KhawajaAsif ఆర్మీతో కలిసే పని చేస్తున్నాం : ఖవాజా ఆసిఫ్
- By Vamsi Chowdary Korata Published Date - 02:39 PM, Sat - 27 September 25

పాకిస్థాన్ పేరుకే ప్రజాస్వామ్య దేశం. కానీ పాలనంతా ఆర్మీ కనుసన్నల్లోనే నడుస్తుందన్న బహిరంగ రహస్యాన్ని ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఎట్టకేలకు బహిరంగంగా అంగీకరించారు. తమది హైబ్రిడ్ మోడల్ పాలన అని.. ఆర్మీ, ప్రభుత్వం కలిసే పాని చేస్తాయని వెల్లడించారు. ప్రజాస్వామ్యం, మానవ హక్కుల ఉల్లంఘనలపై తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న తరుణంలో ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చకు దారి తీశాయి. ఇది ఆచరణాత్మక అవసరమని ఆయన సమర్థించుకున్నారు.
పాకిస్తాన్లో సైన్యం, పౌర నాయకులు అధికారాన్ని పంచుకునే ఒక వింత వ్యవస్థ ఉంది. మీరు దీన్ని హైబ్రిడ్ మోడల్ అని పిలుస్తారు. కానీ, నిజానికి సైనిక నాయకులే ఇక్కడ బాధ్యులు కదా? చాలా దేశాల్లో సైన్యాధిపతి రక్షణ మంత్రికి జవాబుదారీగా ఉంటారు. కానీ మీ దేశంలో మీరు (రక్షణ మంత్రి) సైన్యాధిపతికి జవాబుదారీగా ఉంటారు కదా?” అని సూటిగా జర్నలిస్ట్ ప్రశ్నించారు. దీనికి బదులుగా మంత్రి ఖవాజా ఆసిఫ్.. “అలాంటిది ఏమీ లేదు. నేను ఎన్నికల ద్వారా అధికారంలోకి వచ్చిన రాజకీయ నాయకుడిని” అని సమాధానం ఇచ్చారు.
అమెరికాలో రక్షణ శాఖ బాధ్యతలు చూసే వారికి ఆ దేశ సైనిక జనరళ్లను విధుల నుంచి తొలగించే అధికారం ఉంది. కానీ పాకిస్థాన్లో అది సాధ్యమవుతుందా అని జర్నలిస్టు ప్రశ్నించగా.. అమెరికా పాలనా విధానానికి, పాకిస్థాన్ పాలనా విధానానికి తేడాలు ఉన్నాయని అదే హైబ్రిడ్ మోడల్ అంటూ ఖవాజా సమర్థించుకున్నారు. అమెరికాలో ‘డీప్ స్టేట్’ అనే భిన్నమైన మోడల్ ఉందంటూ తప్పించుకునే ప్రయత్నం చేశారు. దేశంలో అధికారం ఎక్కడ కేంద్రీకృతమై ఉందన్న ప్రశ్నకు.. ఆసిఫ్ పాకిస్థాన్ది హైబ్రిడ్ మోడల్ అని స్పష్టం చేశారు. ఈ ఏడాది ప్రారంభంలో కూడా ఖవాజా ఆసిఫ్ ఈ హైబ్రిడ్ పాలనకు మద్దతుగా మాట్లాడారు. ఇది ఆదర్శవంతమైన ప్రజాస్వామ్య ప్రభుత్వం కానప్పటికీ.. దేశ ఆర్థిక, పాలనా సమస్యలు పరిష్కారమయ్యే వరకు ఇది ఒక “ఆచరణాత్మక అవసరం” అని ఖవాజా గతంలో వ్యాఖ్యానించారు.