Maoists: భారత్ బంద్: మావోయిస్టుల పిలుపుతో హై అలర్ట్.. తెలంగాణ–ఛత్తీస్గడ్ సరిహద్దుల్లో కూంబింగ్
వెంకటాపురం మండలం సీతారాంపురం గ్రామంలో, ఏటూరునాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ నేతృత్వంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు.
- Author : Hashtag U
Date : 10-06-2025 - 8:13 IST
Published By : Hashtagu Telugu Desk
ములుగు: మావోయిస్టు పార్టీ (Maoist Party) పిలుపుతో భారత్ బంద్ (Bharat Bandh) నేడు, మంగళవారం nation-wide గా ప్రకటించడంతో, తెలంగాణ–ఛత్తీస్గడ్ సరిహద్దు ప్రాంతాల్లో భద్రతా బలగాలు హై అలర్ట్ ప్రకటించాయి. ఏవోబీ (AOB – Andhra-Odisha Border) పరిధిలో సైతం బలగాలు అప్రమత్తమయ్యాయి.
ములుగు జిల్లాలోని వెంకటాపురం, వాజేడు మండలాల్లో సురక్షిత చర్యల భాగంగా కార్డన్ సెర్చ్ ఆపరేషన్లు కొనసాగుతున్నాయి. మావోయిస్టులకు సహకరించవద్దని ప్రజలకు పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.
వెంకటాపురం మండలం సీతారాంపురం గ్రామంలో, ఏటూరునాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ నేతృత్వంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. మావోయిస్టులు ప్రతీకార దాడులకు పాల్పడే అవకాశముందన్న ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు, భద్రతా బలగాలు భారీగా కూంబింగ్ ఆపరేషన్లలో నిమగ్నమయ్యాయి.
ఈ బంద్కు కారణం, మావోయిస్టుల కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు ఎన్కౌంటర్పై వ్యతిరేకత. అతడి మృతికి నిరసనగా ఈ బంద్కు పిలుపునిచ్చినట్లు మావోయిస్టు పార్టీ ప్రకటించింది.
మావోయిస్టులు మే 21వ తేదీని “భారత విప్లవోద్యమ చరిత్రలో చీకటి రోజు”గా ప్రకటించడంతో, ఈ రోజు బంద్ సందర్భంగా హింసాత్మక ఘటనలు జరిగే ప్రమాదం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు.
ప్రస్తుతం తెలంగాణ–ఛత్తీస్గడ్ సరిహద్దు ప్రాంతాల్లో పోలీసులు, ఆర్మీ, గ్రేహౌండ్స్ బలగాలు పూర్తిస్థాయిలో నిఘా ఉంచి, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నాయి.