Fear Politics : ఎన్నికల్లో పోటాపోటీగా ఫియర్ పాలి‘ట్రిక్స్’
2019 వరకు ఎన్నికలలో ఉచిత హామీలు, ఉద్వేగాలు, దేశ ప్రజల కలల సాకారం వంటి అంశాలు కీలకంగా ఉండేవి.
- Author : Pasha
Date : 21-05-2024 - 9:45 IST
Published By : Hashtagu Telugu Desk
Fear Politics : 2019 వరకు ఎన్నికలలో ఉచిత హామీలు, ఉద్వేగాలు, దేశ ప్రజల కలల సాకారం వంటి అంశాలు కీలకంగా ఉండేవి. ఇప్పుడు సీన్ మారింది. ఓటర్లలో ‘భయం’ పుట్టించి ఓట్లు పొందే దిశగా ఈ ఎన్నికల్లో రాజకీయపార్టీలు పథక రచన చేశాయి. ఆ పార్టీ ఈ పార్టీ అని తేడా లేకుండా దాదాపు అన్ని రాజకీయ పక్షాలు ఇదే బాటలో పయనించాయి. వివిధ పార్టీలు లేవనెత్తిన అంశాలు వేర్వేరు కావచ్చు.. కానీ వాటిలో ఉన్న కామన్ కంటెంట్ మాత్రం ‘భయం’. వివరాలివీ..
We’re now on WhatsApp. Click to Join
బీజేపీ ఏమేం చెప్పిందంటే..
ఫియర్ పాలిటిక్స్లో బీజేపీ ముందంజలో నిలిచింది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అయోధ్య రామాలయంపైకి బుల్డోజర్ను పంపుతారని స్వయంగా ప్రధాని మోడీ వ్యాఖ్యలు చేశారు. దీనివల్ల ఓ వర్గం ఓటర్లు ఆందోళన చెందే పరిస్థితి ఏర్పడింది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు ఖర్గే సహా, అగ్ర నేత రాహూల్ గాంధీ స్పందించాల్సి వచ్చింది. తాము గెలిచాక రామ మందిర నిర్మాణాన్ని పూర్తి చేస్తామని ప్రకటించాల్సి వచ్చింది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అయోధ్య రామమందిరంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై అప్పీల్ చేస్తుందని.. కశ్మీర్కు తిరిగి స్వయం ప్రతిపత్తిని కల్పిస్తుందని బీజేపీ ప్రచారం చేసింది. ఆర్టికల్ 370ని కాంగ్రెస్ పునరుద్ధరిస్తుందని బీజేపీ అంటోంది. కాంగ్రెస్ పాలనలో దేశంలో బాంబులు పేలుతాయనే ప్రచారం కూడా కాషాయ పార్టీ చేసింది.
కాంగ్రెస్ ఏం చెబుతోంది ?
బీజేపీకి 400 సీట్లు వస్తే దేశ రాజ్యాంగాన్ని మార్చేస్తుందని కాంగ్రెస్ పార్టీ జోరుగా ప్రచారం చేసింది. బీజేపీ గెలిస్తే రాజ్యాంగం నుంచి సెక్యులర్ అనే పదాన్ని తొలగించి, మతదేశంగా భారత్ను ప్రకటిస్తుందని కాంగ్రెస్ అంటోంది. మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తే.. విపక్ష నేతలంతా జైళ్లలోకి వెళ్లడం ఖాయమని హస్తం పార్టీ చెబుతోంది. బీజేపీ ప్రభుత్వం వల్ల ఎదురయ్యే ముప్పుకు భయపడి తమకు ఓటు వేయాలనే పాచికను కాంగ్రెస్ వేసింది. అయితే అది ఫలితాన్ని ఇస్తుందా ? ఇవ్వదా ? అనేది తెలియాలంటే జూన్ 4 వరకు వేచి చూడాల్సిందే.
Also Read :BJP Candidates : బీజేపీ అభ్యర్థుల్లో ‘ఫిరాయింపు’ నేతలు ఎంతమంది తెలుసా ?
ఏపీ, తెలంగాణలో ఇలా..
- ఏపీ ఎన్నికల్లోనూ టీడీపీ, వైఎస్ఆర్సీపీ, జనసేన కూడా ఫియర్ పాలి‘ట్రిక్స్’ను(Fear Politics) వాడుకున్నాయి. తమ ప్రభుత్వం ఏర్పడకపోతే సంక్షేమ పథకాల అమలు ఆగిపోతుందని వైఎస్సార్ సీపీ ప్రజలకు చెప్పింది. టీడీపీ అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లు తొలిగిపోతాయని, క్రైస్తవులకు ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని ప్రచారం చేసింది.
- మళ్లీ జగన్ అధికారంలోకి వస్తే ఏపీలో హింస చెలరేగుతుందని టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రచారం చేసింది. జగన్ ప్రభుత్వం మళ్లీ వస్తే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ను అమలు చేస్తుందని ప్రజలకు చెప్పింది.
- తెలంగాణలో బీఆర్ఎస్కు ఓటు వేస్తే, బీజేపీకి ఓటు వేసినట్లేనని సీఎం రేవంత్ రెడ్డి తన ప్రచారంలో పేర్కొన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లు పోతాయన్నారు. బీఆర్ఎస్కు ఎంపీ సీట్లు వస్తే కేసీఆర్ కుటుంబానికి తప్ప తప్ప ఎవరికీ లాభం ఉండదని కాంగ్రెస్ చెప్పింది.