Rains : పలు రాష్ట్రాల్లో వర్ష భీభత్సం…మరో 2 రోజులు ఇంతే..!!
దేశంలోని పలు రాష్ట్రాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. నదులు ఉదృతంగా ప్రవహించి నివాసప్రాంతాలను ముంచెత్తున్నాయి.
- Author : hashtagu
Date : 30-08-2022 - 6:15 IST
Published By : Hashtagu Telugu Desk
దేశంలోని పలు రాష్ట్రాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. నదులు ఉదృతంగా ప్రవహించి నివాసప్రాంతాలను ముంచెత్తున్నాయి. ఈ వరదల్లో ఆరుగురు మృతి చెందారు. భారీ వర్షాలు కురుస్తుండటంతో ఉత్తరాఖండ్ నుంచి కేరళ వరకూ నదుల్లో నీటి మట్టం పెరుగుతోంది. అది ప్రమాదకర స్థాయికి చేరి నివాస ప్రాంతాలను ముంచెత్తుతోంది.
ఉత్తరప్రదేశ్ లో గంగానది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో వరణాసి, ఘాజీపూర్, మీర్జాపూర్, బలియా నగరాల్లో లోతట్టుప్రాంతాలు నీట మునిగాయి. గంగాతీర ప్రాంతాల్లోని 80 గ్రామాలు జలదగ్బంధంలో చిక్కుకున్నాయి. వరదల కారణంగా ముగ్గురు మరణించారు. ప్రయాగరాజ్ నగరంలోని గంగా నదీ తీర ప్రాంతంలోని ఇళ్లు వరదనీటిలో నానుతున్నాయి.
కేరళలోని పలు జిల్లాలో అతి భారీవర్షాలు కురుస్తున్నాయి. దీంతో కొండచరియలు విరిగిపడుతున్నాయి. కుడియాత్తూర్ లో ఓ ఇంటిపై కొండచరియలు విరిగిపడి ముగ్గురు మరణించారు. సమాయక చర్యలను ప్రభుత్వం ముమ్మరం చేసింది. కర్నాటకలో భారీవర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. మైసూరు, మండ్య, చామరాజనగర, రామనగర, దక్షిణ కన్నడ జిల్లాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. వర్షాలకు మైసూరు, బెంగళూరు మధ్య రహదారిపై నీరు చేరింది. రామనగరలో అనేక కార్లు, వాహనాలు వరద నీటిలో కొట్టుకుపోయాయి. దేశంలో మరో రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. దీంతో వరదలతో ప్రభావితమైన రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలను ముమ్మరం చేశాయి