సఫారీలతో వన్డే సిరీస్.. ఆ నలుగురికి లాస్ట్ ఛాన్స్
ఐపీఎల్ మెగా వేలానికి టైమ్ దగ్గర పడుతోంది. ఫిబ్రవరి 12, 13 తేదీల్లో బెంగళూరు వేదికగా ఆటగాళ్ల వేలం జరగబోతోంది. దేశవాళీ క్రికెటర్లతో పాటు విదేశీ స్టార్ ప్లేయర్స్ అందరూ వేలంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. గఅయితే భారత జట్టులో నలుగురు సీనియర్ క్రికెటర్లకు మాత్రం రానున్న సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ పరీక్షగానే చెప్పాలి.
- By Hashtag U Published Date - 03:07 PM, Tue - 4 January 22
ఐపీఎల్ మెగా వేలానికి టైమ్ దగ్గర పడుతోంది. ఫిబ్రవరి 12, 13 తేదీల్లో బెంగళూరు వేదికగా ఆటగాళ్ల వేలం జరగబోతోంది. దేశవాళీ క్రికెటర్లతో పాటు విదేశీ స్టార్ ప్లేయర్స్ అందరూ వేలంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. గఅయితే భారత జట్టులో నలుగురు సీనియర్ క్రికెటర్లకు మాత్రం రానున్న సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ పరీక్షగానే చెప్పాలి. ఐపీఎల్ వేలంలో మంచి ధర దక్కించుకోవాలంటే ఈ వన్డే సిరీస్ లో ఆ నలుగురు రాణించాల్సిందే. ఒక విధంగా ఆ నలుగురు సీనియర్ ప్లేయర్స్ కూ ఈ సిరీస్ చివరి అవకాశమని భావిస్తున్నారు. ఆ నలుగురిలో ముందు చెప్పుకోవాల్సింది ఓపెనర్ శిఖర్ ధావన్ గురించే. చాలా కాలంగా జాతీయ జట్టుకు దూరమైన ధావన్ ను సౌతాఫ్రికాతో సిరీస్ కు ఎంపిక చేశారు. గత 6 ఐపీఎల్ సీజన్లలోనూ 500కు పైగా పరుగులు చేసిన ధావన్ అంతర్జాతీయ క్రికెట్ లో ఫామ్ అందుకోవడం అతని కెరీర్ పరంగానూ ముఖ్యమే. గత సీజన్ వరకూ ఢిల్లీ క్యాపిటల్స్ కు ఆడిన ధావన్ కు ఆ ఫ్రాంచైజీ 5.2 కోట్లు చెల్లించింది. ఐపీఎల్ లో ఫామ్ ప్రకారం వేలంలో ధావన్ కు ఈ ధర మళ్ళీ రావాలంటే సఫారీ గడ్డపై మెరుపులు మెరిపించాల్సిందే.
మరో సీనియర్ ఆటగాడు భువనేశ్వర్ కుమార్ కు కూడా ఈ సిరీస్ చివరి అవకాశంగా చెప్పొచ్చు. ఒకప్పుడు భారత పేస్ దళంలో ప్రధాన బౌలర్ గా అదరగొట్టిన భువి తర్వాత గాయాలతో సతమతమై లైన్ అండ్ లెంగ్త్ కోల్పోయాడు. గత రెండు ఐపీఎల్ ఎడిషన్లలో కేవలం 9 వికెట్లు మాత్రమే తీయగలిగాడు భువనేశ్వర్. దీంతో సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ లో రాణించకుంటే ఈ స్టార్ పేసర్ తక్కువ ధరకే పరిమితమవక తప్పదు. సన్ రైజర్స్ హైదరాబాద్ గత సీజన్ వరకూ 8.5 కోట్లు చెల్లించింది.మరోవైపు సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కు కూడా సఫారీలతో జరిగే వన్డే సిరీస్ కీలకం కానుంది. చాలా రోజుల తర్వాత మూడు ఫార్మేట్లలోనూ జాతీయ జట్టుకు ఆడుతున్నప్పటకీ గత ఐపీఎల్ సీజన్ లో పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. 13 మ్యాచ్ లలో కేవలం 7 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. దీంతో ఐపీఎల్ ఫ్రాంచైజీలను ఆకట్టుకోవాలంటే సౌతాఫ్రికా గడ్డపై తన స్పిన్ మ్యాజిక్ చూపించాల్సిందే. గత సీజన్ వరకూ అశ్విన్ ఏడాదికి 7.6 కోట్లు అందుకున్నాడు.
ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాజీ స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్ కూడా సఫారీ గడ్డపై సత్తా చాటేందుకు ఎదురుచూస్తున్నాడు. ఐపీఎల్ 2021 సీజన్ లో రషీద్ ఖాన్ తో కలిసి అత్యధిక వికెట్లు తీసిన స్పిన్నర్ గా నిలిచిన చాహల్ వచ్చే మూడు సీజన్లలో మంచి ధర దక్కించుకోవాలంటే సౌతాఫ్రికాపై రాణించక తప్పదు. ఆర్సీబీ తరపున సీజన్ కు 6 కోట్లు అందుకున్న చాహల్ 114 ఐపీఎల్ మ్యాచ్ లలో 139 వికెట్లు పడగొట్టాడు. మొత్తం మీద దక్షిణాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్ ఈ నలుగురి సీనియర్ల ఐపీఎల్ ధరను నిర్ణయిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు.
Related News
T20I Player Rankings: టీ20 ర్యాంకింగ్స్లో టాప్లో సూర్యకుమార్ యాదవ్..!
టీ20 అంతర్జాతీయ క్రికెట్లో బ్యాట్స్మెన్ ర్యాంకింగ్స్ లో భారత పేలుడు బ్యాట్స్మెన్ సూర్యకుమార్ యాదవ్ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాడు.