TRS Politics: 21 ఏళ్ల టీఆర్ఎస్ పార్టీ దూకుడుగా ఉందా? దుడుకుతనంతో ఉందా?
21 ఏళ్లు. అంటే నవ యవ్వనంతో మిడిసిపడే వయసు. ఏది తప్పు, ఏది ఒప్పు అని ఆలోచించుకుని అడుగేసే వయసు.
- By Hashtag U Published Date - 11:30 AM, Sun - 24 April 22
21 ఏళ్లు. అంటే నవ యవ్వనంతో మిడిసిపడే వయసు. ఏది తప్పు, ఏది ఒప్పు అని ఆలోచించుకుని అడుగేసే వయసు. కానీ టీఆర్ఎస్ గత 21 ఏళ్ల ప్రయాణం చూస్తే.. 2014కు ముందు ఒకలా ఉంది. 2014 తరువాత మరోలా ఉంది. అంటే.. ఉద్యమపార్టీగా ఉన్నప్పుడు దాని పంథా వేరే. ఎన్నికల్లో గెలిచి అధికారపార్టీగా మారిన తరువాత దాని తీరు వేరే. అందుకే పవర్ లోకి వచ్చిన తరువాత కూడా తొలి ఐదేళ్లు గులాబీ దళం ఆడిందే ఆట. పాడిందే పాటగా చెలామణి అయ్యింది. కానీ ఇప్పుడు మాత్రం క్షేత్రస్థాయిలో ఆ పార్టీకి సవాళ్లు ఎదురవుతున్నాయి. పార్టీ కార్యకర్తలు, నాయకులపై వస్తున్న ఆరోపణలు విజయావకాశాలను దెబ్బతీసేవిగా మారుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. మరిప్పుడు టీఆర్ఎస్ ప్లీనరీ దీనికి సమాధానం ఇస్తుందా? అసలు ఈ పరిస్థితులపై ఆత్మావలోకనం చేసుకుంటుందా?
టీఆర్ఎస్ కు క్షేత్రస్థాయిలో సవాళ్లు ఎదురవుతున్నాయా? అసలే అవుననే చెప్పాలి. ఎందుకంటే ఈమధ్యకాలంలో చోటుచేసుకున్న కొన్ని ఘటనలు చూస్తే.. ఆ విషయం అర్థమవుతుంది. ఒక అంశంలో చూస్తే.. ఓ అమ్మాయిపై అత్యాచార ఘటనలో స్థానిక టీఆర్ఎస్ నేతకు సంబంధముందన్న ఆరోపణలు వచ్చాయి. మరో ఘటనను పరిశీలిస్తే.. బీజేపీ కార్యకర్త ఆత్మహత్యకు స్థానిక మంత్రి వేధింపులే కారణమన్న ఆరోపణలు వెలుగుచూశాయి. ఇంకో ఘటనలో అయితే.. అప్పుల పాలైన కుటుంబం ఆత్మహత్య చేసుకోవడానికి ఎమ్మెల్యే కొడుకే కారణమన్న ఆరోపణలు బయటికొచ్చాయి. మరో ఘటనను చూస్తే.. ఓ రియల్టర్ కుటుంబం ఆత్మహత్యకు కారణం..స్థానిక టీఆర్ఎస్ నేతలు, పోలీసులే కారణమన్న ఆరోపణలు వెలుగుచూశాయి. ఇవన్నీ టీఆర్ఎస్ కు స్థానికంగా సవాల్ విసురుతున్నాయి. ఓరకంగా చెప్పాలంటే గులాబీ దళానికి ఇది నష్టాన్ని చేకూర్చేదే. ఎందుకంటే ఇవి ప్రజల్లో కాని పార్టీపై వ్యతిరేక ముద్రను వేస్తే.. అది గెలుపు అవకాశాలను దారుణంగా దెబ్బతీస్తుంది.
ఏ రాజకీయ పార్టీపైన అయినా ప్రజల్లో మూడు స్థాయిల్లో వ్యతిరేకత ఉంటుంది. తొలి స్థాయిలో చూస్తే.. ముఖ్యమంత్రిపైనో, లేదో పార్టీ పైనో వ్యతిరేకత ఉంటుంది. రెండో స్థాయిలో చూస్తే పార్టీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉంటుంది. మూడో స్థాయిలో చూస్తే.. పార్టీ స్థానిక నాయకత్వంపైన ఉంటుంది. వారి ఆగడాలకు ఏకంగా పార్టీయే బలయ్యే పరిస్థితి నెలకొంటుంది. అంటే ఈ మూడు స్థాయిల్లో ప్రజలకు ఉన్న వ్యతిరేకతను పోగొడితే కాని పార్టీ విజయం సాధిస్తుందని చెప్పలేం. కానీ ఈ వ్యతిరేకత ఎన్ని స్థాయిల్లో ఉందో చాలా జాగ్రత్తగా, పరిశీలనగా గమనిస్తే కాని అర్థం కాదు.
