Team India: వన్డే సీరీస్ కు రెడీ అవుతున్న టీమ్ ఇండియా
దక్షిణాఫ్రికాతో మూడు టెస్ట్ల సిరీస్ను 1-2 తేడాతో కోల్పోయిన టీమిండియా బుధవారం నుంచి ప్రారంభం కానున్న మూడు వన్డేల సిరీస్ కు సన్నద్ధమవుతోంది.
- By Hashtag U Published Date - 10:54 AM, Mon - 17 January 22

దక్షిణాఫ్రికాతో మూడు టెస్ట్ల సిరీస్ను 1-2 తేడాతో కోల్పోయిన టీమిండియా బుధవారం నుంచి ప్రారంభం కానున్న మూడు వన్డేల సిరీస్ కు సన్నద్ధమవుతోంది. టెస్టు సిరీస్ ఓటమి నేపథ్యంలో.. కనీసం వన్డే సిరీస్లోనైనా గెలిచి పరువు నిలుపుకోవాలని టీమిండియా భావిస్తోంది. ఇక మరోవైపు వన్డేల్లోనూ గెలిచి సొంతగడ్డపై తమకు తిరుగులేదని చెప్పాలని సౌతాఫ్రికా యోచిస్తోంది.. ఈ క్రమంలో వన్డే మ్యాచ్లన్నీ హోరాహోరీగా సాగడం ఖాయంగా కనిపిస్తుంది.. ఇక ఈ మ్యాచ్ లన్నీ భారత కాలమాన ప్రకారం మధ్యాహ్నం 2 గంటలకి ప్రారంభంకానున్నాయి.
భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జనవరి 19న పార్ల్ వేదికగా తొలి వన్డే జరగనుండగా.. ఆ తర్వాత అదే వేదికగా జనవరి 21న రెండో వన్డే జరగనుంది. ఇక కేప్ టౌన్ వేదికగా.. జనవరి 23న మూడో వన్డే జరగనుంది.. ఇక ఈ వన్డే సిరీస్ కోసం ఇప్పటికే 19 మందితో కూడిన జట్టుని బీసీసీఐ ప్రకటించగా.. అందులో యువ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ కరోనా బారిన పడడంతో ఈ పర్యటనకు దూరమయ్యాడు.. అతని స్థానంలో జయంత్ యాదవ్తో పాటు నవదీప్ సైనీకి జట్టులో చోటు దక్కింది.
ఇక ఈ 3 వన్డేల సిరీస్ లో సఫారీలను డీ కొట్టే భారత వన్డే జట్టుకు కేఎల్ రాహుల్ సారథిగా ఉండగా , శిఖర్ ధావన్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, వెంకటేశ్ అయ్యర్, రిషబ్ పంత్ ఇషాన్ కిషన్, చాహల్, అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్, ప్రసీద్ క్రిష్ణ, శార్ధూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, జయంత్ యాదవ్, నవదీప్ సైనీలు అందులో చోటు దక్కించుకున్నారు. ఇక ఈ వన్డే సిరీస్ లో దక్షిణాఫ్రికా జట్టుకు తెంబ బవుమా కెప్టెన్ గా ఉండగా, ఆడెన్ మర్క్రమ్, డేవిడ్ మిల్లర్, దుస్సేన్, హమ్జా, జెన్నీమన్ మలాన్, మార్కో జాన్సెన్, పార్నెల్, పెహ్లువాయో, ప్రిటోరియస్, డికాక్, వీరెనె, కేశవ్ మహరాజ్, సిసండ మగాల, లుంగి ఎంగిడి, కగిసో రబాడ, షంషీ చోటు దక్కించుకున్నారు…