Bandi Sanjay Letter : కేసీఆర్కు బండి సంజయ్ బహిరంగ సవాల్
- By Hashtag U Published Date - 12:11 PM, Sat - 16 April 22
పాలమూరుకు రండి … సాగునీటి ప్రాజెక్టులపై చర్చిద్దాం అంటూ ‘కేసీఆర్’ కు ‘బండి సంజయ్’ బహిరంగ లేఖ..!
గౌరవనీయులైన శ్రీ కె.చంద్రశేఖరరావు గారికి,
ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.
నమస్కారం …
విషయం: పాలమూరు జిల్లాలో పెండింగ్ లో వున్న సాగునీటి ప్రాజెక్టులను సత్వరమే పూర్తిచేయడం, వలసల నివారణకు చర్యలు చేపట్టడం గురించి …
బిజెపి చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర రెండో విడత పాదయాత్రలో భాగంగా ప్రస్తుతం నేను ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పర్యటిస్తున్నాను. ఈ సందర్భంగా ఏ గ్రామానికి వెళ్ళినా సాగునీటి సమస్యలను, వలసలను, ఉపాధిపై ఈ ప్రాంతంలోని ప్రజలు, రైతాంగం నా దృష్టికి తీసుకవచ్చారు.వెనుకబడిన పాలమూరు జిల్లాలో పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించి వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకరావాలనే ఉద్దేశ్యంతో ప్రజా సంగ్రామ యాత్ర చేపడితే మీ సుపుత్రుడు(కేటీఆర్), మీ పార్టీ వారు పాదయాత్రపైన విషం కక్కుతున్నారు.2009 లో మీరు మహబూబ్నగర్ పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాను దత్తత తీసుకొని సాగునీటి సమస్య లేకుండా సస్యశ్యామలం చేస్తానని జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ధి చేసి వలసలు లేని ప్రాంతంగా పాలమూరును తీర్చిదిద్దుతానని చేసిన వాగ్ధానాలేమీ అమలుకు నోచుకోలేదు.గడిచిన 8 ఏండ్ల కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఏ సాగునీటి ప్రాజెక్టు పూర్తికాలేదు. గత ప్రభుత్వాలు పూర్తిచేసిన సాగునీటి ప్రాజెక్టులను మీ ఖాతాలో వేసుకొని పాలమూరంతా సస్యశ్యామలం అయిందని అసత్య ప్రచారం చేస్తున్నారు.పాలమూరు జిల్లా నుండి వలసలు కొనసాగుతూనే వున్నాయి. పొట్టచేతబట్టుకొని వేలాది మంది బడుగు బలహీనవర్గాల వారు దేశం నలుమూలలకు వలసలు పోతున్నారు. బొంబాయి వెళ్లే ఆర్టీసీ బస్సు రద్దు చేసి పాలమూరులో వలసలు ఆగిపోయాయని నమ్మబలికే ప్రయత్నం చేస్తున్నారు. వ్యవసాయానికి యోగ్యమైన వేలాది ఎకరాల భూమి వున్నా సాగునీరు లేక పాలమూరు ప్రజలు పొట్టచేతపట్టుకుని ఇతర ప్రాంతాలకు వలసలు పోతున్నారు.
