Japan Earthquake : 62కు చేరిన జపాన్ భూకంప మరణాలు.. అంధకారంలో పలు నగరాలు
Japan Earthquake : జనవరి 1న(సోమవారం) జపాన్లో వచ్చిన తీవ్ర భూకంపం వల్ల సంభవించిన మరణాల సంఖ్య మరింత పెరిగింది.
- Author : Pasha
Date : 03-01-2024 - 7:58 IST
Published By : Hashtagu Telugu Desk
Japan Earthquake : జనవరి 1న(సోమవారం) జపాన్లో వచ్చిన తీవ్ర భూకంపం వల్ల సంభవించిన మరణాల సంఖ్య మరింత పెరిగింది. దాదాపు 62 మంది చనిపోయినట్లు ఇప్పటివరకు అధికారికంగా గుర్తించారు. మరో 22 మంది తీవ్రంగా గాయపడ్డారని వెల్లడించారు. వాస్తవానికి చనిపోయిన వారి సంఖ్య దాదాపు 200కిపైనే ఉంటుందని అనధికారిక వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ సమాచారం ఇంకొన్ని రోజుల్లో బయటికి వస్తుందని అంటున్నారు. జపాన్ వాతావరణ విభాగం మరోసారి దేశ ప్రజలకు వార్నింగ్ జారీ చేసింది. మరిన్ని సార్లు భూమి కుదుపులకు గురయ్యే రిస్క్ ఉందని హెచ్చరించింది. కొండచరియలు, సముద్రతీరాల సమీపంలో నివసించేవారు, సంచరించేవారు జాగ్రత్తగా ఉండాలని ఈ అలర్ట్లో సూచించింది. ప్రత్యేకించి నోటో ద్వీపకల్ప ప్రాంతంలో భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని పేర్కొంది.
We’re now on WhatsApp. Click to Join.
జపాన్ భూకంపం ప్రభావం(Japan Earthquake) ప్రధానంగా హోన్షు ద్వీపంలోని ఇషికావా ప్రిఫెక్చర్ ప్రాంతంలో కనిపించింది. అక్కడ 7.5 తీవ్రతతో భూకంపం సంభవించడంతో.. సముద్రపు అలలు 3 అడుగుల ఎత్తులో ఎగిసి పడుతూ తీర ప్రాంతంలోని నివాసాల్లోకి దూసుకొచ్చాయి. దీంతో ఎన్నో ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఇంకెన్నో ఇళ్లలో అగ్నిప్రమాదం సంభవించింది. ఫలితంగా రోడ్లు దారుణంగా దెబ్బతిన్నాయి. చనిపోయిన వారిలో ఎక్కువ మంది ఇషికావా ప్రిఫెక్చర్ ప్రాంతం వారేనని తెలుస్తోంది. ఇషికావా ప్రిఫెక్చర్లో సోమవారం నుంచి ఇప్పటివరకు దాదాపు 34,000 ఇళ్లకు విద్యుత్తు సరఫరా పునరుద్ధరణ కాలేదు. దీంతో అన్ని కుటుంబాలు అంధకారంలోనే మగ్గుతున్నాయి. తీరప్రాంత నగరం సుజులో 90 శాతం ఇళ్ళు పూర్తిగా ధ్వంసమయ్యాయి.
Also Read: Shubh Muhurat : పెళ్లిళ్లు, శుభకార్యాలు, వాహనాల కొనుగోలుకు శుభ ముహూర్తాలివీ
జపాన్వ్యాప్తంగా ప్రస్తుతం 31,800 మందికిపైగా ప్రజలు పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు. దీన్నిబట్టి భూకంపం ఎఫెక్టును అంచనా వేయొచ్చు. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టాల్సిన సహాయక చర్యలపై నిర్ణయం తీసుకునేందుకు ఇవాళ ఉదయం జపాన్ ప్రధాన మంత్రి ఫుమియో కిషిడా అత్యవసర టాస్క్ఫోర్స్ సమావేశాన్ని నిర్వహించనున్నారు.