గౌతమ్ సవాంగ్ ని ఆకస్మికంగా ఎందుకు మార్చారో ప్రజలకు చెప్పాలని ‘పవన్’ డిమాండ్
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర డీజీపీగా ఈ రోజు మధ్యాహ్నం వరకూ విధుల్లో ఉన్న గౌతమ్ సవాంగ్ ని ఆకస్మికంగా ఆ బాధ్యతల నుంచి పక్కకు తప్పించడం విస్మయం కలిగించిందన్నారు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్.
- Author : Hashtag U
Date : 15-02-2022 - 11:01 IST
Published By : Hashtagu Telugu Desk
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర డీజీపీగా ఈ రోజు మధ్యాహ్నం వరకూ విధుల్లో ఉన్న గౌతమ్ సవాంగ్ ని ఆకస్మికంగా ఆ బాధ్యతల నుంచి పక్కకు తప్పించడం విస్మయం కలిగించిందన్నారు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్. అధికారులను నియమించుకోవడం అనేది ప్రభుత్వానికి ఉన్న పాలనాపరమైన అధికారం కావచ్చు… కానీ వైసీపీ ప్రభుత్వానికి డీజీపీని హఠాత్తుగా మార్చాల్సిన అవసరం ఏమి వచ్చిందో?
ఇందుకుగల కారణాలను ప్రజలకు తెలియచెప్పాలి. లేని పక్షంలో – విజయవాడలో పీఆర్సీకి వ్యతిరేకంగా ఉద్యోగులు చేపట్టిన ర్యాలీ విజయవంతం అయినందుకే సవాంగ్ పై బదిలీ వేటు వేశారని భావించాల్సి వస్తుంది. ఉన్నతాధికారుల నుంచి చిన్నపాటి ఉద్యోగి వరకూ అందరినీ హెచ్చరించి.. భయపెట్టి.. అదుపు చేసేందుకు సవాంగ్ బదిలీని ఉదాహరణగా చూపించే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి ఉంది. ఈ బదిలీ తీరు చూస్తే వైసీపీ ప్రభుత్వం చీఫ్ సెక్రెటరీగా ఉన్న ఎల్వీ సుబ్రమణ్యం ను ఆకస్మికంగా పక్కకు తప్పించడమే గుర్తుకు వస్తుందని అన్నారు జనసేనాని పవన్ కళ్యాణ్.