హెలేంక్సీలో జరిగిన అంతర్జాతీయ జలసదస్సు నియమాల ప్రకారమైన, బచావత్ అవార్డ్ ఆదేశాల మేరకైన పరివాహక ప్రాంత ప్రజల అవసరాలు తీర్చాకే ఇతర ప్రాంతాలకు జలవనరులు కేటాయించాలి. కానీ గత 150 సంవత్సరాలుగా కృష్ణాజలాలు బేసిన్ దాటి బయటికి పోతున్నా పాలకులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు.పాలమూరు ` రంగారెడ్డి, కల్వకుర్తి ఎత్తిపోతల నిర్మాణం సత్వరమే పూర్తిచేసి పాలమూరు రైతులను సాగునీటి కష్టాల నుండి ఒడ్డున పడివేయాలన్న శ్రద్ధ ప్రభుత్వంలో కనిపించడం లేదు. నారాయణపేట` కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని ఇప్పటికే అటకెక్కించారు. రాజోలి బండ ద్వారా పాలమూరుకు చుక్కనీరు అందడం లేదు. నెట్టెంపాడు, భీమ, కోయిల్ సాగర్ వంటి పథకాలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకొని ప్రయత్నాలేవి జరగడం లేదు.కృష్ణా, గోదావరి నదీ జలాల్లో తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన వాటా దక్కలేదు.తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం జరిగిన పోరాటంలో నీళ్ల సమస్య కూడా ఒక ప్రధాన కారణం. 2014లో తెలంగాణ ఏర్పాటు అనంతరం అధికారంలోకి వచ్చిన మీరు తెలంగాణ ప్రయోజనాలను కాపాడడంలో పూర్తిగా విఫలమయ్యారు. 2014లో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత న్యాయంగా తెలంగాణకు దక్కాల్సిన జలాలను, ముఖ్యంగా కృష్ణా నదీ జలాలను కాపాడడంలో మీరు పూర్తిగా విఫలమయ్యారు.రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ (RDS) ద్వారా ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజలకు 15.9 టీఎంసీలు ఇవ్వాలి. ఇప్పటివరకు కనీసం 5 టీఎంసీల నీరు కూడా తెలంగాణ ప్రజలు వినియోగించడం లేదన్న విషయం పాలమూరు జిల్లాల్లో ఏ ఒక్కరిని అడిగినా చెబుతారు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా మీరు, టీఆర్ఎస్ పార్టీ వారు ఈ అంశాన్ని రాజకీయంగా ఉపయోగించేందుకు మాత్రమే మాట్లాడుతున్నారు. ఈ అంశంపై ప్రజల్లో సెంటిమెంట్ పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణ ఉద్యమం సమయంలో కూడా ఇది ప్రధాన సమస్యలలో ఒకటి. కానీ, ఎనిమిదేళ్ల మీ పాలనలో పాలమూరు రైతుల వినియోగానికి ఆర్డీఎస్ నుంచి 15.9 టీఎంసీల నీటిని అందజేయడంలో మీరు, టీఆర్ఎస్ పూర్తిగా విఫలమయ్యారు. ఆర్డీఎస్ జలాలు రాబట్టడంలో ఎందుకు విఫలమయ్యారో పాలమూరు ప్రజలకు మీరు జవాబు చెప్పాలి?
మీ ఎనిమిదేళ్ల పాలనలో తెలంగాణ రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల కోసం దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలను ఖర్చు చేశారు. ఈ డబ్బంతా ఎక్కడికి పోయింది? కాంట్రాక్టర్ల ద్వారా మీ కుటుంబానికి, మీ బంధువులకు, మీ పార్టీ వారికి చేరింది.
ఏపీ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపడంలో మీరు విఫలం అయ్యారు:
5 మే 2020న, కృష్ణాపై శ్రీశైలం జలాశయం నుండి రోజుకు ఆరు నుండి ఎనిమిది టిఎంసిల నీటిని అదనంగా తీసుకునే లక్ష్యంతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ తోపాటు ఇతర పథకాలకు ఏపీ ప్రభుత్వం జీవో నం. 203 జారీ చేసింది. ఈ స్కీంతో కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా భారీగా నష్టపోనుంది. మీ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ఈ సమస్యను పూర్తిగా విస్మరించింది. తెలంగాణకు జరగనున్న అన్యాయాన్ని భారతీయ జనతా పార్టీ మాత్రం సహించలేదు. ఈ అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాం. 12 మే 2020న కేంద్ర జలవనరుల శాఖ మంత్రికి స్వయంగా నేనే లేఖ రాశాను. నా లేఖకు కేంద్ర మంత్రి గారు వెంటనే స్పందించారు. అపెక్స్ కౌన్సిల్ ఆమోదం పొందే వరకు ఏపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టులను కొనసాగించడాన్ని నిలిపివేయాలని కృష్ణా బోర్డు ద్వారా ఏపీ ప్రభుత్వానికి తెలిపింది. (15 మే 2020, 20 మే 2020, 16 జూన్ 2020, 1 జూలై 2020 మరియు 30 జూలై 2020) కేఆర్ ఎంబీ 5 లేఖలు రాసింది. తెలంగాణకు న్యాయంగా రావలసిన నీటి వాటాలను, చట్టబద్ధమైన ప్రయోజనాలను కేంద్రం కాపాడుతుందని ఈ విషయం ద్వారా తెలుస్తుంది. తెలంగాణ ప్రయోజనాలకు నష్టం కలుగుతున్నా.. ఏపీ అక్రమ ప్రాజెక్టులు కడుతున్న విషయాన్ని కేంద్రం దృష్టికి మీరు తీసుకెళ్ల లేదు. కనీసం తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి లేఖ కూడా రాయకపోవడం ఆశ్చర్యకరం.
