KTR Slams Amit Shah: అమిత్ షా అబద్దాలకు బాద్ షా
వేలకోట్ల రూపాయలతో ఎమ్మెల్యేని కొన్నట్టుగా తెలంగాణ ప్రజల ఆత్మాభిమానానికి బీజేపీ ఖరీదు కడుతోందని ఐటీ శాఖ మంత్రి కే.తారకరామారావు ఆరోపించారు.
- By Balu J Published Date - 05:47 PM, Mon - 22 August 22
వేలకోట్ల రూపాయలతో ఎమ్మెల్యేని కొన్నట్టుగా తెలంగాణ ప్రజల ఆత్మాభిమానానికి బీజేపీ ఖరీదు కడుతోందని ఐటీ శాఖ మంత్రి కే.తారకరామారావు ఆరోపించారు. అయితే మునుగోడు ప్రజల స్వాభిమానం ముందు బీజేపీ పార్టీ బట్టేబాజ్ తనం ఓడిపోవడం ఖాయమన్నారు. తెలంగాణ ఆత్మ గౌరవాన్ని, ఇక్కడి ప్రజల ఆకాంక్షలను ఢిల్లీ పాదూషాలు ఎన్నటికీ అర్థం చేసుకోలేరన్న సంగతి, మునుగోడులో కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన ప్రసంగంతో మరోసారి రుజువు అయిందన్నారు కేటీఆర్. అబద్ధాలకు పెద్దకొడుకు అమిత్ షానే అన్న కెటియార్, అధికార కాంక్ష తప్ప … ప్రజల ఆకాంక్షలను పట్టించుకోని పసలేని ప్రసంగం చేశారని విమర్శించారు. అమిత్ షాతో మునుగోడు ప్రజలకు పావలా ప్రయోజనం లేదన్నారు. గాడిద గాత్రానికి ఒంటె ‘ఓహో..’ అంటే, ఒంటె అందానికి గాడిద ‘ఆహా’ అన్నట్టుగా మోడీ ప్రభుత్వ పనితీరు గురించి అమిత్ షా చెప్పుకున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. నల్లా చట్టాలతో అన్నదాతల ఉసురు తీద్దామనుకున్న బీజేపీ పార్టీ నేతలు, రైతుపక్షపాతి అయిన కేసీఆర్ ను విమర్శించడాన్ని చూసి హిపోక్రసీ కూడా ఆత్మహత్య చేసుకుంటుందని కేటీఆర్ అన్నారు. మొన్న నల్లచట్టాలతో దేశ రైతులకు ఉరితాడు బిగించాలనుకున్న మోడీ ప్రభుత్వం, తాజాగా విద్యుత్ చట్టంతో వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టే కుట్రలకు తెరతీసిందని కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణ రైతుల నోట్లో మట్టి కొట్టేలా కేంద్రం చేస్తున్న కుట్రలపై కేసీఆర్ చేసిన ఆరోపణలకు మునుగోడు వేదికగా అమిత్ షా జవాబు చెప్తారని రైతాంగం ఆశించిందని, కాని ఆయన ఆ విషయాన్ని దాటవేశారని కేటీఆర్ తెలిపారు. దేశాన్ని ఏలుతున్న బిజెపి ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహిస్తున్న అమిత్ షా నుంచి అనేక అంశాల పైన తెలంగాణ ప్రజలు స్పష్టతను ఆశించారని అయితే బిజెపి పార్టీకి అలవాటైన తప్పించుకునే ధోరణినే ఆయన కొనసాగించారని కేటీఆర్ విమర్శించారు. అమిత్ షా ప్రసంగంలోని అనేక అంశాలు అసత్యాలు, అర్థరహితమన్న సంగతి వేదిక మీదున్న బీజేపీ నేతలకు కూడా తెలుసన్నారు కేటీఆర్.
