Jana Sena: ‘జగన్ రెడ్డి’ దమ్ము ఏంటో.. ‘జనసేన’ దమ్ము ఏంటో చూపిస్తాం – ‘నాదెండ్ల మనోహర్’
- By Hashtag U Published Date - 09:44 PM, Sat - 23 April 22
‘ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు ప్రారంభించినప్పుడు దాని గురించి మాట్లాడాలి.. పాలన గురించి ప్రజలకు వివరించాలి. దానిని పూర్తిగా పక్కన పెట్టి రాజకీయ విమర్శలకు దిగడం ముఖ్యమంత్రి జగన్ రెడ్డికే చెల్లింద’ని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. జనసేన పార్టీ చేపట్టిన కౌలు రైతు భరోసా యాత్రలో భాగంగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి లో రచ్చబండ కార్యక్రమంలో మాట్లాడారు. కౌలు రైతుల సమస్యలు కనీసం పట్టించుకోని ప్రభుత్వం తీరు అత్యంత దారుణం అన్నారు. చింతలపూడి రచ్చబండ వేదిక నుంచి నాదెండ్ల మనోహర్ ప్రసంగిస్తూ “ప్రభుత్వ వేదికలపై ముఖ్యమంత్రి ప్రభుత్వ కార్యక్రమాల గురించి కాకుండా జనసేన పార్టీని విమర్శించడం ఏమిటి? ఈ ముఖ్యమంత్రికి సిగ్గు ఉండాలి. ప్రభుత్వ కార్యక్రమాల వేదికపై రాజకీయ విమర్శలు చేయకూడదు అన్న జ్ఞానం ఉండాలి. భయంతో మాట్లాడే మాటలు ఆపి, రైతులను ఆదుకునే దారి చూడాలి.
వారి కుటుంబాలను పరామర్శించాలి. హామీ ఇచ్చినట్లుగా వారికి ఏడు లక్షల రూపాయల సహాయం వెంటనే అందించాలి. అంతేగాని ప్రజా వేదికలపై ఇష్టానుసారం మాట్లాడితే ప్రజలు తగిన బుద్ధి చెబుతారు. మూడు వేల మంది రైతులు మూడు సంవత్సరాల్లో ఆత్మహత్యలు చేసుకుంటే ఈ ప్రభుత్వానికి కనీసం పట్టడం లేదు. కొన్ని జిల్లాల్లో రైతుల ఆత్మహత్యలను నమోదు చేయడానికి సైతం అధికారులు ముందుకు రాకపోవడం దురదృష్టకరం. 11 మంది చింతలపూడి నియోజకవర్గంలో, ఏడుగురు పోలవరం నియోజకవర్గంలో ఆత్మహత్యలు చేసుకున్నారు. కర్నూలు జిల్లాలో 370 మంది, అనంతపురం జిల్లాలో 170 మంది ఆత్మహత్య చేసుకున్నారు. అన్నపూర్ణ లాంటి ఉభయగోదావరి జిల్లాలోనూ 87 మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకోవడం శోచనీయం. మూడో నాలుగో ఎకరాలు కౌలుకు చేసుకొని కుటుంబాన్ని ఎలాగోలా నెట్టుకువద్దామని రైతులు సాగు చేస్తున్నారు. పంట నష్టం, గిట్టుబాటు ధర లేక చేసిన అప్పులకు సమాధానం చెప్పలేక కన్నబిడ్డలను వదిలి బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. దానిపైన ఈ రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలి. అన్నదాతల ఆత్మహత్యలు నివారించే మార్గాన్ని చూడాలి.
కరెంటు కోతలతో రైతాంగం అల్లాడుతోంది:
ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటూ ఎన్నికల్లో అన్ని వర్గాలను మభ్యపెట్టి ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్ రెడ్డి రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేశారు. రాష్ట్రంలో కరెంటు చార్జీల బాదుడు ఒకపక్క… కరెంట్ కోతల మోత మరో పక్క అన్నట్లుగా ఉంది. ప్రస్తుతం పంట కీలకదశలో ఉన్న సమయంలో కరెంటు లేక రైతాంగం అల్లాడుతోంది. పంటకు నీరు అందక, కరెంటు కోతలతో రైతాంగం సతమతమవుతోంది. దీనిని వెంటనే ప్రభుత్వం పరిష్కరించాలి. రాష్ట్రాన్ని అంధ కారంలోకి నెట్టేసిన ఈ ముఖ్యమంత్రి దీనికి సమాధానం చెప్పాలి. కౌలు రైతుల భరోసా యాత్ర కోసం పవన్ కళ్యాణ్ ఎంతో ఆలోచించి ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టారు. అసలు కౌలు రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు..? వారికి వచ్చిన కష్టం ఏంటి? ప్రభుత్వం వారి ఆత్మహత్యల మీద ఎందుకు స్పందించడం లేదు? ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాల పరిస్థితి ఏమిటి? అనే అనేక అంశాలు క్షేత్రస్థాయిలో పరిశీలించాలని ఈ యాత్ర మొదలుపెట్టారు.
