలా సహకారం అందిస్తున్నారు. గత ఏడాది ముంచిత్తల్ రామానుజాచార్యుల విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమం నుంచి మోడీకి దూరంగా కేసీఆర్ మెలుగుతున్నారు. అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి మాత్రం మోడీ సర్కార్ కు అన్ని విధాలుగా మద్ధతు ఇస్తున్నారు. అంతేకాదు, రాజకీయాలకు అతీతమైన అనుంబధం మోడీ(Modi)తో ఉందని ఇటీవల విశాఖ కేంద్రంగా జరిగిన ఒక ప్రోగ్రామ్ లో జగన్ వెల్లడించారు. అంటే, తెర వెనుక మోడీ, కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి ఒక్కటే అనే విషయం ఎవరికైనా అర్థం అవుతోంది.
చంద్రబాబు టార్గెట్ గా
తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఈసారి కింగ్ కావాలని చూస్తోంది. కింగ్ మేకర్ గా ఎదగాలని ఏపీలో ప్లాన్ చేస్తోంది. ఆ దిశగా పావులు కదుపుతోన్న బీజేపీ ఇప్పుడు ఇద్దరు సీఎంలను టార్గెట్ చేసింది. రాష్ట్ర స్థాయి వరకు మాత్రమే రాజకీయ పోట్లాట ఉండేలా ఆ మూడు పార్టీలు స్కెచ్ వేసుకున్నట్టు కనిపిస్తోంది. మిగిలిన పార్టీలను రాజకీయ తెరమీద హైలెట్ కాకుండా బీఆర్ఎస్, బీజేపీ, వైసీపీ గేమాడుతున్నాయని రాజకీయ వర్గాల్లోని చర్చ. ఇటీవల జనసేనాని పవన్ కల్యాణ్ దూకుడును మోడీ ద్వారా వైసీపీ అడ్డుకుంది. చంద్రబాబు టార్గెట్ గా ఇరు రాష్ట్రాల్లోనూ బీజేపీ, బీఆర్ఎస్, వైసీపీ చీకటి(Dark) గేమ్ ను ఆడుతున్నాయని రాజకీయ పండితుల భావన.
బీఆర్ఎస్ ఏపీలోకి ఎంట్రీ ఇవ్వడం ద్వారా సెంటిమెంట్ ను ఇరు రాష్ట్రాల్లో పండించడానికి కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి సిద్ధం అవుతున్నారని బీజేపీ భావిస్తోంది. ఇదంతా రాష్ట్ర స్థాయిలో ఆ పార్టీల మధ్య పోరు మాత్రమే. జాతీయ కోణంలో ఆ మూడు పార్టీలు ఒకటేనని ప్రజలు గ్రహించాలని కాంగ్రెస్ చెబుతోంది. మొత్తం మీద ఎవరు ఎవరితో కలిసి చీకటి రాజకీయాలు చేస్తున్నారో అర్థంకాని విధంగా తెలుగు రాష్ట్రాల రాజకీయాన్ని మార్చేశారు. కరీంనగర్ వేదికగా ఇద్దరు సీఎంల మీద బండి(Sanjay) చేసిన కామెంట్లు గందరగోళం రాజకీయానికి ఆజ్యం పోసింది.
CM KCR : కేసీఆర్ మాయ! జై భారత్, జై తెలంగాణ కనికట్టు!
Tags
Related News
Congress : లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రేవంత్ కు భారీ షాక్ తగలబోతుందా..?
హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే , కాంగ్రెస్ నేత అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి