Amarnath Yatra : గుడ్ న్యూస్.. జూన్ 29 నుంచి అమర్నాథ్ యాత్ర
జమ్మూకశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లాలో ఉన్న పవిత్ర పుణ్యక్షేత్రం అమర్నాథ్లో శనివారం ఉదయం అర్చకులు ప్రథమ పూజను నిర్వహించారు.
- Author : Pasha
Date : 22-06-2024 - 2:29 IST
Published By : Hashtagu Telugu Desk
Amarnath Yatra : జమ్మూకశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లాలో ఉన్న పవిత్ర పుణ్యక్షేత్రం అమర్నాథ్లో శనివారం ఉదయం అర్చకులు ప్రథమ పూజను నిర్వహించారు. దీంతో ఈ ఏడాది అమర్నాథ్ యాత్ర మొదలైంది. ఇక భక్తులు ఈనెల 29 నుంచి అమర్నాథ్ను విజిట్ చేయొచ్చు. ఆగస్టు 19న యాత్ర ముగుస్తుంది. జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా శ్రీనగర్లోని రాజ్ భవన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అమర్నాథ్ ఆలయ ప్రథమ పూజలో పాల్గొన్నారు. ‘‘దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి భక్తులు అమర్నాథ్ పుణ్యక్షేత్రాన్ని సందర్శించడానికి వస్తారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా మేం అన్ని ఏర్పాట్లు చేశాం’’ అని లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా వెల్లడించారు.
We’re now on WhatsApp. Click to Join
అమర్నాథ్ యాత్ర అనంత్నాగ్ జిల్లాలోని పహల్గామ్ ట్రాక్, గందర్బల్ జిల్లాలోని బల్తాల్ రెండింటి నుంచి ఒకేసారి ప్రారంభమవుతుంది. భక్తులు ఈ రెండింటిలో తమకు సమీపంలో ఉండే ఏదైనా ఒక మార్గం ద్వారా అమర్నాథ్కు చేరుకోవచ్చు. ఈ యాత్రకు భద్రత కల్పించేందుకు భారీగా సైనిక దళాలను మోహరించారు. ఇటీవల కాలంలో జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడులు పెరిగాయి. ఈనేపథ్యంలో అమర్నాథ్ యాత్ర జరిగే మొత్తం మార్గంలో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. గతేడాది 4.5 లక్షల మందికిపైగా భక్తులు అమర్నాథ్ను సందర్శించారు.
Also Read :Paper Leak – Telegram : టెలిగ్రాంలో ‘నెట్’ ప్రశ్నాపత్రం లీక్.. రూ.10వేలకు అమ్మేశారు ?
అమర్నాథ్ గుహ గురించి..
అమర్నాథ్ గుహకు(Amarnath Yatra) 5వేల ఏళ్ల చరిత్ర ఉందని అంటారు. అమర్నాథ్ పుణ్య క్షేత్రాన్ని భృగు మహర్షి తొలిసారిగా దర్శించుకున్నారని పురాణాల్లో ఉంది. అమర్నాథ్ గుహను శివుని నివాసంగా భక్తులు భావిస్తారు. గడారియా అనే కమ్యూనిటీ అమర్నాథ్ గుహను కనుగొందని కూడా అంటారు. శ్రీనగర్కు వంద కిలోమీటర్ల దూరంలో పెహల్గామ్ అనే గ్రామం ఉంది. దీనిని ‘బైల్ గామ్’ అని కూడా పిలుస్తారు. పరమేశ్వరుడు ఇక్కడ తన నందిని విడిచిపెట్టాడు కాబట్టి ఆ పేరు వచ్చిందట. ఇక చందన్వారీలో శివుడు తన సిగలోని చంద్రుడిని, శేష్నాగ్ దగ్గర తన మెడలోని పాములను, మహాగణేశ పర్వతం వద్ద కుమారుడు గణేశుడిని, పంచతరణి దగ్గర తనలోని పంచభూతాలను విడిచారని విశ్వసిస్తారు. ఆయా ప్రాంతాల పేర్లు కూడా శివుడు విడిచినవాటిని తలపించేలా ఉండటం విశేషం.