Hindu IAS Officers : ‘హిందూ ఐఏఎస్ వాట్సాప్ గ్రూప్’.. ఐఏఎస్ ఆఫీసర్ ఫిర్యాదుతో వ్యవహారం వెలుగులోకి
తన వాట్సాప్ నంబరును ఎవరో హ్యాక్ చేసి.. దాని ద్వారా ‘హిందూ ఐఏఎస్ వాట్సాప్ గ్రూప్’ను(Hindu IAS Officers) క్రియేట్ చేశారని ఆయన తెలిపారు.
- By Pasha Published Date - 03:14 PM, Mon - 4 November 24

Hindu IAS Officers : కేరళలో కొత్త వివాదం రాచుకుంది. ‘హిందూ ఐఏఎస్ వాట్సాప్ గ్రూప్’ ఏర్పాటు అంశం ఈ వివాదానికి కారణమైంది. తనకు తెలియకుండానే తన ఫోన్ నంబరుతో ఈ వాట్సాప్ గ్రూపును క్రియేట్ చేశారంటూ ఐఏఎస్ అధికారి కె.గోపాల క్రిష్ణన్ తిరువనంతపురం సిటీ పోలీసు కమిషనర్కు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తన వాట్సాప్ నంబరును ఎవరో హ్యాక్ చేసి.. దాని ద్వారా ‘హిందూ ఐఏఎస్ వాట్సాప్ గ్రూప్’ను(Hindu IAS Officers) క్రియేట్ చేశారని ఆయన తెలిపారు. తొలుత ఈ వాట్సాప్ గ్రూపును క్రియేట్ చేసి.. అందులో పలువురు ఐఏఎస్ అధికారులను యాడ్ చేసిన తర్వాత.. ‘హిందూ ఐఏఎస్ వాట్సాప్ గ్రూప్’ అనే పేరు పెట్టారని తెలిసింది.
Also Read :Super App : రైల్వే శాఖ ‘సూపర్ యాప్’.. డిసెంబరులోనే విడుదల.. ఫీచర్స్ ఇవీ
మూడు రోజుల క్రితమే ఈ గ్రూపు క్రియేట్ అయిందని, దీన్ని గుర్తించిన వెంటనే ఐఏఎస్ అధికారి కె.గోపాల క్రిష్ణన్ పోలీసులకు ఫిర్యాదు చేశారని సమాచారం. కె.గోపాల క్రిష్ణన్ పేరును ‘మల్లు హిందూ ఆఫీసర్స్’ అని హ్యాకర్లు వినియోగించినట్లు.. కొన్ని స్క్రీన్ షాట్లను బట్టి వెల్లడైంది. స్నేహితుడు ఒకరు చెప్పేదాకా తన వాట్సాప్ నంబరు హ్యాక్ అయిందని.. పేరు మారిందనే అంశాన్ని గుర్తించలేకపోయానని కె.గోపాల క్రిష్ణన్ తెలిపారు. తన వాట్సాప్ నంబరుతో హ్యాకర్లు చాలానే గ్రూపులు క్రియేట్ చేశారని ఫిర్యాదులో ఆయన ప్రస్తావించారు. తన కాంటాక్ట్ లిస్టులోని ఆఫీసర్లను ఆ గ్రూపుల్లో యాడ్ చేశారన్నారు.
Also Read :Jammu Kashmir : ఆరేళ్ల తర్వాత తొలి సెషన్.. రసాభాసగా కశ్మీర్ అసెంబ్లీ సమావేశం
ఈ అంశంపై కేరళ ప్రభుత్వం సీరియస్ అయింది. ఇలాంటి మతపరమైన వాట్సాప్ గ్రూపులను సివిల్ సర్వీసు అధికారులు క్రియేట్ చేయడం అంటే.. ఐఏఎస్ అధికారుల జనరల్ కోడ్ ఆఫ్ కండక్ట్ను ఉల్లంఘించడమే అవుతుందని పేర్కొంది. దీనిపై తగిన చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. ఈ అంశంపై దర్యాప్తు చేస్తామని కేరళ పరిశ్రమల శాఖ మంత్రి పి.రాజీవ్ వెల్లడించారు. ప్రజలందరినీ ఒకేలా చూడాల్సిన సివిల్ సర్వీసు అధికారులు.. మతపరమైన వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేసుకోవడాన్ని ఆందోళన రేకెత్తించే అంశంగా అభివర్ణించారు. మతపరమైన వాట్సాప్ గ్రూపుల వ్యవహారం అనేది ప్రజా పాలనా విభాగం పరిధిలోకి వస్తుందని రాష్ట్ర మంత్రి రాజీవ్ చెప్పారు.