చైనాను కమ్మేసిన పొగమంచు.. 200 వాహనాలు ఢీ?
శీతాకాలం మొదలైందంటే పొగమంచు కమ్మేస్తుంది. దట్టమైన పొగ మంచు వల్ల కొన్ని చోట్ల ప్రమాదాలు కూడా జరుగుతుంటాయి.
- By Nakshatra Published Date - 09:31 PM, Wed - 28 December 22
శీతాకాలం మొదలైందంటే పొగమంచు కమ్మేస్తుంది. దట్టమైన పొగ మంచు వల్ల కొన్ని చోట్ల ప్రమాదాలు కూడా జరుగుతుంటాయి. తాజాగా అలాంటి ఘటనే చైనాలో చోటుచేసుకుంది. బుధవారం చైనాలో పొగ మంచు దెబ్బకు ఘోర ప్రమాదం వాటిల్లింది. పొగమంచు వల్ల 200 కార్లు ఒక్కసారిగా ఢీకొనగా ఈ ఘటనలో అనేక మందికి తీవ్ర గాయాలు అయ్యాయి.
చైనాలోని హెనాన్ ప్రావిన్స్లోని జెంగ్జువా నగరంలో పొగ మంచు వల్ల ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఓ బ్రిడ్జిపై దట్టమైన పొగమంచు ఏర్పడటంతో భారీగా వాహనాలు ఆగిపోయాయి. ఆ సమయంలో పొగ మంచు వల్ల భారీ ప్రమాదం జరిగింది. బ్రిడ్జిపై వెళ్తున్న 200 వాహనాలు వెనుక వైపు నుంచి ఒకదానినొకటి ఢీకొన్నాయి. ఈ సంఘటనలో ఒకరు ప్రాణాలు విడిచారు.
వాహనాలు ఢీకొనడంతో చాలా మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక యంత్రాల ద్వారా అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ పుటేజీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కార్లు, ట్రక్కులు ఒకదాని తర్వాత మరొకటి ఢీకొనడంతో బ్రిడ్జిపై అస్తవ్యస్తంగా మారింది.
కాగా చైనాలో గత కొన్ని రోజులుగా దట్టమైన పొగమంచు కురుస్తుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాహనదారులకు రోడ్డు కనిపించకపోవడం వల్ల పలు ప్రాంతాల్లో ఇటువంటి తరహా ఘటనలు జరుగుతున్నాయి. బుధవారం కూడా దట్టమైన పొగమంచు కమ్మేయడం వల్లే వాహనాలు ఒకదాని తర్వాత మరొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదం వల్ల దాదాపు11 అగ్నిమాపక వాహనాలు, 66 మంది అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వాహనాలు ఢీకొన్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
Related News
Terrorists Attack : గాఢ నిద్రలో ఉండగా ఏడుగురు కార్మికుల కాల్చివేత
Terrorists Attack : ఉగ్ర కూపంగా మారిన పాకిస్తాన్ ఉగ్రవాద దాడులతో అల్లాడుతోంది.