MK Stalin: కేంద్రం డీలిమిటేషన్ బిల్లుకు వ్యతిరేకంగా తమిళనాడు సీఎం నిరసన
- Author : Vamsi Chowdary Korata
Date : 16-04-2026 - 11:27 IST
Published By : Hashtagu Telugu Desk
కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నియోజకవర్గాల పునర్విభజన బిల్లుపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. నమక్కల్లో గురువారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన బిల్లు కాపీని స్వయంగా దహనం చేసి తన వ్యతిరేకతను బలంగా చాటారు. ఈ బిల్లును ‘నల్ల చట్టం’గా అభివర్ణించిన ఆయన, దీనికి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
నిరసనలో భాగంగా, తమిళనాడులోని ఇళ్లు, బహిరంగ ప్రదేశాల్లో నల్ల జెండాలు ఎగురవేయాలని స్టాలిన్ కోరారు. చెన్నై గోపాలపురంలోని దివంగత మాజీ సీఎం కరుణానిధి నివాసంపై మొదటి నల్ల జెండాను ఎగురవేసి ఈ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. కేవలం జనాభా ప్రాతిపదికన లోక్సభ స్థానాలను పెంచడం వల్ల జనాభా నియంత్రణను విజయవంతంగా అమలు చేసిన తమిళనాడు వంటి దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల పార్లమెంటులో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం, రాజకీయ పలుకుబడి తగ్గిపోతాయని ఆయన అన్నారు.
నియోజకవర్గాల పునర్విభజనలో జనాభాతో పాటు రాష్ట్రాల ఆర్థిక సహకారం (జీఎస్ డీపీ) వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. 1950, 60 దశకాల్లో తమిళ గడ్డపై జరిగిన హిందీ వ్యతిరేక ఉద్యమం తరహాలోనే ఈ బిల్లుకు వ్యతిరేకంగా మరో పోరాటం మొదలైందని స్టాలిన్ వ్యాఖ్యానించారు.
ప్రస్తుతం ఉన్న 545 లోక్సభ స్థానాలను 850కి పెంచాలని కేంద్రం ప్రతిపాదించింది. అయితే ఈ పెంపు ఉత్తరాది రాష్ట్రాలకు రాజకీయంగా అధిక లబ్ధి చేకూరుస్తుందని, దక్షిణాది రాష్ట్రాల వాణిని అణచివేస్తుందని డీఎంకే సహా పలు విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.