Bandi: రాష్ట్ర ప్రభుత్వం ‘స్టడీ సర్కిల్స్’ ఏర్పాటుచేయాలి!
తెలంగాణ సీఎం కేసీఆర్ కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు.
- By Balu J Published Date - 02:33 PM, Sat - 12 March 22
తెలంగాణ సీఎం కేసీఆర్ కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. ప్రభుత్వ ఉద్యోగాల పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ యువతీ యువకులకు అసెంబ్లీ నియోజకవర్గానికొక స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. గత రెండేండ్లుగా కోవిడ్ మహమ్మారి వల్ల తలెత్తిన ఆర్థిక ఇబ్బందుల వల్ల యువతీ, యువకులు పోటీపరీక్షల కోసం పెద్ద ఎత్తున ఖర్చుపెట్టే పరిస్థితి లేదన్న బండి సంజయ్… మారుమూల గ్రామాల నుండి శిక్షణ కొరకు జిల్లా కేంద్రాలకు రావడం నిరుద్యోగ యువతకు వ్యయప్రయాసలతో కూడిన అంశమని లేఖలో పేర్కొన్నారు. కాబట్టి నియోజకవర్గానికొక ఉచిత స్టడీ సర్కిల్ను ఏర్పాటు చేసి, నిరుద్యోగ యువతకు అదనపు ఖర్చులు తగ్గించాలని సూచించారు.
ప్రైవేట్ కోచింగ్ సెంటర్లలో ఫీజుల నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేసి ఫీజులు నియంత్రించాలి. పార్టీల ద్వారా ఏర్పాటు చేసే కోచింగ్ సెంటర్ల వల్ల అభ్యర్థుల్లో రాగద్వేషాలు ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో… టీశాట్, ప్రభుత్వ స్టడీ సర్కిల్స్, కోచింగ్ కేంద్రాల ద్వారానే నిరుద్యోగ యువతకు శిక్షణనివ్వాలని చెప్పారు. ప్రతిజిల్లా, నియోజకవర్గ కేంద్రాలలో గ్రంథాలయాలను ఏర్పాటు చేయాలి. నిరుద్యోగ యువతకు అవసరమైన కోచింగ్ మెటీరియల్ ఉచితంగా అందించాలి. వెంటనే టెట్ ఎంట్రన్స్ పరీక్ష నిర్వహించాలని కేసీఆర్ సర్కార్ ను బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ డిమాండ్ చేశారు.
Related News
IMD Red Alert : ఉత్తరాదికి రెడ్ అలర్ట్.. తెలంగాణకు రెయిన్ అలర్ట్
ఉత్తర భారతదేశంలో ఎండలు మండిపోతున్నాయి.