Business Idea : చిన్నటెక్నిక్ తో విదేశీ కూరగాయలను పండిస్తూ..లక్షల్లో లాభాలు ఆర్జిస్తున్న రైతు..!!
- Author : hashtagu
Date : 29-11-2022 - 11:28 IST
Published By : Hashtagu Telugu Desk
కాలానుగుణంగా వ్యవసాయంలో అధునాతన మార్పులు ఎన్నో వస్తున్నాయి. సాగు పనుల్లోనూ సాంకేతిక పెరిగిపోతుంది. ఎద్దులతో ఎవుసం చేసే రోజులు పోయాయి. యంత్రాలతో పనులు చేసే రోజులు వచ్చాయి. దీంతో వ్యవసాయంలో కొత్త కొత్త ఆవిష్కరణలు ప్రారంభం అవుతున్నాయి. రైతులు నూతన పంటలకు శ్రీకారం చుడుతున్నారు. దేశీయ పంటలే కాకుండా…విదేశీ పంటలను పండిస్తూ తమ సత్తా చాటుతున్నారు అన్నదాతలు. ఉత్తరాఖండ్ లోని బాగేశ్వర్ జిల్లా కౌసాని గ్రామానికి చెందిన లాల్ సింగ్ హైడ్రోపోనిక్స్ టెక్నిక్ తో వ్యవసాయం ప్రారంభించాడు. సీజనల్ అన్ సీజన్ కూరగాయలు పండిస్తూ లక్షల్లో ఆదాయం అర్జిస్తున్నాడు.
అవకాడో సాగు.
ఉత్తరఅమెరికాలో పెరిగే అవకాడోను లాల్ సింగ్ తన గ్రామంలో సాగుచేశాడు. అవకాడోకు చాలా డిమాండ్ ఉంటుంది. భారత్ లో ఒక్కోటి దాదాపు 350 రూపాయలకు పైనే ఉంటుంది. ఈ అవకాడో సాగు చేయాలంటే ఎన్నో మెలుకవలు పాటించాల్సి ఉంటుంది. సాధారణంగా ఇది శీతలప్రదేశంలోనే పెరుగుతుంది. భారత్ లో దీన్ని పండించడం సవాళుతో కూడుకున్నది. కానీ లాల్ సింగ్ పండించి చూపించాడు. దీంతోపాటు కివి, ఏలకులు కూడా పండించాడు. వీటితోపాటు చేపల పెంపకం, పశుపోషణతోపాటు సేంద్రియ ధాన్యాలు పండిస్తున్నాడు.
లాల్ సింగ్ గతంలో ఢిల్లీ ఫ్యాక్టరీలో లైన్ లో పనిచేసేవాడు. ఉద్యోగంపై విరక్తి రావడంతో…తన సొంత ఊరులోనే ఏదైనా వ్యాపారం ఎందుకు చేయకూడదని ఆలోచించాడు. అనుకున్నదే ఆలస్యం తన సొంతగ్రామానికి చేరుకున్నాడు. తనకున్న కొద్దిపాటి భూమిలో 2004లో సేంద్రియ వ్యవసాయం చేయడం ప్రారంభించాడు. కొత్త కొత్త పద్ధతులను ఉపయోగిస్తూ…రకరకాల పంటలను సాగు చేశాడు. పుట్టగొడుగులు, పండ్లు, కూరగాయలు పండిస్తూ లక్షల సంపాదించాడు. కొండలపై వ్యవసాయం శుద్ధ దండగా అనుకున్నవారికి…వ్యవసాయం చేస్తే లాభాలు అర్జించవచ్చని నిరూపించాడు.