దేశ వ్యవసాయరంగానికి నూతన దిక్సూచిగా అనేక విప్లవాత్మకమైన పథకాలను అమలుచేస్తున్న ముఖ్యమంత్రి కే . చంద్రశేఖర రావు రైతు వ్యతిరేకి అని అమిత్ షా మాట్లాడడం ఆయన అవగాహన రాహిత్యానికి, కళ్ళుండి చూడలేని కబోదితనానికి నిదర్శనమని కేటీఆర్ విమర్శించారు.ఈ దేశ రైతులకు ఏం చేయాలన్న విషయాలపై అస్సలు అవగాహన లేని మోడీ ప్రభుత్వానికి ఓ దారిచూపించింది ముఖ్యమంత్రి కేసీఆరే అన్న సంగతిని అమిత్ షా మర్చిపోయారని కేటీఆర్ చెప్పారు. తెలంగాణ రైతుబంధు పథకాన్ని పేరు మార్చి పీఎం కిసాన్ గా అమలుచేస్తున్న సంగతిని అమిత్ షా గుర్తుంచుకోవాలన్నారు. ఒకప్పుడు కరువు సీమగా ఉన్న ప్రాంతాలన్నీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక పచ్చని పంటలతో సస్య శ్యామలం అయ్యాయని కేటీఆర్ చెప్పారు. వడివడిగా ప్రాజెక్టులను కట్టి తెలంగాణను జలభాండాగారంగా మార్చడంతో పాటు రైతులకు ఇచ్చిన అనేక ప్రోత్సాహక పథకాలతో ఇవాళ రాష్ట్రంలో అద్భుతమైన వ్యవసాయ ప్రగతి కొనసాగుతుందన్నారు కేటీఆర్. తెలంగాణ ప్రభుత్వం సాధిస్తున్న ప్రగతిని రోజుకో కేంద్ర ప్రభుత్వ సంస్థే ప్రశంసిస్తున్న సంగతి అమిత్ షాకి తెలియకపోవడం ఆయన అవగాహన రాహిత్యానికి నిదర్శనమన్నారు.
నల్ల చట్టాలతో 13 నెలల పాటు రైతులను వేధించి వారి ప్రాణాలను బలిగొన్న ప్రభుత్వంలో కీలక మంత్రి అయిన అమిత్ షా, తెలంగాణ రైతుల గురించి మొసలి కన్నీరు కారుస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. దేశ రైతాంగం చేసిన వీరోచిత పోరాటంతోనే మోడీ అండ్ టీం అధికార మదం దిగి, అన్నదాతలకు బహిరంగ క్షమాపణ చెప్పిన విషయాన్ని అమిత్ షా మర్చిపోయినట్టున్నారని కేటీఆర్ అన్నారు. లభీంపూర్ లో రైతుల నెత్తురు కండ్లజూసిన ఖూనీకోరు.. సర్కారు మీదని, రైతు గురించి మాట్లాడే అర్హత మీకెక్కడిదని ప్రశ్నించారు. అన్నదాతకు వెన్నుదన్నుగా నిలబడ్డది తెలంగాణ ప్రభుత్వం అయితే, రైతన్నల వెన్ను విరుస్తున్నది మీరు కాదా అన్నారు.
ఫసల్ బీమా యోజన లో తెలంగాణ ఎందుకు చేరలేదని ప్రశ్నించిన అమిత్ షా, ఆ పథకం నుంచి గుజరాత్ ఎందుకు వైదొలిగిందో మునుగోడులో చెప్తే బాగుండేదని కేటీఆర్ అన్నారు. కార్పోరేట్ కంపెనీలకు దేశ సంపదను దోచిపెట్టడమే జీవిత లక్ష్యంగా పనిచేస్తున్న మోడీ తీసుకొచ్చిన ఫసల్ బీమాతో ఇన్యూరెన్స్ కంపెనీలకే ప్రయోజనం తప్ప రైతులకు కాదని కేటీఆర్ చెప్పారు. గత 5 సంవత్సరాల్లో సుమారు 40వేల కోట్ల రూపాయాల లాభాన్ని ఈ పథకం ద్వారా అయా కంపెనీలు అర్జించిన విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఇదే విషయాన్ని అర్ధం చేసుకుని ఆ పథకం నుంచి గుజరాత్ రాష్ట్రం వైదొలిగిందన్నారు. గుజరాత్ రాష్ట్రానికి పనికిరాని ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన తెలంగాణ రాష్ట్రానికి ఎలా పనికొస్తుందో అమిత్ షా చెప్తే తెలంగాణ ప్రజలు వినే తరించే వారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. దేశంలోని బిహర్, జార్జండ్,పంజాబ్, పశ్ఛిమ బెంగాల్ వంటి ఏడు రాష్ట్రాలతో పాటు సొంత పార్టీ నేతలే పనికిరాదని ఛీ కొట్టిన ఫసల్ భీమా పథకం పేరుతో తెలంగాణలో దుష్ప్రచారం చేయడం అమిత్ షా దరిద్రపు రాజకీయాలకు పరాకాష్ట అని కేటీఆర్ విమర్శించారు.
