Pulasa Fish : యానంలో రికార్డు ధర పలికిన పులస చేప…
'పుస్తెలు అమ్మి అయినా పులస తినాలి' అంటారు. అంత ప్రత్యేకం పులస చేప
- By Sudheer Published Date - 01:35 PM, Wed - 23 August 23

‘పుస్తెలు అమ్మి అయినా పులస తినాలి’ అంటారు. అంత ప్రత్యేకం పులస చేప (Pulasa ). పులస చేప వర్షాకాలంలో మాత్రమే దొరుకుతుంది. ఈ చేప అన్ని చేపల కన్నా చాలా రుచిగా ఉంటుంది. పులస చేప పులుసు ఉభయ గోదావరి జిల్లాలలో చాలా ప్రసిద్ధి చెందిన వంటకం. కొన్ని ఏండ్ల క్రితం ఇక్కడి జనం ఎవరినైనా ముఖ్యమైన వారిని కలవడానికి వెళ్ళేటప్పుడు ఈ పులస చేప పులుసు పట్టుకుని వెళ్ళేవారట. అంతటి ప్రత్యేకమైనది. అందుకే పులస ను భారీ ధర పెట్టి కొనుగోలు చేస్తారు. చేపల వేటకు వెళ్లే జాలర్లకు పులస చేప చిక్కిందంటే వారి పంట పండినట్లే.
తాజాగా యానంలో రికార్డు ధరకు పులస అమ్ముడుపోయింది. వర్షాకాలం సీజన్లో తొలకరి తర్వాత గోదావరికి ఎర్ర నీరు పోటెత్తిన సమయంలోనే పులసలు దొరుకుతాయి. ఈ ఏడాది మాత్రం పులసలు కాస్త తక్కువగానే మార్కెట్లోకి వస్తున్నాయి. గత నెలలో ఒకటి రెండుసార్లు మాత్రమే మత్స్యకారుల వలకు చిక్కగా మళ్లీ చాలా రోజుల తర్వాత పులస దొరికింది. యానాంలో రెండు కిలోల పులస చేప చిక్కింది.
ఆ పులస చేపను మార్కెట్లో అమ్మకానికి పెట్టారు. మత్స్యకార మహిళ రత్నం అమ్మకానికి పెట్టడంతో కొనుగోలు చేసేందుకు పులస ప్రియులు పోటీపడ్డారు. ఈ చేప రికార్డు స్థాయిలో ఏకంగా రూ.16వేలకు అమ్ముడుపోయింది. గతంతో పోలిస్తే.. గోదావరిలో పులస చేప రాక బాగా తగ్గిందనే చెబుతున్నారు.
ఈ పులస (Pulasa Fish Speciality) ప్రత్యేకలు చూస్తే..
పులసలు.. గోదావరి నదిలో మాత్రమే ఉంటాయి.. నదీ ప్రవాహానికి అతివేగంగా ఎదురీదడం ఈ చేప ప్రత్యేకతగా చెబుతారు స్థానిక మత్స్యకారులు. సంతానోత్పత్తి కోసం న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, టాంజానియా వంటి సుదూర ప్రాంతాల నుంచి ఖండాలను దాటి వస్తాయట. అలా హిందూ మహాసముద్రం మీదుగా ప్రయాణించి బంగాళాఖాతంలో ప్రవేశిస్తాయని చెబుతుంటారు.
ఈ చేప సంతానోత్పత్తి సమయంలో గుడ్లు పెట్టేందుకు ఇలా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల సముద్ర జలాల్లోకి వస్తుందని మత్స్యకారులు చెబుతుంటారు. సీజనల్గా ఆషాడ, శ్రావణ మాసాల్లో ఇక్కడ గుడ్లు పెట్టి మళ్లీ సముద్రంలోకి తిరిగి వెళ్లిపోతుందట. ఇలసగా పిలిచే ఈ చేప గోదావరిలోకి ఎర్రనీరు రాగాగానే.. ఎదురీదుతూ నదిలోకి వచ్చి రెండు మూడు రోజుల్లోనే పులసగా మారుతుందని చెబుతారు మత్స్యకారులు.
పులస శాస్త్రీయ నామం హిల్సాహిల్సా అంటారట. ఈ పులసలు ఒడిశాతో పాటుటా బంగ్లాదేశ్ తీరాల్లో కూడా దొరుకుతాయట.. కానీ గోదావరిలో దొరికే చేపల రుచి వేరుగా ఉంటుందని చెబుతారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా ఈ పులస చేపలు ఎక్కువగా భైరవపాలెం, అంతర్వేది, నరసాపురంలో కనిపిస్తాయి అంటున్నారు. మరీ ముఖ్యంగా గోదావరి జలాలు సముద్రంలో కలిసే ఈ రెండు పాయల దగ్గరే ఈ పులస చేపలు లభ్యం అవుతాయని మత్స్యకారులు అంటున్నారు. అందుకే ఈ పులస చేపల కోసం వేటకు వెళుతుంటారు.