9 Year Renames : 9 ఏళ్ల బీజేపీ హయాంలో వీటి పేర్లు మారిపోయాయి
9 Year Renames : ఢిల్లీలోని నెహ్రూ మెమోరియల్ మ్యూజియం పేరు మార్పు రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. ఈనేపథ్యంలో గత 9 ఏళ్ళ బీజేపీ హయాంలో దేశంలో ఇలా పేరు మారిపోయిన ముఖ్యమైన ప్రదేశాలు, నిర్మాణాలపై ఒక లుక్ వేద్దాం..
- By Pasha Published Date - 07:26 AM, Mon - 19 June 23
9 Year Renames : ఢిల్లీలోని నెహ్రూ మెమోరియల్ మ్యూజియం పేరు మార్పు రాజకీయ ప్రకంపనలు సృష్టించింది.
దీనిపై కాంగ్రెస్, బీజేపీ మధ్య వాడివేడి వాగ్యుద్ధం జరిగింది.
ఈనేపథ్యంలో నెహ్రూ మెమోరియల్ మ్యూజియం చరిత్ర గురించి తెలుసుకుందాం..
గత 9 ఏళ్ళ బీజేపీ హయాంలో దేశంలో ఇలా పేరు మారిపోయిన(9 Year Renames) ముఖ్యమైన ప్రదేశాలు, నిర్మాణాలపై ఒక లుక్ వేద్దాం..
నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీ (NMML) అనేది భారత ప్రభుత్వ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలోని ఒక స్వయంప్రతిపత్తి త్త సంస్థ. ఇది ఢిల్లీలోని తీన్ మూర్తి మార్గ్లో ఉంది. ఇక్కడ దేశంలోని జర్నలిస్టులు, రచయితలు, పరిశోధనా విద్యార్థులు నెహ్రూ కాలపు ప్రభుత్వాలు, విధానాల గురించి అధ్యయనం చేస్తారు. ఇప్పుడు దీని పేరు ‘ప్రధాన మంత్రి మ్యూజియం అండ్ లైబ్రరీ సొసైటీ’గా మార్చబడింది.
నెహ్రూ మెమోరియల్ చరిత్ర
1929-30లో భారతదేశంలో బ్రిటిష్ పాలనా కాలంలో ఎడ్విన్ లుటియన్స్ ఇంపీరియల్ క్యాపిటల్ నిర్మాణంలో భాగంగా ఈ సముదాయాన్ని నిర్మించారు. ఇది భారతదేశంలో బ్రిటీష్ కమాండర్-ఇన్-చీఫ్ యొక్క అధికారిక నివాసం. 1948 ఆగష్టులో ఇది స్వతంత్ర భారతదేశం యొక్క మొదటి ప్రధాన మంత్రి అయిన జవహర్లాల్ నెహ్రూ యొక్క అధికారిక నివాసంగా మారింది. ఇక్కడ పండిట్ జవహర్లాల్ నెహ్రూ 1964 మే 27 వరకు 16 సంవత్సరాలు నివసించారు. నెహ్రూ మరణానంతరం ఈ సముదాయాన్ని దేశ తొలి ప్రధానికి అంకితం చేయాలని అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. 1964 నవంబర్ 14న నెహ్రూ 75వ జయంతి సందర్భంగా అప్పటి రాష్ట్రపతి ఎస్. రాధాకృష్ణన్ తీన్ మూర్తి భవన్ను జాతికి అంకితం చేసి నెహ్రూ మెమోరియల్ మ్యూజియాన్ని ప్రారంభించారు. రెండు సంవత్సరాల తరువాత ఈ సంస్థను నిర్వహించడానికి NMML సొసైటీని స్థాపించారు.
ఈ పేర్లు కూడా మార్చేశారు..
• 2023 జనవరి 28 : భారత ప్రభుత్వం రాష్ట్రపతి భవన్లోని ‘మొఘల్ గార్డెన్’ పేరును ‘అమృత్ ఉద్యాన్’గా మార్చింది. తోటలోని అనేక రకాల గులాబీలు, తులిప్లు, సీజనల్ పువ్వులు దీనికి గొప్ప రూపాన్ని ఇస్తాయి. దీన్ని ప్రతి వసంతకాలంలో ప్రజల సందర్శన కోసం తెరుస్తారు.
• 2022 సెప్టెంబర్ 8 : ఢిల్లీలోని రాజ్పథ్ పేరును కర్తవ్య మార్గంగా మార్చారు. ఇది రైసినా హిల్లోని రాష్ట్రపతి భవన్ నుంచి విజయ్ చౌక్, ఇండియా గేట్, నేషనల్ వార్ మెమోరియల్ మీదుగా నేషనల్ స్టేడియానికి కనెక్ట్ అయ్యే రూట్. ప్రతి సంవత్సరం రిపబ్లిక్ డే పరేడ్ ఈ మార్గం గుండా వెళుతుంది. బ్రిటిష్ పాలనలో దీన్ని కింగ్స్వే అని పిలిచేవారు.