వేల కోట్ల కాంట్రాక్టులతో ఒక ఎమ్మెల్యేను కొన్న బీజేపీ పార్టీ, మునుగోడు నియోజకవర్గానికి ప్రత్యేకంగా కోట్లాది రూపాయల ప్యాకేజీ ప్రకటిస్తుందని అంతా ఆశించారన్న కేటీఆర్, గోల్ మాల్ గుజరాత్ కు తప్ప గోల్డ్ మోడల్ తెలంగాణకు రూపాయి ఇచ్చే సంస్కారం ఆ పార్టీకి లేదన్నారు. అమిత్ షా లాంటి నాయకులు తెలంగాణ గడ్డమీద అసత్యాలతో ప్రచారం చేసినా ఇక్కడి ప్రజలు నమ్మరన్న కేటీఆర్, తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవానికి అండగా నిలబడే టీఆర్ఎస్ పార్టీకే మద్దతుగా ఉంటారన్న విషయం మునుగోడు ఎన్నికతో బీజేపీ నేతలకు అర్థం అవుతుందన్నారు కేటీఆర్. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని గుజరాత్ రాజకీయ వ్యాపారుల ముందు తాకట్టు పెట్టిన గల్లీ నాయకులను చరిత్ర క్షమించదన్నారు. “ఆత్మాభిమానంలేని కొందరు తొత్తులు మీ చెప్పులు మోయొచ్చుగానీ.. తెలంగాణను చెప్పు చేతల్లో పెట్టుకోవాలని మీరు చేస్తున్న కుట్రలకు .. ఆత్మగౌరవం వున్న తెలంగాణ జాతి ఎప్పుడూ లొంగదనే విషయాన్ని గుర్తుంచుకోండి” అని కెటియార్ హెచ్చరించారు.
అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి కిలో దొడ్డు బియ్యాన్ని కొంటామంటున్న అమిత్ షా… ఇప్పుడు అధికారంలో ఉన్నది తమ పార్టీనే అన్న విషయాన్ని మర్చిపోయారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. రాజకీయ ప్రయోజనం లేదన్న ఒకే ఒక్క కారణంతో కావాలనే తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కొనకుండా ఇక్కడి రైతాంగాన్ని గోస పెట్టుకుంటున్న బీజేపీ నేతల మాటలను ఎవరూ నమ్మరని కేటీఆర్ చెప్పారు. పండించిన పంటను కొనకుండా తొండి షరతులు పెట్టి వేధిస్తున్న రైతు ద్రోహులు బిజెపి నేతలే అన్నారు. “తెలంగాణ కర్షకుడి మీద కక్షగట్టింది నిజం కాదా..? మోటర్లకు మీటర్లు పెట్టి .. ఉచిత కరెంట్ ను కబళించే కుట్రలు చేస్తున్నది మీరు కాదా..? కృష్ణా జలాల్లో వాటాలు తేల్చకుండా నికృష్ణ రాజకీయం చేస్తున్నది మీరు కాదా..? నీళ్లిచ్చే ప్రాజెక్టులను నిలిపివేయడానికి బోర్డులు బెట్టి బోడిపెత్తనం చేస్తున్నది మీరు కాదా..?” అని కేటీఆర్ ప్రశ్నించారు. దేశంలోని ప్రతీ రంగాన్ని భష్టుపట్టిస్తున్న మోదీ ప్రభుత్వం, నేతన్నలకు తీరని అన్యాయం చేసిందని కేటీఆర్ ఆరోపించారు. జిఎస్టీతో నేతన్నల నడ్డి విరుస్తున్న కేంద్ర ప్రభుత్వం విధానాలపైన అమిత్ షా నుంచి ఏదైనా మంచి మాట చేప్తారని అశించారని, బిజెపి రైతన్నలతోపాటు నేతన్నలకు కూడా ద్రోహం చేస్తుందని కెటియార్ అన్నారు. అటు నేతన్నలకు రైతన్నలకు సంబంధం లేకుండా అడ్డగోలుగా మాట్లాడిన అమిత్ షా ప్రసంగం తెలంగాణ ప్రజలని… అన్ని వర్గాల ప్రజలని సంపూర్ణంగా నిరుత్సాహానికి గురి చేసిందని, ఏనాటికైనా తెలంగాణ ప్రజల అవసరాలను ఆకాంక్షలను అర్థం చేసుకోలేరని నిరూపితమైందని కెటియార్ అన్నారు.
Related News
TS : గత ఎన్నికల కంటే ఈసారి పోలింగ్ శాతం బాగానే ఉంది: సీఈఓ వికాస్ రాజ్
Telangana: రాష్ట్రంలో జరుగుతున్న పోలింగ్పై తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి (సీఈఓ) వికాస్ రాజ్(Chief Election Officer Vikas Raj) మీడియాతో మాటాడారు. గత ఎన్నికలతో పోలిస్తే ఈ సారి పోలింగ్ శాతం బాగానే ఉందని ఆయన తెలిపారు. ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో పోలింగ్ శాతం 50 దాటిందన్నారు. ఇక హైదరాబాద్లో మాత్రమ ఎప్పటిలాగానే ఈ సారి కూడా తక్కువగానే 20 శాతం పోలింగ్ నమోదైనట్లు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్ర �