Bharat Jagruthi: ముగిసిన భారత్ జాగృతి రౌండ్ టేబుల్ సమావేశం, 9 తీర్మానాలకు ఆమోదం
- By Balu J Published Date - 08:31 PM, Fri - 26 January 24

Bharat Jagruthi: వివిధ పార్టీల నేతలతో ఎమ్మెల్సీ కవిత రౌండ్ టేబుల్ సమావేశంలో నిర్వహించారు. ఈ సమావేశాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ఎమ్మెల్సీ కవిత కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా ప్రభుత్వంలో భాగస్వామ్యం అయినప్పటికీ నిఖార్సయిన ఎర్రజెండా స్పూర్తిని నిరూపించుకుంటూ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైన సీపీఐ పార్టీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా 9 తీర్మానాలు చేశారు.
ఆమోదించిన తీర్మానాలు
ఏప్రిల్ 11 లోగా ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయం రావాలని డిమాండ్
కర్పూరి ఠాకూర్ కు భారత రత్న ప్రకటించినందుకు హర్షం వ్యక్తం
పూలేకు భారత రత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్
కేంద్రంలో ఓబీసీల కోసం మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి
త్వరితిగతిన బీసీ జనగణన చేపట్టాలి
మహిళా రిజర్వేషన్లలో ఓబీసీ మహిళలకు కోటా కల్పించాలి
బీసీ రిజర్వేషన్ బిల్లును తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలి
8,9,10వ తరగతుల పాఠ్యపుస్తకాల్లో జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే జీవిత చరిత్రను పొందుపర్చాలి
ఆరు నెలల్లో స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని అమలు చేయాలి
అన్ని వర్గాలకు పూలే ఆదర్శవంతమైన వ్యక్తి: వీ ప్రకాశ్
కేవలం బీసీలు, దళితులకే కాకుండా అన్ని వర్గాలకు మహాత్మా జ్యోతిరావు పూలే ఆదర్శవంతమైన వ్యక్తి అని బీఆర్ఎస్ నేత, కార్పొరేషన్ మాజీ చైర్మన్ వీ ప్రకాశ్ అన్నారు. అటువంటి పూలే విగ్రహం అసెంబ్లీ ఆవరణలో ఏర్పాటు చేస్తే భావితరాలకు స్పూర్తిదాయకంగా ఉంటుందని చెప్పారు. భ్రూణహత్యలకు వ్యతిరేకంగా, కులాల వివక్ష పారద్రోలడానికి పూలే ఎంతగానో కృషి చేశారని, బీసీ, దళితులకు కాకుండా అన్ని వర్గాలకు పూలే ఆదర్శవంతమైన వ్యక్తి అని స్పష్టం చేశారు. పూలేను కేవలం బీసీగా చూడవద్దని, అన్ని వర్గాలకు పూలే ఆరాధ్యుడన్నారు. తెలంగాణ సాధనలో బతుకమ్మ ప్రజల చేతుల్లో సాంస్కృతిక ఆయుధం అయిందని, ఇప్పుడు కూడా పూలే విగ్రహ సాధన ఉద్యమం బీసీలకు ఐక్యతకు పునాది అవ్వాలని ఆకాంక్షించారు. ఎమ్మెల్సీ కవిత చేపట్టబోయే ఈ ఉద్యమంలో తాను కలిసి వస్తానని ప్రకటించారు.
అందరు కలిసి రావాలి: గట్టు రామచందర్ రావు
భారత జాగృతి చేస్తున్న ఈ పోరాటంలో అందరూ కలిసి రావాలని బీఆర్ఎస్ నాయకుడు గట్టు రామచందర్ రావు పిలుపునిచ్చారు. పూలే విగ్రహం కోసం ఎమ్మెల్సీ కవిత చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని, బీసీల కొసం గొంతెత్తుతున్నారని అన్నారు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొనాల్సిందిగా ఇతర రాష్ట్రాల ఓబీసీ సంఘాలు ఎమ్మెల్సీ కవితను ఆహ్వానిస్తున్నాయని చెప్పారు. అసెంబ్లీ ఆవరణలో అంబేడ్కర్ విగ్రహాన్ని పెట్టిచండానికి ఉద్యమించి సాధించిన ఘనత ఎమ్మెల్సీ కవితకు దక్కుతుందని, అన్ని రాజకీయ పార్టీలు, సంఘాలు ఎజెండాలు పక్కనబెట్టి విగ్రహం సాధనకు పనిచేయాలని కోరారు.