• 2015 : ఢిల్లీలోని రేస్ కోర్స్ రోడ్డు పేరును లోక్ కళ్యాణ్ మార్గ్ గా మార్చారు. ప్రధాని నివాసం ఈ రోడ్డులోనే ఉంది.
• 2015 : ఔరంగజేబు రోడ్డు పేరును APJ అబ్దుల్ కలాం మార్గ్గా మార్చారు.
• 2017 : డల్హౌసీ రోడ్ పేరును దారా షికో మార్గ్గా మార్చారు.
• 2019 సెప్టెంబర్ 12 : ఢిల్లీలోని ఫిరోజ్షా కోట్లా క్రికెట్ స్టేడియం పేరును అరుణ్ జైట్లీ స్టేడియంగా మార్చారు.
• 2019 జనవరి : ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్ పేరును ప్రయాగ్రాజ్గా మార్చారు. పూర్వం దీని పేరు ప్రయాగ్రాజ్ అయితే మొఘల్ పాలకుడు అక్బర్ పాలనలో దీనికి అలహాబాద్ అని పేరు పెట్టారు.
• 2018 : ఉత్తరప్రదేశ్లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం 2018లో ఫైజాబాద్ జిల్లా పేరును అయోధ్యగా మార్చింది. అయోధ్య శ్రీరాముడి జన్మస్థలం.
• 2018 ఆగస్టు 5 : ఉత్తరప్రదేశ్లోని మొఘల్సరాయ్ జంక్షన్ పేరు ‘పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ జంక్షన్’గా మార్చారు. మొఘల్సరాయ్ నగరాన్ని పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ నగర్గా మార్చారు.
• 2016 ఏప్రిల్ 12 : హర్యానాలోని గుర్గావ్ నగరం పేరును గురుగ్రామ్గా మార్చారు.
• 2022 ఫిబ్రవరి 7 : మధ్యప్రదేశ్లోని హోషంగాబాద్ జిల్లా పేరును నర్మదాపురంగా మార్చారు. అక్కడి బాబయీ టౌన్ పేరును మఖన్ నగర్ గా మార్చారు. మహాకవి మఖన్ లాల్ చతుర్వేది పేరు మీదుగా ఆ పేరు పెట్టారు.
• 2017 : ఇంగ్లండ్లోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పేరు మీద ఏర్పాటు చేసిన ‘ఇందిరా గాంధీ సెంటర్ ఆఫ్ సస్టెయినబుల్ డెవలప్మెంట్’ పేరును కేంద్ర ప్రభుత్వం మార్చింది. దాన్ని ‘ఆక్స్ఫర్డ్ ఇండియా సెంటర్ ఫర్ సస్టెయినబుల్ డెవలప్మెంట్’గా మార్చారు.
• 2021 ఆగస్టు 6 : రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు పేరును మేజర్ ధ్యాన్చంద్ ఖేల్ రత్నగా మార్చారు.
మారిన ప్రభుత్వ పథకాల పేర్లు..
• ఇందిరా ఆవాస్ యోజన పేరును ప్రధాన మంత్రి ఆవాస్ యోజనగా మార్చారు.
• ఇందిరా గాంధీ మాతృత్వ సహ్యోగ్ యోజన పేరును ప్రధాన మంత్రి మాతృత్వ వందన యోజనగా మార్చారు.
• రాజీవ్ గ్రామీణ విద్యుద్దీకరణ్ యోజన పేరును దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామ జ్యోతి యోజనగా మార్చారు.
• రాజీవ్ ఆవాస్ యోజన పేరును సర్దార్ పటేల్ నేషనల్ అర్బన్ హౌసింగ్ మిషన్గా మార్చారు.
• జవహర్లాల్ నెహ్రూ జాతీయ పట్టణ పునరుద్ధరణ మిషన్ను ఇప్పుడు ప్రధానమంత్రి ఆవాస్ యోజన (అర్బన్)గా పిలుస్తున్నారు.
• రాజీవ్ గాంధీ పంచాయతీ సాధికారత పథకం పేరును పంచాయతీ సాధికారత పథకంగా మార్చారు.
Related News
WhatsApp Message : మోడీ సర్కారు వాట్సాప్ మెసేజ్పై వివాదం
WhatsApp Message : ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో రాజకీయ పార్టీలు అలర్ట్ అయ్యాయి.