1 Cr Check : బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కి కోటి రూపాయిలు ఇచ్చిన సీఎం రేవంత్
1 Cr Check : హైదరాబాద్ పెరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన రాష్ట్ర అవతరణ వేడుకల్లో ముఖ్యమంత్రి ఈ నగదు పురస్కారాలను లబ్ధిదారులకు అందజేశారు
- Author : Sudheer
Date : 02-06-2025 - 3:49 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఉద్యమంలో కీలకంగా పాల్గొన్న కవులు, కళాకారులు, సాహితీవేత్తలకు గుర్తింపుగా కోటి రూపాయల నగదు (1 Cr ) పురస్కారాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth) అందజేశారు. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ రోజునే ఈ నగదు బహుమతుల విషయాన్ని సీఎం ప్రకటించారు. ప్రజల్లో స్పూర్తిని రగిలించిన ఉద్యమకారుల కృషిని గుర్తిస్తూ తొమ్మిది మందికి కోటి చొప్పున నగదు చెక్కులు ఇవ్వాలని నిర్ణయించారు.
Red Book : తెలంగాణలోనూ రెడ్ బుక్..
హైదరాబాద్ పెరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన రాష్ట్ర అవతరణ వేడుకల్లో ముఖ్యమంత్రి ఈ నగదు పురస్కారాలను లబ్ధిదారులకు అందజేశారు. ఎక్కా యాదగిరిరావు, అందెశ్రీ, సుద్దాల అశోక్ తేజ, జయరాజు, పాశం యాదగిరి స్వయంగా కార్యక్రమానికి హాజరై నగదు చెక్కులు స్వీకరించారు. గూడ అంజయ్య, గద్దర్, బండి యాదగిరి దివంగతుల కావడంతో, వారి కుటుంబ సభ్యులు ఈ పురస్కారాలను అందుకున్నారు. గోరటి వెంకన్న హాజరుకాలేకపోయినా ఆయన కుమార్తె చెక్ను తీసుకున్నారు.
గోరటి వెంకన్న (Gorati Venkanna) ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉన్నప్పటికీ తనకు వచ్చిన పురస్కారం విషయమై కొన్ని సందేహాలు వ్యక్తం చేశారు. ఆయన “కేసీఆర్ అనుమతితో తీసుకుంటాను” అని గతంలో చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఆయన స్వయంగా హాజరుకాకపోయినా, ఆయన కుమార్తె చెక్కు తీసుకోవడం ద్వారా పురస్కారాన్ని తిరస్కరించలేదని అర్థమవుతోంది. ఇదిలా ఉండగా నందిని సిధారెడ్డి మాత్రం బహిరంగంగా తన అవార్డును తిరస్కరించామని ప్రకటించారు. ఈ పరిణామాలు రాజకీయ వాతావరణాన్ని కొద్దిగా వేడెక్కించాయి.