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం కోసం టెండర్లను ప్రకటించింది. ఈ టెండర్లు 11 ఆగస్టు 2020న తెరిచి 15 ఆగస్టు 2020 నాటికి పనులు ఆయా సంస్థలకు కేటాయింపు జరిగింది. తర్వాత ప్రతిపాదిత స్థలంలో పనులు ప్రారంభమవుతాయని తెలిసినా మీరు స్పందిచలేదు. ఏపీకి సహకారం అందించి నీటి వాటాను దోచి పెట్టేందుకు మీరు ప్రయత్నించారు. అప్పుడు మళ్లీ ఈ విషయంలో నేను కేంద్ర జలవనరుల శాఖ మంత్రికి లేఖ ద్వారా వివరించి ఈ విషయంపై చర్చించడానికి అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని అభ్యర్థించారు. కేంద్రం వెంటనే స్పందించి, ఈ అంశంపై చర్చించేందుకు 2020 ఆగస్టు 5న అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్ది ఈ సమస్యను పరిష్కరించేందుకు కేంద్రం మరోసారి శ్రద్ధ చూపింది. మీ ప్రమేయం లేకుండా తెలంగాణ ప్రయోజనాలు నెరవేరుతున్నందుకు సంతోషించాల్సిన మీరు … అందుకు విరుద్ధంగా ఆగస్టు 5 ,2020న జరగాల్సిన సమావేశాన్ని ఆగస్టు 20.2020 తేదీకి వాయిదా వేయాలని కోరారు. ఇందుకు చెప్పిన కారణం బిజీగా ఉన్నారని చెప్పి తెలంగాణ ప్రభుత్వం అపెక్స్ కౌన్సిల్ సమావేశం వాయిదా వేసుకున్నారు.తెలంగాణ ప్రజల నీటి హక్కులను కాపాడటం కంటే మీకు ముఖ్యమైన పని ఏంముంది..? వాయిదా అడగడానికి అసలు కారణం ఏమిటంటే, అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని 20 ఆగస్టు 2020 తర్వాత వాయిదా వేయమని కోరడం ద్వారా 2020 ఆగస్టు 15లోపు పనులు మంజూరు చేయడంలో ఏపీకి సహాయం చేసేందుకు మీరు ఉద్దేశపూర్వకంగా ప్రయత్నించారు. ఈ సమావేశం 2020 ఆగస్టు 5వ తేదీన జరిగితే కేంద్రం సూచించినట్లుగా, ఆ సమావేశంలో ఏపీకి సంబంధించిన పనుల మంజూరును నిలిపివేయవచ్చు. అయితే అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని వాయిదా వేయాలని మీరు కోరడం ఏపీ సీఎంకు పరోక్షంగా ఉపయోగపడింది. ఏపీ సీఎంతో కుమ్మక్కై, తద్వారా తెలంగాణ ప్రజల ప్రయోజనాలను మీరు పణంగా పెడుతున్నారని ఇప్పుడు చాలా స్పష్టంగా అర్థమవుతోంది.ఇప్పటికే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం 90% పని పూర్తయింది. దీనికి మీదే పూర్తి బాధ్యత. కృష్ణా జలాలను ఏపీ దోచుకోవడం వల్ల తెలంగాణ శాశ్వతంగా నష్టపోవాల్సి వస్తోంది. ఇలా జరగడానికి మీరు అనుమతించడం, సహకరించడం సిగ్గుచేటు. 811 టీఎంసీల కృష్ణా జలాల్లో తెలంగాణకు కేవలం 299 టీఎంసీలకే మీరు అంగీకరించారు. ఈ 811 టీఎంసీల్లో తెలంగాణకు వాస్తవానికి 555 టీఎంసీలు రావాలి. 299 టీఎంసీలకు అంగీకరించి కృష్ణా జలాలపై తెలంగాణ హక్కులను మీరు కాలరాశారు.
