UPI: యూపీఐ యూజర్లకు మరో శుభవార్త.. ఆ లిమిట్ పెంచుతూ ఆర్బీఐ నిర్ణయం!
యూపీఐ ట్రాన్సాక్షన్ చేసేవారికి తాజాగా మరొక శుభవార్తను తెలుపుతూ ఆర్బీఐ ఒక సరికొత్త నిర్ణయాన్ని తీసుకుంది.
- By Anshu Published Date - 03:06 PM, Mon - 9 December 24

ఇటీవల కాలంలో స్మార్ట్ ఫోన్ ల వినియోగం పెరిగిపోవడంతో వాటితో పాటు ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం వంటి డిజిటల్ వాలెట్స్ వినియోగం కూడా విపరీతంగా పెరిగిపోయింది. ప్రతి ఒక్క ఆండ్రాయిడ్ మొబైల్ లో యూపీఐ లావా దేవీలు కచ్చితంగా జరుగుతున్నాయి. అయితే రోజురోజుకీ ఈ వ్యాలెట్స్ యూజర్ల సంఖ్య పెరిగిపోతుండడంతో అందుకు అనుగుణంగానే యూపీఏ పేమెంట్స్ కూడా అనేక రకాల మార్పులు చేర్పులు చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా చిన్న చిన్న పేమెంట్స్ ను క్షణాల్లో చేసేందుకు వీలుగా యూపీఐ లైట్ సేవలను తీసుకొచ్చిన విషయం తెలిసిందే.
యూపీఐ లైట్ ద్వారా యూజర్లు పిన్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేకుండానే పేమెంట్స్ చేసుకోవచ్చు. ఇది ఇలా ఉంటే తాజాగా ఆర్బీఐ ఇప్పటి వరకు ఉన్న యూపీఐ లైట్ వ్యాలెట్ పరిమితిని పెంచుతూ తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఒక్క యూపీఐ లైట్ ట్రాన్సాక్షన్ విలువ రూ. 500 గా ఉండగా ప్రస్తుతం రూ. 1000 కి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే వ్యాలెట్ లిమిట్ రూ. 2000గా ఉండగా దానిని రూ. 5000 కి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. యూపీఐ లైట్ లో కేవలం పిన్ మాత్రమే కాకుండా ఇంటర్నెట్ తో సంబంధం లేకుండా ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు.
ఆఫ్లైన్ మోడ్ లో తక్కువ మొత్తంతో కూడిన ట్రాన్సాక్షన్స్ ను సులభతం చేసే లక్ష్యంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2022లో జారీ చేసిన ఆఫ్లైన్ ఫ్రేమ్ వర్క్ ని తాజాగా సవరించింది. ఇందులో భాగంగానే లిమిట్స్ ను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. రిజర్వ్ బ్యాంక్ తీసుకున్న ఈ నిర్ణయంతో యూపీఐ పేమెంట్స్ కి మరింత ఆదరణ లభించడం ఖాయం అనే అభిప్రాయాలు ఎక్కువగా వ్యక్తం అవుతున్నాయి. అయితే తాజాగా ఆర్బీఐ తీసుకున్న ఈ నిర్ణయంతో వినియోగదారులు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వీటితో పాటుగా ఇప్పుడు మరికొన్ని కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకురాబోతోంది ఆర్బీఐ.