ఒక్కోసారి ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉన్నా.. రాష్ట్రస్థాయిలో పార్టీపైన, ప్రభుత్వంపైన, ముఖ్యమంత్రిపైన సానుకూలత ఉండొచ్చు. అలాంటప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థులను మారిస్తే.. సమస్య పరిష్కారమవుతుంది. అదే ముఖ్యమంత్రిపైనో, ప్రభుత్వంపైనో వ్యతిరేకత ఉంటే.. మరిన్ని సంక్షేమ పథకాలను ప్రవేశపెడతారు. అంటే దళితులకు ముఖ్యమంత్రి పదవి, మూడెకరాల భూమి హామీలు అమలు కాలేదు అన్న అసంతృప్తిని అధిగమించడానికి రైతు బంధు పథకం తీసుకొచ్చారు. అదే హుజూరాబాద్ ఎన్నికల్లో ఓటమి ఎదురైనప్పుడు.. సమస్య ఎక్కడుందో గమనించారు. నిరుద్యోగ యువతలో తీవ్రమైన వ్యతిరేకత ఉందని అర్థం చేసుకున్న వెంటనే.. భారీ ఎత్తున ఉద్యోగాలను భర్తీ చేయడానికి ప్రకటన చేశారు. ఇదంతా కాదూ.. పార్టీపైనే వ్యతిరేకత వస్తే మాత్రం.. ఎన్ని చేసినా దానిని తొలగించుకోవడం చాలా కష్టమవుతుంది. ఒక్కోసారి ఓటమి కూడా తప్పదు. అయితే ఎన్నికలకు ఇంకా సమయముంది కనుక.. ఈలోపు పరిస్థితిని చక్కదిద్దడానికి చాలా అవకాశాలున్నాయి అని మర్చిపోకూడదు.
ఇప్పుడు టీఆర్ఎస్ చేయాల్సింది ఏమిటంటే.. పార్టీ లోకల్ యంత్రాంగంలో కార్యకర్తలు, నాయకులు.. క్షేత్రస్థాయిలో ప్రజలతో ఎలా వ్యవహరిస్తున్నారు.. ప్రత్యర్థులను ఎలా డీల్ చేస్తున్నారు.. వారి వ్యవహార శైలి వల్ల వచ్చే లాభనష్టాలేమిటి అని ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో సరిచూడాలి. లోటుపాట్లుంటే వెంటనే సరిదిద్దాలి. లేదంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. టీఆర్ఎస్ నేతలపై ఆరోపణలు వస్తున్నాయి కదా అంటే.. ప్రతిపక్షాలు ఆరోపించాయనో, మీడియాలో వచ్చాయనో.. అలాంటివాటిపై వెంటనే చర్యలు తీసుకోలేం. ఆరోపణలు వచ్చినవారి వాదనా వినాలి కదా అని కేటీఆర్ ఓ ఇంటర్వ్యూలో అన్నారు. తప్పుంటే తమవారు.. పరాయివారు అన్న బేధం లేకుండా చర్యలు తీసుకుంటామనీ చెప్పారు. సో, ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ హైకమాండ్.. అసలు క్షేత్రస్థాయిలో ఉన్న లోపాలేమిటో కచ్చితంగా దృష్టి పెట్టాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.
ఈ ప్లీనరీలో అయినా టీఆర్ఎస్ లో క్షేత్రస్థాయి పరిస్థితులు ఎలా ఉన్నాయో చర్చ జరగాలి. అసలు దీనిపై చర్చ ఉంటుందో లేదో.. పార్టీ యంత్రాంగానికి సూచనలు, సలహాలు ఇస్తారో లేదో, దిశానిర్దేశం చేస్తారో లేదో చూడాలి.
Related News
LS Polls : సికింద్రాబాద్, మల్కాజిగిరిలో ఆంధ్రా సెటిలర్ల ఓట్లు నిర్ణయాత్మకం
లోక్సభ ఎన్నికల్లో అభ్యర్థుల భవితవ్యాన్ని ఖరారు చేయడంలో హైదరాబాద్లో స్థిరపడిన ఆంధ్రప్రదేశ్కు చెందిన వ్యక్తులతో రాజకీయ పార్టీలు రకరకాల వాగ్దానాలతో వారిని ప్రలోభపెడుతున్నాయి.