బచావత్ ట్రిబ్యునల్ అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 811 టీఎంసీల నీటిని వినియోగించుకోవాలని తీర్పునిచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ (ఏపీ) రాష్ట్రాల మధ్య ఈ 811 టీఎంసీల పంపిణీ అంశంపై కేంద్రం ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు చర్చించాయి. కృష్ణా నదీ జలాలపై తమ వాదన ఏంటని తెలంగాణను కేంద్రం ప్రశ్నించింది. తెలంగాణ 299 టీఎంసీలు, ఏపీ 512 టీఎంసీలు వినియోగించుకునేందుకు మీరు అంగీకరించారు. దీనికి సీఈవో ఏర్పాటు చేసిన సమావేశాల్లో మీరు అంగీకరించారు.
2015 సంవత్సరానికి గానూ 2015 జూన్ 19న, 2016 జూన్ 21వ తేదీన ఢిల్లీలో జరిగిన మొదటి అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో 2016 సంవత్సరానికి.. 2017 నవంబర్ 4వ తేదీన జరిగిన 7వ కేఆర్ ఎంబీ సమావేశంలో ఈ 2017 తర్వాతా అదే 299 టీఎంసీల నీటివాటాకు మీరు అంగీకరించారు. ఇది సరైనది కాదు. ఎందుకంటే కృష్ణా బేసిన్ పరీవాహక ప్రాంతంలో 68.5 తెలంగాణ పరిధిలో ఉంది. దాని ప్రకారం తెలంగాణకు 555 టీఎంసీ (811 టీఎంసీలో 68.5%) రావాలి. కానీ కేవలం 299 టీఎంసీలకే అంగీకరించి మనకు రావాల్సిన 555 టీఎంసీల వాటాను దక్కించుకోకుండా మీరు రాష్ట్ర ప్రయోజనాలను కాలరాశారు. 299 టీఎంసీలకు అంగీకరించి కృష్ణా నదీ జలాలపై తెలంగాణకు న్యాయమైన నీటి హక్కులను కాపాడడంలో మీరు విఫలమయ్యారు. మీ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు మీరు కేంద్రాన్ని నిందించడం శోచనీయం.
ఏళ్ల తరబడి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పెండింగ్ లో వున్న సాగునీటి ప్రాజెక్టులు పూర్తికాకపోవడంతో రైతులు వ్యవసాయానికి బోర్లు, వర్షాలపైనే ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరుతో కమీషన్లకు కక్కుర్తి పడి, పాలమూరు జిల్లాలో పెండింగ్ లో వున్న ప్రాజెక్టులను పూర్తిచేయకుండా నిర్లక్ష్యంగా ఉండటం గర్హనీయం. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యం, పాలమూరు ప్రజల పట్ల జరుగుతున్న వివక్షపై చర్చ జరగాల్సిన అవసరం ఉన్నది.పాలమూరు సాగునీటి ప్రాజెక్టులపై చర్చించేందుకు మేము సిద్ధంగా వున్నాము. మీరు దీనిపై చర్చించడానికి సిద్ధమా? పాలమూరు జిల్లాలో పెండింగ్ లో వున్న సాగునీటి ప్రాజెక్టులను వెంటనే పూర్తిచేయాలని, వలసలు అరికట్టి ప్రజలకు ఉపాధి కల్పించే చర్యలు చేపట్టాలని బిజెపి డిమాండ్ చేస్తోంది. ప్రభుత్వం స్పందించకుంటే పాలమూరు ప్రజల పట్ల తన వివక్షను, నిర్లక్ష్యాన్ని కొనసాగించేందుకే నిర్ణయించుకున్నట్లు భావించాల్సి వస్తోందని లేఖలో పేర్కొన్నారు బండి సంజయ్.
Related News
Bandi Sanjay: కేసీఆర్ దేశద్రోహి, మోదీ లేకపోతే భారత్ మరో పాకిస్తాన్: బండి
కరీంనగర్ ‘మహా బైక్ ర్యాలీ’లో పాల్గొన్న బండి సంజయ్ మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అలాగే ప్రధాని నరేంద్ర మోడీ లేకపోతే భారత్ మరో పాకిస్తాన్ లా మారే ప్రమాదం ఉందన్నారు.