BJP Sops: యూపీ రైతులకు బీజేపీ వరాల జల్లు.. రానున్న ఐదేళ్లు ఉచిత విద్యుత్తు
ఉత్తర ప్రదేశ్ శాసన సభ ఎన్నికల్లో బీజేపీ మరోసారి గెలిచిన వెంటనే రానున్న ఐదేళ్ళపాటు రైతులు విద్యుత్తు బిల్లులను చెల్లించవలసిన అవసరం ఉండదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిపారు.
- By Hashtag U Published Date - 09:57 AM, Wed - 16 February 22

ఉత్తర ప్రదేశ్ శాసన సభ ఎన్నికల్లో బీజేపీ మరోసారి గెలిచిన వెంటనే రానున్న ఐదేళ్ళపాటు రైతులు విద్యుత్తు బిల్లులను చెల్లించవలసిన అవసరం ఉండదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిపారు. దిబియాపూర్లో మంగళవారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. మార్చి 18న హోళీ పండుగ జరుగుతుందని, ఎన్నికల ఓట్ల లెక్కింపు మార్చి 10న జరుగుతుందని చెప్పారు.
‘‘మార్చి 10న బీజేపీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురండి, మార్చి 18న మీ ఇళ్ళకు ఉచిత గ్యాస్ సిలిండర్లు వస్తాయి’’ అని చెప్పారు. రానున్న ఐదేళ్ళపాటు రైతులు విద్యుత్తు బిల్లులను చెల్లించవలసిన అవసరం ఉండదని చెప్పారు. ఉత్తర ప్రదేశ్ శాసన సభ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మొదటి, రెండో విడత ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ రాష్ట్రం నుంచి తుడిచిపెట్టుకుపోయిందన్నారు.
బీజేపీకి 300కు పైగా స్థానాలు లభించడానికి పశ్చిమ ఉత్తర ప్రదేశ్ పునాది వేసిందని చెప్పారు. మూడో విడత పోలింగ్లో ఈ ఆధిక్యత మరింత ఘనంగా ఉంటుందని చెప్పారు.