Nava Kerala Sadas: కేరళ ముఖ్యమంత్రి భద్రతా సిబ్బందిపై కేసు
కేరళ ముఖ్యమంత్రి భద్రతా సిబ్బందిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. యూత్ కాంగ్రెస్ కార్యకర్తలను కొట్టిన కేసులో ముఖ్యమంత్రి గన్మెన్పై కేసు పెట్టాలని కోర్టు తీర్పునిచ్చింది.
- Author : Vamsi Chowdary Korata
Date : 23-12-2023 - 6:45 IST
Published By : Hashtagu Telugu Desk
Nava Kerala Sadas: కేరళ ముఖ్యమంత్రి భద్రతా సిబ్బందిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. యూత్ కాంగ్రెస్ కార్యకర్తలను కొట్టిన కేసులో ముఖ్యమంత్రి గన్మెన్పై కేసు పెట్టాలని కోర్టు తీర్పునిచ్చింది. అలప్పుజ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ కోర్టు కేసు దాఖలు చేయాలని ఆదేశించింది. బాధితులు దాఖలు చేసిన పిటిషన్పై కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.
ముఖ్యమంత్రి గన్మెన్ అనిల్, సెక్యూరిటీ అధికారి సందీప్, ముగ్గురు భద్రతా సిబ్బందిపై ఈ పిటిషన్ దాఖలైంది. గన్మెన్, భద్రతా సిబ్బందిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ బాధితులు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. అయితే డ్యూటీలో భాగంగానే అలా చేశామని అధికారులు ఎస్పీకి నివేదిక ఇచ్చారు. ఈ పిటిషన్ను పరిగణనలోకి తీసుకున్న కోర్టు కేసు నమోదు చేయాల్సిందిగా అలప్పుజ సౌత్ పోలీసులను ఆదేశించింది.
ముఖ్యమంత్రి, మంత్రులు ప్రయాణిస్తున్న బస్సు అలప్పుజ జనరల్ హాస్పిటల్ జంక్షన్ వద్దకు చేరుకోగానే ముఖ్యమంత్రి సిబ్బంది యూత్ కాంగ్రెస్-కేఎస్ యూ కార్యకర్తలను కొట్టారు. నినాదాలు చేస్తున్న ఇద్దరు నేతలను పక్కకు లాక్కుని వెళ్లారు. అనంతరం ముఖ్యమంత్రి బస్సు వెళ్లింది. అయితే బస్సుతో పాటు కాన్వాయ్లో ఉన్న గన్మ్యాన్తో సహా ముఖ్యమంత్రి సిబ్బంది కారు దిగి వారిద్దరినీ లాఠీలతో దారుణంగా కొట్టారు.
Also Read: Balakrishna: రాజకీయాల్లో బాలయ్య బిజీబిజీ.. గెలుపు వ్యూహాలపై గురి!