Govt Employees: ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు సమ్మె చేస్తారా?
కొత్త వేతనాలు వద్దంటూ ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగుల ఆందోళన కొనసాగుతోంది. ఫిబ్రవరి ఆరో తేదీ అర్థరాత్రి నుంచి సమ్మె చేస్తామంటూ ప్రభుత్వానికి ముందస్తు నోటీస్ కూడా ఇచ్చారు.
- By Hashtag U Published Date - 01:11 PM, Sun - 30 January 22
కొత్త వేతనాలు వద్దంటూ ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగుల ఆందోళన కొనసాగుతోంది. ఫిబ్రవరి ఆరో తేదీ అర్థరాత్రి నుంచి సమ్మె చేస్తామంటూ ప్రభుత్వానికి ముందస్తు నోటీస్ కూడా ఇచ్చారు. వేతనాలు వారు అనుకున్నంత మేరకు పెరగకపోయినా, తగ్గే ప్రసక్తి లేదని ప్రభుత్వం చెబుతోంది. కొత్త పీఆర్సీ ప్రకారమే జీతాలు ప్రాసెస్ చేయాలంటూ ట్రెజరీలకు ఇచ్చిన ఆదేశాలు అమలు కాలేదు. కేవలం నాలుగోవంతు ఉద్యోగుల జీతాలు మాత్రమే శనివారానికి ప్రాసెస్ చేశారు. తమకు పాత జీతాలే ఇవ్వాలని, కొత్త పీఆర్సీ జీవోలు రద్దు చేయాలని, అశుతోష్ మిశ్రా ఇచ్చిన పీఆర్సీ నివేదిక తమకు ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
తమ మూడు డిమాండ్లు తీర్చితేనే ప్రభుత్వంతో చర్చలకు వస్తామని మొండికేసాయి సంఘాలు. కొత్త జీతాల వల్ల ఏటా దాదాపు 12 వేల కోట్ల రూపాయల భారం పడుతోందని ప్రభుత్వం చెబుతోంది. అయినప్పటికీ జనవరి నెలకు పాత జీతాలే ఇవ్వాలనే డిమాండ్ తో కొత్త జీతాలు ప్రాసెస్ చేయకుండా నిలిపివేశాయి. కొత్త జీతాలు స్లిప్ లు వస్తేనే కదా పెరిగిందో, తగ్గిందో తెలియడానికి అంటూ ప్రభుత్వం వాదిస్తోంది. కొత్త జీతాలు ప్రాసెస్ చేయని ఉద్యోగులపై చర్యలు తీసుకోవడానికి ఆర్థిక శాఖ సిద్ధమవుతోంది. ఎలాగైనా జనవరి నెలకు కొత్త జీతాలే ఇవ్వాలన్న పట్టుదలతో ఉన్న ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది. ఫిబ్రవరి ఒకటో తేదీన కొత్త జీతాలే ఇవ్వడానికి ప్రయత్నిస్తోంది.
Related News
Telangana PRC : తెలంగాణ ఉద్యోగులకు కేసీఆర్ తీపి కబురు
ఉద్యోగులకు పే స్కేల్ చెల్లింపు కోసం పే రివిజన్ కమిటీని (PRC) నియమించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు