Jeevan Reddy: అభివృద్ధిలో అర్మూర్ ను పరుగులు పెట్టిస్తున్నా: ఎమ్మెల్యే జీవన్ రెడ్డి
కాంగ్రెస్, బీజేపీలకు ఓటు..అభివృద్ధికి చేటు ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి అన్నారు.
- By Balu J Published Date - 03:43 PM, Sat - 30 September 23
ఆర్మూర్, సెప్టెంబర్30: కాంగ్రెస్, బీజేపీలకు ఓటు..అభివృద్ధికి చేటు అని పీయూసీ చైర్మన్, ఎమ్మెల్యే, బీఆర్ ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి అన్నారు. “వాళ్ళు ఐదేళ్లకొక సారొచ్చే సంక్రాంతి గంగిరెద్దులు. వారి మోసపు మాటలు నమ్మి ఓటేస్తే మిమ్మల్ని కాటేస్తారు.ఈ ఐదేళ్లలో కాంగ్రెస్, బీజేపీ నాయకులెవరైనా మీ గ్రామాలకొచ్చారా? అని ఆయన మండిపడ్డారు. “నమస్తే నవనాథ పురం” కార్యక్రమంలో భాగంగా శనివారం మాక్లూర్ మండలం రామచంద్రపల్లిలో “ప్రజాశీర్వాద యాత్ర” నిర్వహించి ప్రగతి నివేదికను ఆవిష్కరించారు. గ్రామంలో పర్యటించి పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలలో పాల్గొన్నారు. ప్రభుత్వ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి ఉదయం గ్రామంలోకి అడుగు పెట్టిన జీవన్ రెడ్డికి ప్రజలు డప్పు వాయిద్యాలు, మేళతాళాలతో ఘన స్వాగతం పలికారు. పూలమాలలు, శాలువాలతో గ్రామస్తులు, పలు కుల సంఘాలు, ప్రజా సంఘాల పెద్దలు జీవన్ రెడ్డిని సత్కరించారు.
“జై జీవనన్న, జైజై కేసీఆర్, జై తెలంగాణ”, ఆర్మూర్ గడ్డ జీవనన్న అడ్డా” అన్న నినాదాలతో రామచంద్రపల్లి గ్రామం మారుమోగింది. ఆయన ప్రతీ ఒక్కరినీ పేరుపేరునా పలకరిస్తూ ప్రజల యోగ క్షేమాలను అడిగి తెలుసు కున్నారు. పలు సమస్యలను ఆయన అక్కడికక్కడే పరిష్కరించారు. అనంతరం జరిగిన సభలో జీవన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీలకు ఓట్లు తప్ప జనం పాట్లు పట్టవని ధ్వజమెత్తారు. ఒక్క బీఆర్ఎస్సే తెలంగాణ ఇంటి పార్టీ. కేసీఆర్ సబ్బండ వర్గాల దేవుడు. తెలంగాణ పథకాలు ఎక్కడైనా ఉన్నాయా?. పదేళ్లలోనే వందేళ్ల అభివృద్ధి సాధించాం అని ఆయన అన్నారు. రామచంద్రపల్లి గ్రామం ప్రభుత్వ పథకాలతో సంతోషమయంగా కనిపిస్తోందన్నారు. తనకు ఈ గ్రామ ప్రజలు బ్రహ్మరథం పట్టిన తీరు చూసి తెలంగాణ రాష్ట్రం వచ్చిన రోజు ఎంత సంతోషపడ్డానో అంతకు మూడు రెట్లు ఇప్పుడు సంతోష పడ్డానని ఆయన తెలిపారు. నేను ఈ గ్రామంలోకి వస్తున్న సమయంలో బుర్రె చిన్న సాయన్న, గొల్ల మోహన్, కందుల గంగాధర్, మెంగాని లక్ష్మణ్, గోపతి రామ్ చరణ్, గంగారాం తదితర వికలాంగులు నాకు తారసపడి ఎక్కడికి పోతున్నారు సార్ అని అడిగిన్రు.
మీ ఊరికే పోయి నేను చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి చెప్పి మూడోసారి కూడా నాకే ఓటేయమని అర్ధించడానికి వెళుతున్న అని చెప్పా. ఎందుకు సారు మీకనవసర శ్రమ. కేసీఆర్ మా వికలాంగుల పట్ల దేవుడు. ఆయన ప్రభుత్వాన్ని కాపాడుకునే బాధ్యత మాపై ఉంది. ఆర్మూరు నియోజకవర్గంలో 5వేలమంది వికలాంగులం ఉన్నాం. మేమే ఇంటింటికీ తిరిగి ఒక్కొక్కళ్ళం 15 ఓట్ల చొప్పున వేయించి మిమ్మల్ని 70వేల ఓట్ల మెజారిటీతో గెలిపించుకుంటామని చెప్పిన్రు. అయినా నేను పోయి చేసిన ప్రగతి గురించి మా అక్కలు చెల్లెళ్లకు, మా అన్నలకు, మా తమ్ముళ్లకు చెప్పుకుంటా అని మీ దగ్గరకొచ్చా అని జీవన్ రెడ్డి చెప్పారు. అభివృద్ధి, సంక్షేమ పథంలో రామచంద్రపల్లి గ్రామం పరిఢవిల్లుతోంది. రామచంద్రపల్లిలో శివాలయం నిర్మిస్తా. తెలంగాణ వస్తే ఏమొస్తదన్న సన్నాసులకు జరిగిన అభివృద్దే సమాధానం. బీఆర్ఎస్ కు తప్ప మరే పార్టీకి ఆర్మూర్ లో చోటు లేదు. అభివృద్ధిలో అర్మూర్ ను పరుగులు పెట్టిస్తున్నా. మూడోసారీ నన్నే దీవించండి. మీకోసం మరో 30 ఏండ్లు జీతగాడిలా పనిచేస్తానని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు.
Related News
Rythu Bandhu: నేను రోడ్డెక్కినందుకే రైతు బంధు ఇచ్చిండ్రు: కేసీఆర్
తెలంగాణ ప్రభుత్వం తన 'పోరు బాట' బస్సు యాత్రకు భయపడి రైతులకు 'రైతు బంధు' ఆర్థిక సాయం పంపిణీని ప్రారంభించిందని చెప్పారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.