Rahul Gandhi: విజయ్తో రాహుల్ గాంధీ ‘రీల్’ను అడ్డుకున్నారని కాంగ్రెస్ ఆరోపణ..
- Author : Vamsi Chowdary Korata
Date : 11-05-2026 - 9:38 IST
Published By : Hashtagu Telugu Desk
లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి చెందిన కొన్ని సోషల్ మీడియా పోస్టులను కేంద్ర ప్రభుత్వం నిలిపివేసిందంటూ వచ్చిన ఆరోపణలను కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ (MeitY) వర్గాలు ఖండించాయి. తమ వైపు నుంచి అలాంటి చర్యలు గానీ, ఆదేశాలు గానీ లేవని స్పష్టం చేశాయి. ఇది కేవలం ఇన్స్టాగ్రామ్ అంతర్గత వ్యవస్థలో జరిగిన పొరపాటు వల్లే జరిగిందని వివరించాయి.
తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత సి.జోసెఫ్ విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కార్యక్రమానికి సంబంధించిన కొన్ని ఫొటోలు, రీల్స్ను రాహుల్ గాంధీ తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. అయితే, ఆదివారం ఈ పోస్టులు కొందరికి కనిపించకుండా పోయాయి. దీంతో కేంద్ర ఐటీ శాఖ ఆదేశాల మేరకే వాటిని నిరోధించారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది.
ఈ ఆరోపణలపై స్పందించిన ఐటీ శాఖ వర్గాలు ఈ చర్యతో తమకు ఎలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పాయి. ఇన్స్టాగ్రామ్ సొంత వ్యవస్థ పొరపాటున ఆ పోస్టులను బ్లాక్ చేసిందని, ఆ తర్వాత వాటిని పునరుద్ధరించిందని తెలిపాయి. అయితే, దీనిపై ఇన్స్టాగ్రామ్ యాజమాన్య సంస్థ మెటా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
కాగా, తమిళనాడులో దశాబ్దాల డీఎంకే, అన్నాడీఎంకే పాలనకు తెరదించుతూ విజయ్ చారిత్రాత్మకంగా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. చెన్నైలో జరిగిన ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాహుల్ గాంధీతో పాటు పలువురు జాతీయ, ప్రాంతీయ నాయకులు, సినీ ప్రముఖులు హాజరయ్యారు. 234 స్థానాలున్న అసెంబ్లీలో టీవీకే కూటమి 120 మంది ఎమ్మెల్యేల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.