పూలే ఆశయాలకు ప్రతిరూపం బీఆర్ఎస్: ఆంజనేయ గౌడ్
ముక్కలు ముక్కలు చేస్తాం, పాతాళంలోకి తొక్కేస్తామంటూ పాలకులు అడ్డగోలు భాష మాట్లాడుతున్నారని, పూలే, అంబేడ్కర్ ఆశయాలు కలిగిన బీఆర్ఎస్ ను పాతిపెడుతామని అనడం సరికాదని తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ నేత ఆంజనేయ గౌడ్ సూచించారు. పూలే ఆశయాలను, అంబేడ్కర్ ఆకాంక్షలకు ప్రతిరూపం బీఆర్ఎస్ పార్టీ అని, గులాబీ జెండా పుట్టుకలోనే పూలే ఆశయాలు ఉన్నాయని చెప్పారు. వివక్ష లేని సమాజాన్ని బీఆర్ఎస్ కోరుకుందని, పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో పూలే ఆశయాలను అమలు చేసి తమ పార్టీ అధినేత కేసీఆర్ చూపించారని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ కవిత అలుపెరగని పోరాటం చేసి అసెంబ్లీ ఆవరణలో అంబేడ్కర్ విగ్రహాన్ని సాధించారని కొనియాడారు. అసెంబ్లీ ఆవరణలో పూలే విగ్రహం కోసం భారత జాగృతి చేస్తున్న పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని ప్రకటించారు. కవిత నాయతకత్వానికి, ప్రతి అడుగులో బీఆర్ఎస్ పార్టీ తోడుగా నిలుస్తుందని తెలిపారు. పూలే విగ్రహం అసెంబ్లీ ఆవరణలో ప్రతిష్టించకపోతే కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తామని హెచ్చరించారు. అలాగే, బీఆర్ఎస్ నేత, మాజీ కార్పొరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ మాట్లాడుతూ… కార్పొరేషన్ చైర్మన్లలో 50 శాతం పదవులు బీసీలకు ఇచ్చిన ఘనత కేసీఆర్ దని స్పష్టం చేశారు. ముఖ్యమైన పోస్టులను సీఎం రేవంత్ రెడ్డి సొంత సామాజిక వర్గానికి కేటాయించారని విమర్శించారు. సామాజిక న్యాయానికి కాంగ్రెస్ ప్రభుత్వం పాతర వేస్తున్నదని ఆరోపించారు. బీసీల అభ్యున్నత కోసం కృషి చేసిన మహానాయకుడు కేసీఆర్ అని కొనియాడారుఅసెంబ్లీలో పూలే విగ్రహం ఏర్పాటుకు ఎమ్మెల్సీ కవిత చేస్తున్న పోరాటానికి బీఆర్ఎస్ మద్ధతు ఉంటుందని, అసెంబ్లీలోనే కాకుండా ట్యాంక్ బండ్ పై కూడా పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. 125 అడుగుల పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేసి బీసీల ఆత్మగౌరవాన్ని ఆవిష్కరించాలని స్పష్టం చేశారు.
సీపీఐ(ఎంఎల్) నాయకుడు సుభాష్ మాట్లాడుతూ… సమాజానికి వెలుగునిచ్చి జీవితాన్ని మొత్తం అట్టడుగు వర్గాల కోసం ధారబోసిన వ్యక్తి జ్యోతిరావు పూలే విగ్రహాన్ని అసెంబ్లీ ఆవరణలో ఏర్పాటు చేయాలని ఉద్యమిస్తున్న ఎమ్మెల్సీ కవిత చొరువ స్పూర్తిదాయకమన్నారు. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నాయకుడు బండారి శేఖర్ మాట్లాడుతూ… క్షేత్రస్థాయి కార్యాచరణ రూపకల్పన చేయాలని, గ్రామ, మండల స్థాయిలో విస్తృతంగా ఈ అంశాన్ని తీసుకెళ్లాలని సూచన చేశారు. కొన్ని వర్గాలకు పూలేను పరిమితం చేయడం సరికాదని సూచించారు. తన చుట్టూ ఈడీ, మోడీలు మూగినా కూడా మహిళా బిల్లు కోసం ఎమ్మెల్సీ కవిత పోరాటం చేశారని చెప్పారు. ఈ పోరాటాన్ని కూడా కూడా ముందుకు తీసుకెళ్తారన్న విశ్వాసం ఉందని అన్నారు.
రచయిత సంఘిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ… అసెంబ్లీ ఆవరణలో పూలే విగ్రహం ఏర్పాటు చేయడంతో పాటు పుస్తకాల రూపంలో ప్రతిబడిలో ఆయన రాసిన రచనలు అందుబాటులో ఉండాలని, పాఠ్యపుస్తకాల్లో జీవిత చరిత్ర చేర్చాలని ప్రతిపాదించారు. ప్రతి విశ్వవిద్యాలయాల్లో పూలే పేరిట ఓబీసీ స్టడీ సెంటర్లను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. విద్య ద్వారానే సమాజం బాగుపడుతుందని పూలే చెప్పిన విధానాన్ని ఆచరణలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పారు. తెలంగాణకు పూలేకి ఎంతో అనుబంధం ఉందని వివరించారు.