KTR : స్టేషన్ ఘన్పూర్కు త్వరలో ఉప ఎన్నిక : కేటీఆర్
స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గానికి చెందిన మాజీ జెడ్పీటీసీ మారుపాక రవి, మాజీ ఎంపీపీ బుచ్చయ్య, ఇతర నేతలు తిరిగి బీఆర్ఎస్లో చేరారు. కండువా కప్పి కేటీఆర్ వారిని పార్టీలోకి ఆహ్వానించారు.
- By Latha Suma Published Date - 05:53 PM, Thu - 15 August 24

By-election:స్టేషన్ ఘన్పూర్(station ghanpur)కు త్వరలోనే ఉప ఎన్నిక వస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఉప ఎన్నికలో బీఆర్ఎస్ నుండి రాజయ్య గెలుపు ఖాయమన్నారు. హైకోర్టులో తీర్పు సానుకూలంగా వస్తుందని ఆశిస్తున్నామని, మిగతా వాళ్లపై నేరుగా సుప్రీంకోర్టుకు వెళ్లాలని ఆలోచిస్తున్నట్టు తెలిపారు. సభాపతి రాజకీయ పక్షపాతం చూపిస్తూ ఫిరాయింపులపై నిర్ణయం తీసుకోవడం లేదని వ్యాఖ్యానించారు. స్టేషన్ ఘన్పూర్కు చెందిన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలను కేటీఆర్ బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు.
We’re now on WhatsApp. Click to Join.
స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గానికి చెందిన మాజీ జెడ్పీటీసీ మారుపాక రవి, మాజీ ఎంపీపీ బుచ్చయ్య, ఇతర నేతలు తిరిగి బీఆర్ఎస్లో చేరారు. కండువా కప్పి కేటీఆర్ వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ” కేసీఆర్ ఉన్నప్పుడు కరెంటు పోతే వార్త.. రేవంత్ వచ్చాక కరెంట్ ఉంటే వార్త. రుణమాఫీ సభకు రావాలని రాహుల్ గాంధీని ఆహ్వానించారు. రుణమాఫీ కాలేదని తెలుసుకొని రాహుల్ గాంధీ రాలేదు. కల్యాణ లక్ష్మి కింద ఇవ్వడానికి బంగారం దుకాణాలు దొరకలేదా? ఆడ పిల్లలకు రేవంత్రెడ్డి 2.5లక్షల తులాల బంగారం బాకీ ఉన్నారు. రేవంత్రెడ్డి సోదరులను ఏ ప్రజలు గెలిపించారు? రేవంత్ బామ్మర్ది కంపెనీకి రూ.వెయ్యి కోట్ల పనులు ఇచ్చారు.
కవిత జైలులో ఉంటే అన్నగా నేను ఢిల్లీ పోయి కలవొద్దా? కవిత కేసు విషయంపై న్యాయవాదులతో మాట్లాడవద్దా? బీజేపీతో ఒప్పందం ఉంటే కవిత 150 రోజులుగా జైల్లో ఉంటుందా? ఒక్క కాంగ్రెస్ నేత అయినా జైల్లో ఉన్నారా?త్వరలో కేసీఆర్ పార్టీ కార్యక్రమాలు ఇస్తారు. కొద్ది రోజుల్లోనే కేసీఆర్ నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తారు. కేసీఆర్ పూర్తి చేసిన సీతారామ ప్రాజెక్టుకు రేవంత్ వెళ్లి రిబ్బన్ కట్ చేస్తున్నారు. స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లని బీసీ డిక్లరేషన్లో చెప్పారు. రిజర్వేషన్లు పెంచకుండానే స్థానిక సంస్థల ఎన్నికలు పెడతారు. బీజేపీ నేతలు.. కాంగ్రెస్, రేవంత్ చెప్పినట్టే నడుచుకుంటున్నారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ నేతలు ప్రజల్లో తిరగలేని పరిస్థితి వస్తుంది” అని కేటీఆర్ అన్నారు.