రైతు కుటుంబాలకు భరోసాగా ఉండడానికి ఆయన వంతుగా రూ.ఐదు కోట్ల విరాళం ఇచ్చి.. ప్రతి కుటుంబానికి అండగా నిలిచేందుకు లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్నారు. ఇది ప్రతి జనసేన కార్యకర్త ఛాతి ఉప్పొంగి చెప్పే గొప్ప కార్యక్రమం. దీనిని ప్రతి కార్యకర్త బాధ్యతగా ప్రజల్లోకి తీసుకు వెళ్ళండి. కార్యక్రమం గొప్పదనాన్ని ప్రజలకు వివరించండి. ప్రభుత్వం కౌలు రైతులను ఎలా మోసం చేసిందో వివరించండి. ఎన్నికల వేళ రాజకీయాలు మాట్లాడదాం… జగన్ రెడ్డి దమ్ము ఏంటో.. జనసేన దమ్ము ఏంటో చూపిద్దాం. కౌలు రైతుల భరోసా యాత్ర ఇప్పటికే జనంలోకి వెళ్లింది. దీనిని మరింతగా జనసేన కార్యకర్తలు ప్రతి ఒక్కరికి తెలిసేలా చేయండి. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాకు కౌలు రైతు భరోసా యాత్ర కోసం పవన్ కళ్యాణ్ వస్తున్నారని తెలుసుకున్న ఓ యువకుడు నిన్న వచ్చి కలిశాడు. తన తండ్రి సాగు కు సంబంధించి అప్పుల బాధలు భరించలేక ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని నా దృష్టికి తీసుకు వచ్చాడు. వెంటనే అధ్యక్షుల అనుమతితో వారికి కూడా సహాయం అందించే ఏర్పాటు చేశాం. ప్రతి రైతు కుటుంబాన్ని ఆదుకోవాలి అనేది పవన్ కళ్యాణ్ ఆకాంక్ష. దానిని బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్దాం.
కర్షకుడికి కులం ఏంటి?:
అందరికీ కడుపు నింపే కర్షకుడికి సాయం అందించడంలో కులం ఎందుకు ప్రస్తావన వస్తోంది.? ప్రతి కులంలోనూ పేదలు ఉన్నారు. ఎంతో కొంత సాగు చేసుకుని కుటుంబాన్ని పోషించుకునే వారు ఉన్నారు. రైతు భరోసా సాయం కోసం కులం వారిగా లెక్కలు చూసి వారికి సాయం అందించడం అత్యంత హేయం. ప్రభుత్వం రైతులకు సైతం కులం చూసి సాయం చేయడం ఎక్కడ లేదు. పాదయాత్ర వేళ ఎన్నో హామీలను రైతాంగానికి ఇచ్చిన ముఖ్యమంత్రి పదవి లోకి వచ్చాక వాటిని పూర్తిగా మరిచి పోయారు. వాటిని మొదట పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో రైతులకు సబ్సిడీ లు లేవు. మద్దతు ధర లేదు. గిడ్డంగులు కట్టడమే మరిచిపోయారు. దీన్ని సమస్యలను కళ్లెదుటే పెట్టుకొని ఉన్న ముఖ్యమంత్రి జనసేన పార్టీ చేస్తున్న సహాయం విషయంలో చౌకబారు విమర్శలకు దిగడం మానుకుంటే మేలు.
ఇలాంటి ముఖ్యమంత్రి మనకొద్దు:
రైతులను ఆదుకోవడానికి ఎన్ని విమర్శలు ఎదుర్కొనేందుకు అయినా జనసేన పార్టీ సిద్ధంగానే ఉంది. కౌలు రైతులు ఆత్మహత్య చేసుకుంటే కనీసం పరామర్శించని ఈ మానవత్వం లేని ముఖ్యమంత్రి మనకొద్దు. ఏ రైతు అధైర్యపడాల్సిన అవసరం లేదు. రైతు కష్టాలు తెలిసిన పవన్ కళ్యాణ్ మీ వెంట ఉన్నారు. వారికి అండగా నిలుస్తాం. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు రైతులను ఆదుకునే వరకూ రైతు భరోసా యాత్ర కొనసాగుతుంది. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి కౌలు రైతులకు ఇస్తామని చెప్పిన ఏడు లక్షల రూపాయల నష్టపరిహారాన్ని వెంటనే విడుదల చేయాల”ని డిమాండ్ చేశారు నాదెండ్ల మనోహర్.
Related News
Pawan Kalyan : ఆ విషయం ఈసారి పవన్ వైపే అంట..!
ఈ సార్వత్రిక ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈసారి ఇక్కడ పోటీ చేయడంతో పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం హాట్ టాపిక్గా మారింది.