World Cup 2023: ఇంగ్లండ్ పై శ్రీలంక ఘన విజయం
- Author : Praveen Aluthuru
Date : 27-10-2023 - 12:08 IST
Published By : Hashtagu Telugu Desk
World Cup 2023: ప్రపంచకప్లో ఇంగ్లండ్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. గురువారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో జోస్ బట్లర్ నేతృత్వంలోని ఇంగ్లండ్ 8 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టు 33.2 ఓవర్లలో 156 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం శ్రీలంక 25.4 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. పాతుమ్ నిస్సాంక, సదీర అర్ధసెంచరీ భాగస్వామ్యంతో శ్రీలంక విజయం సాధించింది. పాతుమ్ నిస్సాంక (77 నాటౌట్; 83 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లు), సదీర సమరవిక్రమ (65నాటౌట్; 54 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్) ఇంగ్లాండ్ బ్యాటర్లలో బెన్స్టోక్స్ (43; 73 బంతుల్లో 6 ఫోర్లు), బెయిర్ స్టో (30; 31 బంతుల్లో 3 ఫోర్లు), డేవిడ్ మలాన్ 28 పరుగులు చేశాడు. మిగతా బ్యాటర్లు చేతులెత్తెయ్యడంతో ఇంగ్లాండ్ స్వల్ప స్కోరుకే ఆలౌట్ అయింది.
ఐదు మ్యాచ్ల్లో డిఫెండింగ్ ఛాంపియన్కు ఇది నాలుగో ఓటమి. ప్రపంచకప్ 2023 పాయింట్ల పట్టికలో ఇంగ్లాండ్ జట్టు 9వ స్థానంలో ఉంది. 2023 ప్రపంచకప్లో సెమీ-ఫైనల్కు చేరుకునే మార్గం ఇంగ్లండ్కు చాలా కష్టంగా మారింది . ఆదివారం భారత్తో జరిగే మ్యాచ్లో ఇంగ్లండ్ జట్టు ఓడిపోతే టోర్నీ నుంచి నిష్క్రమించడం ఖాయం. జోస్ బట్లర్ సారథ్యంలోని ఇంగ్లండ్ సెమీ ఫైనల్ చేరాలంటే భారత్ పై రాణించాల్సి ఉంటుంది. సెమీ-ఫైనల్కు అర్హత సాధించేందుకు జట్లకు కనీసం 12 పాయింట్లు అవసరం. కానీ ఆట నియమాల ప్రకారం నాలుగో స్థానంలో నిలిచిన జట్టు 10 లేదా 8 పాయింట్లతో కూడా సెమీ-ఫైనల్కు అర్హత సాధిస్తుంది.
Also Read: Priyanka Gandhi: ప్రియాంక గాంధీకి ఈసీ షోకాజ్ నోటీసు