Bandi Bhagirath: బండి భగీరథ్కు కండీషనల్ బెయిల్…
- Author : Vamsi Chowdary Korata
Date : 20-06-2026 - 2:22 IST
Published By : Hashtagu Telugu Desk
గత కొన్ని రోజులుగా తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన బండి భగీరథ్ పోక్సో కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కోర్టు శనివారం కీలక తీర్పును వెలువరించింది. బండి భగీరథ్ తరఫు న్యాయవాదులు దాఖలు చేసిన రెగ్యులర్ బెయిల్ పిటిషన్ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం.. అతనికి షరతులతో కూడిన బెయిల్ను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో నెల రోజులకు పైగా జైల్లో ఉన్న బండి భరీరథ్ జైలు నుంచి విడుదల కానున్నారు.
ఈ కేసు వివరాల్లోకి వెళితే.. మే 2026 మొదటి వారంలో హైదరాబాద్లోని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో బండి భగీరథ్పై ఒక కేసు నమోదైంది. ఒక 17 ఏళ్ల మైనర్ బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఈ కేసును నమోదు చేశారు. గత ఆరు నెలలుగా భగీరథ్ తమ కుమార్తెను పెళ్లి చేసుకుంటానని నమ్మించి, మానసికంగా వేధించాడని ఆ తల్లి ఆరోపించింది. మొయినాబాద్లోని ఒక ఫామ్హౌస్లో బాలికకు బలవంతంగా మద్యం తాగించి, అసభ్యంగా ప్రవర్తించాడని ఫిర్యాదులో పేర్కొంది. దీంతో పోలీసులు భగీరథ్పై పోక్సో చట్టం సెక్షన్ 11 కింద కేసు నమోదు చేశారు.
అయితే, ఈ పోక్సో కేసు నమోదు కావడానికి కొన్ని గంటల ముందే.. బండి భగీరథ్ కూడా కరీంనగర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో సదరు బాలిక కుటుంబంపై రిటర్న్ ఫిర్యాదు చేశారు. సదరు బాలిక, ఆమె తల్లిదండ్రులు తప్పుడు కేసు పెడతామని బెదిరిస్తూ తన నుండి రూ.5 కోట్లు వసూలు చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. తాము మొదట్లో స్నేహపూర్వకంగానే ఉన్నామని, అయితే ఆ తర్వాత వారు తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చారని, తిరస్కరించేసరికి డబ్బుల కోసం బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టారన్నారు. ఈ మేరకు ఆ బాలిక కుటుంబంపై కూడా ఎక్స్టార్షన్ కింద కేసు నమోదైంది.
ఈ కేసు తీవ్రత దృష్ట్యా సైబరాబాద్ పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. అరెస్టు నుంచి తప్పించుకోవడానికి భగీరథ్ తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే, కేసు తీవ్రతను పరిశీలించిన హైకోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. హైకోర్టు బెయిల్ నిరాకరించడంతో పోలీసులు భగీరథ్ కోసం గాలింపు ముమ్మరం చేశారు. లుకౌట్ నోటీసులు జారీ చేసి, హైదరాబాద్, కరీంనగర్ పరిసరాల్లో ఐదు ప్రత్యేక బృందాలతో వెతికారు. అనంతరం మే 16 పోలీసులు బండి భగీరథ్ను నార్సింగి సమీపంలోని టీజీపీఏ జంక్షన్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. కోర్టు జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో చర్లపల్లి జైలుకు తరలించారు.
ఈ నేపథ్యంలోనే భగీరథ్ లాయర్లు జిల్లా కోర్టులో బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇరుపక్షాల న్యాయవాదుల మధ్య హోరాహోరీగా వాదనలు జరిగాయి. బండి భగీరథ్ తరఫున వాదించిన సీనియర్ కౌన్సిల్.. ఈ కేసులో భగీరథ్కు ఎలాంటి ప్రత్యక్ష ప్రమేయం లేదని, కేవలం రాజకీయ ప్రాధాన్యత ఉన్న కుటుంబం కావడంతోనే కావాలని కొందరు ఈ కేసులోకి లాగారని న్యాయస్థానానికి వివరించారు. దర్యాప్తునకు భగీరథ్ పూర్తిస్థాయిలో సహకరిస్తారని, సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం లేదని కాబట్టి ఆయనకు బెయిల్ మంజూరు చేయాలని కోరారు. ఇరువర్గాల వాదనలను క్షుణ్ణంగా పరిశీలించిన న్యాయమూర్తి.. కేసు తీవ్రతను, నిందితుడి పూర్వాపరాలను పరిగణనలోకి తీసుకుని చివరికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు.