TSRTC: దాడికి గురైన సిబ్బందిని పరామర్శించిన టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్
- By Balu J Published Date - 05:10 PM, Wed - 7 February 24
TSRTC: దుండగుల చేతిలో దాడికి గురైన తమ సిబ్బందిని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ పరామర్శించారు. హైదరాబాద్ తార్నాకలోని టీఎస్ఆర్టీసీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని బుధవారం ఆయన పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితితో పాటు దాడి జరిగిన తీరును వారిని అడిగి తెలుసుకున్నారు. గాయపడ్డ కండక్టర్, డ్రైవర్ కు టీఎస్ఆర్టీసీ పూర్తిగా అండగా ఉంటుందని, ఈ విషయంలో ఎలాంటి ఆందోళన చెందవద్దని సజ్జనర్ వారికి భరోసా కల్పించారు. దాడిలో గాయాలైన కండక్టర్ రమేష్ కు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు.
ఫరూక్ నగర్ డిపోనకు చెందిన 8ఏ రూట్ బస్సులో విధులు నిర్వర్తిస్తోన్న డ్రైవర్, కండక్టర్ పై ఇద్దరు దుండగులు విచక్షణరహితంగా దాడి చేశారు. తమ తప్పు లేకున్నా బస్సును రోడ్డుపై ఆపి క్రికెట్ బ్యాట్ తో వారిని తీవ్రంగా కొట్టారు. ఈ ఘటనలో కండక్టర్ రమేష్, డ్రైవర్ షేక్ అబ్దుల్ కి గాయాలయ్యాయి. హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై ఈ నెల 4న జరిగిందీ సంఘటన.
ఈ ప్రమాదంలో తమ సిబ్బంది ఎలాంటి తప్పులేదని, ఉద్దేశపూర్వకంగా సిబ్బందిపై దుండగులు దాడికి పాల్పడ్డారని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ అన్నారు. ఈ ఘటనపై ఫిర్యాదు చేయగానే.. హైదరాబాద్ కమిషనరేట్ దోమల్ గూడ పోలీసులు వెంటనే స్పందించారని చెప్పారు. కేసు నమోదు చేసి.. నిందితులు మహ్మద్ మజీద్, మహ్మద్ ఖాసీంలను సోమవారం అరెస్ట్ చేశారని వివరించారు.
ప్రజల మధ్య విధులు నిర్వర్తించే టీఎస్ఆర్టీసీ సిబ్బందిపై దౌర్జన్యం చేస్తే తీవ్రమైన కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. నిబద్దత, క్రమశిక్షణతో విధులు నిర్వర్తిస్తోన్న సిబ్బందిపై క్రికెట్ బ్యాట్ తో దాడి చేయడం బాధాకరమన్నారు. పోలీస్ శాఖ సహకారంతో నిందితులకు కఠిన శిక్షలు పడేలా చూస్తామని, హిస్టరీ షీట్స్ కూడా తెరుస్తామన్నారు. తమ సిబ్బంది ఆత్మస్థైర్యాన్ని దెబ్బతిసే, మనోవేదనకు గురిచేసే ఇలాంటి దాడులను టీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఏమాత్రం సహించబోదని, నిందితులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.
బాధితులను పరామర్శించిన వారిలో టీఎస్ఆర్టీసీ సీవోవో డాక్టర్ రవిందర్, ఈడీలు కృష్ణకాంత్, వెంకటేశ్వర్లు, తార్నాక ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శైలజామూర్తి, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ డాక్టర్ శ్రీనివాస్, ఆస్పత్రి ఓఎస్డీ సైది రెడ్డి, తదితరులు ఉన్నారు.
Tags
Related News
TSRTC and Railway : లోక్సభ ఎన్నికల వేళ రైల్వే, ఆర్టీసీకి పెరిగిన ఆదాయం
ఇటీవల ముగిసిన లోక్సభ ఎన్నికల్లో ప్రజా రవాణా రంగానికి మంచి ఆదాయం వచ్చినట్లు కనిపిస్తోంది.