Ricky Ponting:పృధ్వీ షా పై పాంటింగ్ ప్రశంసలు
ఐపీఎల్ 2022లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ పృథ్వీ షా తన స్థాయికి తగ్గ ఆటతీరును ప్రదర్శిస్తున్నాడు.
- Author : Naresh Kumar
Date : 14-04-2022 - 10:00 IST
Published By : Hashtagu Telugu Desk
ఐపీఎల్ 2022లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ పృథ్వీ షా తన స్థాయికి తగ్గ ఆటతీరును ప్రదర్శిస్తున్నాడు. ఈ సీజన్లో సూపర్ ఫామ్లో ఉన్న పృథ్వీ షా.. ఆడిన 4 మ్యాచ్ల్లో రెండు అర్థ శతకాలు బాది 160 పరుగులు సాధించాడు. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు హెడ్ కోచ్ రికీ పాంటింగ్ పృథ్వీ షాపై ప్రశంసల జల్లు కురిపించాడు. ఓపెనర్ గా బౌలర్లపై ఎదురుదాడి చేయడంలో షా రూటే సెపరేటు అని పాంటింగ్ అన్నాడు.పృథ్వీ షా బ్యాటింగ్ చూస్తుంటే.. తనను తాను చూసుకున్నట్లు ఉంది. తన కంటే ఎక్కువ ప్రతిభ కలిగిన ఆటగాడు అతను. అతణ్ని టీమిండియా తరఫున 100 టెస్టులు ఆడే ఆటగాడిగా తీర్చిదిద్దాలని అనుకుంటున్నట్టు చెప్పాడు.
తాను ఒక కోచ్ గా బాగా ఆస్వాదించే అంశాల్లో ఇది కూడా ఒకటని, ఇప్పటి వరకూ కోచ్ గా ఉన్న జట్లలో కూడా ఇలాగే చేశానని చెప్పుకొచ్చాడు. అంతకుముందు ముంబైకి కోచ్గా ఉన్నప్పుడు రోహిత్ శర్మ చాలా చిన్నవాడనీ, . హార్దిక్ పాండ్య, కృనాల్ పాండ్య అప్పడు ఇంకా జాతీయ జట్లలోకి రాలేదనీ గుర్తు చేసుకున్నాడు. అక్కడ తాను కోచింగ్ ఇచ్చిన ఆటగాళ్లలో ,చాలా మంది ఆటగాళ్లు టీమిండియా తరఫున ఆడారని చెప్పాడు. కోచ్గా అంతకు మించిన సంతృప్తి మరొకటి ఉండదని పాంటింగ్ చెప్పుకొచ్చాడు.. ఇక 47 ఏళ్ల పాంటింగ్ కోచింగ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ 2020 ఐపీఎల్ ఫైనల్ చేరింది.
మరోవైపు ఈ ఐపీఎల్లో ఇప్పటికే 23 మ్యాచ్లు ముగియగా.. పాయింట్ల పట్టికలో ఢిల్లీ క్యాపిటల్స్ 2 విజయాలతో ఆరో స్థానంలో కొనసాగుతోంది.. ఇక ఐపీఎల్ 2022 సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తమ తర్వాతి మ్యాచ్లో ఏప్రిల్ 16న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుతో పోటీపడనుంది.