Dhoni : చెన్నై కెప్టెన్సీకి ధోనీ గుడ్ బై ?
ఐపీఎల్ 2022 సీజన్ ముంగిట చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. ఆ జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి మహేంద్ర సింగ్ ధోనీ తప్పుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
- By Hashtag U Published Date - 11:00 AM, Mon - 17 January 22

ఐపీఎల్ 2022 సీజన్ ముంగిట చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. ఆ జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి మహేంద్ర సింగ్ ధోనీ తప్పుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. జట్టు భవిష్యత్తు దృష్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. చెన్నై జట్టు తదుపరి సారథిగా స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్గా రాణించగల సత్తా అతడికే ఉందని భావించిన ఎంఎస్ ధోని… చెన్నై ఫ్రాంచైజీతో ఇప్పటికే ఈ విషయం గురించి చర్చించినట్లు వార్తలు వస్తున్నాయి. ఆటగాడిగా ధోనికి ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్ కానుందనే వార్తలు కూడా వినిపిస్తున్న నేపథ్యంలో ఇది కీలక పరిణామమే. ఇప్పటి నుంచే జడేజా తన జట్టును తయారుచేసుకునే విధంగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
గత సీజన్లో విజేతగా నిలిచిన తర్వాత కూడా ధోనీ భవిష్యత్తు కెప్టెన్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వచ్చే పదేళ్లకు జట్టును తయారు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పాడు. ఈ క్రమంలోనే కొత్త కెప్టెన్ గా జడ్డు పేరును సూచించినట్టు సమాచారం. అటు త్వరలో జరగనున్న మెగా వేలంలో యువ ఆటగాళ్ల పైనే చెన్నై దృష్టి పెట్టనుంది.
ఇదిలావుంటే మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలోనే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అద్భుత విజయాలు సాధించింది. 2010, 2011, 2018, 2021 సీజన్లలో టైటిల్ విజేతగా నిలిచింది.ఇక ఐపీఎల్-2022 మెగా వేలం నేపథ్యంలో సీఎస్కే ధోనితో పాటు జడేజా, రుతురాజ్ గైక్వాడ్, మొయిన్ అలీని రిటైన్ చేసుకుంది. వీరిలో జడేజా కు రూ. 16 కోట్లు, ధోనికి రూ. 12 కోట్లు , మొయిన్ అలీకి రూ. 8 కోట్లు, రుతురాజ్ గైక్వాడ్ కు రూ. 6 కోట్లు చెల్లించింది.