ఢిల్లీ మెట్రోకు అభివృద్ధికి 12 వేల కోట్లు కేంద్ర ఆమోదం!
- Author : Vamsi Chowdary Korata
Date : 24-12-2025 - 4:26 IST
Published By : Hashtagu Telugu Desk
Delhi Metro : కాలుష్య కోరల్లో చిక్కుకుని విలవిలలాడుతోన్న దేశ రాజధాని ఢిల్లీలో ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపరిచేందుకు కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఢిల్లీ మెట్రో ఐదో దశ విస్తరణకు రూ.12,015 కోట్లతో ఆమోదం తెలిపారు. ఈ దశలో 16 కిలోమీటర్ల మేర 13 కొత్త స్టేషన్లు నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టుతో ఢిల్లీ మెట్రో మొత్తం పొడవు 400 కిలోమీటర్లకు చేరుకుంటుంది.
- ఢిల్లీలో మెట్రో రైల్ ఫేజ్ 5ఏ విస్తరణకు ఆమోదం
- మొత్తం రూ.12 వేలకుపైగా కోట్లతో మూడు కారిడార్లు
- మూడేళ్లలో ప్రాజెక్ట్ పూర్తిచేయాలని లక్ష్యం
దేశ రాజధాని ఢిల్లీలో ప్రజా రవాణాకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బుధవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర క్యాబినెట్ ఢిల్లీ మెట్రో రైలు విస్తరణకు ఆమోదం తెలిపింది. మొత్తం రూ.12,015 కోట్లతో ఐదో దశలో 13 స్టేషన్లను నిర్మించనున్నారు. ఈ దశలో 16 కిలోమీటర్ల మేర నిర్మాణం చేపట్టనున్నారు. దీంతో ఢిల్లీ మెట్రో మొత్తం పొడవు 400 కిలోమీటర్ల మార్కు చేరుకోనుంది. మూడేళ్లలో ప్రాజెక్టు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఫేజ్ 5 ఏలో 10 అండర్ గ్రౌండ్, మూడు ఎలివేటెడ్ స్టేషన్లు ఉంటాయని కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు.
ప్రధాని అధ్యక్షతన జరిగిన కేంద్ర క్యాబినెట్ సమావేశంలో ఢిల్లీ మెట్రో విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ఆయన తెలిపారు. మొత్తం మూడు కారిడార్లలో ఆర్కే ఆశ్రమ్ మార్గ్ నుంచి ఇంద్రప్రస్థ వరకూ 9.9 కిలోమీటర్లకు రూ.9,570 కోట్లు, ఏరో సిటీ నుంచి ఎయిర్పోర్ట్ టెర్మినల్-1 వరకూ 2.3 కి.మీలకు రూ.1,419 కోట్లు, తుగ్లాకాబాద్ నుంచి కాళింద్ కుంజ్ వరకూ 3.9 కి.మీలు రూ.1,024 కోట్లు కేటాయించినట్టు మంత్రి వెల్లడించారు. దీని వల్ల ఢిల్లీలో ఏటా 33 వేల టన్నుల కార్బన ఉద్గారాలు నియంత్రణ సాధ్యమవుతుందని అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. భవిష్యత్తులో టెర్మినల్ 1 నుంచి భవిష్యత్తులో విమానాలు పెద్ద సంఖ్యలో రాకపోకలు సాగిస్తాయని, ఈ కారిడార్ టెర్మినల్ 1 నుంచి ఏరో సిటీకి.. అక్కడ నుంచి రైడ్ లైన్ సిటీ సెంట్రల్లోని శివాజీ నగర్ స్టేషన్కు అనుసంధానం అవుతుందని మంత్రి పేర్కొన్నారు.