Sugar Skyrocketed : హాఫ్ సెంచరీకి చేరువలో చక్కెర.. ఫెస్టివల్ టైంలో సామాన్యుల ఇక్కట్లు
Sugar Skyrocketed : పండుగల సీజన్ వస్తోంది. వరుసగా.. వినాయక చవితి, దేవి నవరాత్రులు, దీపావళి పండుగలు రాబోతున్నాయి.
- Author : Pasha
Date : 13-09-2023 - 7:10 IST
Published By : Hashtagu Telugu Desk
Sugar Skyrocketed : పండుగల సీజన్ వస్తోంది. వరుసగా.. వినాయక చవితి, దేవి నవరాత్రులు, దీపావళి పండుగలు రాబోతున్నాయి. మిఠాయిలు, తీపి పదార్థాల తయారీ ఎక్కువగా జరిగే ఈ టైంలో చక్కెర ధరలు చుక్కలను అంటాయి. రిటైల్ ధర అమాంతం పెరిగి కేజీకి రూ.48 దాకా పెరిగింది. జులై నెలలో రూ.43 ఉన్న కిలో చక్కెర రేటు.. కేవలం రెండున్నర నెలల టైంలో ఏకంగా కేజీకి రూ.5 మేర జంప్ అయింది. వాస్తవానికి ఈ సంవత్సరం జనవరిలో కిలో చక్కెర రేటు రూ.42 మాత్రమే. ఇప్పుడు చక్కెర ధర (కేజీకి రూ.48) ఆరు సంవత్సరాల గరిష్ట స్థాయి. అంటే ఆరేళ్ల క్రితం ఈ స్థాయికి ధర చేరింది. మళ్లీ ఇప్పుడు ఆ స్థాయి ప్రైస్ రేంజ్ వచ్చి జనాన్ని ఇబ్బందిపెడుతోంది. ఈ ఎఫెక్ట్ తో స్వీట్లు, చాక్లెట్లు, కూల్ డ్రింక్స్ తయారీ ఖర్చు పెరుగుతుంది. ఫలితంగా వాటి రేట్లు కూడా పెరుగుతాయి. ఇప్పటిదాకా టమాటా, ఉల్లి రేట్లు సామాన్యుడికి కన్నీళ్లు పెట్టించగా.. ఇప్పుడు చక్కెర రేటుతో పేదలకు ఇక్కట్లు మొదలయ్యాయి. వచ్చే రెండు, మూడు నెలల పాటు చక్కెర ధరలు ప్రస్తుత రేంజ్ లోనే ఉంటాయని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. దాదాపు కేజీకి రూ.50 రేంజ్ లోనే చక్కెర ఉండబోతోంది. ఈనేపథ్యంలో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం విదేశాలకు గోధుమలు, బియ్యం ఎగుమతులను నిలిపివేసింది. రానున్న రోజుల్లో ధరల పెరుగుదలను కట్టడి చేసేందుకుగానూ చక్కెర ఎగుమతిపైనా నిషేధం విధించే ఛాన్స్ ఉంది.
Also read : Today Horoscope : సెప్టెంబరు 13 బుధవారం రాశిఫలాలు.. వారికి ఆవేశంతో నష్టం
చక్కెర ధరలు ఎందుకు పెరిగాయి ?
- వర్షాలు కురవక దేశంలో చెరుకు సాగు తగ్గిపోవడమే చక్కెర ధరలు పెరగడానికి ప్రధాన కారణం.
- చెరకు ఎక్కువగా పండించే మహారాష్ట్ర, కర్ణాటక వంటి ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితుల కారణంగా చెరుకు సాగు తగ్గిపోయింది. ఫలితంగా పంచదార ధర పెరిగిపోయింది.
- ఇథనాల్ ఉత్పత్తి పెరగడం కూడా చక్కెర ఉత్పత్తిపై ప్రభావం చూపిస్తోంది. పెట్రోలులో ఇథనాల్ ను కలిపేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. చక్కెర దిగుబడి దగ్గడానికి ఇది కూడా ఒక ముఖ్య కారణమని అంటున్నారు.