Presidents Rule : మణిపూర్లో రాష్ట్రపతి పాలన ? ప్రధాని మోడీ ఏం చేయబోతున్నారు ?
తదుపరి ముఖ్యమంత్రి ఎవరు అనేది తేల్చలేకపోతే.. మణిపూర్లో రాష్ట్రపతి పాలన(Presidents Rule) విధించే ఛాన్స్ ఉందనే ప్రచారం జరుగుతోంది.
- By Pasha Published Date - 10:52 AM, Wed - 12 February 25

Presidents Rule : ప్రస్తుతం ఎన్డీఏ కూటమి ఎదుటనున్న ప్రధాన సవాల్ మణిపూర్ రాష్ట్రం. అక్కడ సీఎం బీరేన్ సింగ్ రాజీనామాతో ఏర్పడిన ఖాళీని భర్తీ చేయడంపై ఏం చేయాలనే దానిపై ఎన్డీఏ కూటమి సారథి బీజేపీ మల్లగుల్లాలు పడుతోంది. తదుపరిగా ఎవరిని సీఎం చేయాలనే దానిపై కమలదళంలో తర్జనభర్జనలు జరుగుతున్నాయి. పలుమార్లు మణిపూర్లోని బీజేపీ ఎమ్మెల్యేలతో పార్టీ హైకమాండ్ సమావేశమైనా సీఎం అభ్యర్థిపై ప్రకటన చేయలేకపోయింది. దీంతో అసలేం జరుగుతోంది ? అనే ప్రశ్న తలెత్తుతోంది.
Also Read :Welfare Schemes Vs Labourers: సంక్షేమ పథకాలపై ఎల్అండ్టీ ఛైర్మన్ సంచలన కామెంట్స్
రాష్ట్రపతి పాలనకే ఎందుకు మొగ్గు ?
తదుపరి ముఖ్యమంత్రి ఎవరు అనేది తేల్చలేకపోతే.. మణిపూర్లో రాష్ట్రపతి పాలన(Presidents Rule) విధించే ఛాన్స్ ఉందనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం అక్కడున్న హింసాత్మక పరిస్థితులకు రాష్ట్రపతి పాలనే కరెక్ట్ అనే భావన కేంద్ర ప్రభుత్వ వర్గాల్లో ఉందని అంటున్నారు. రాష్ట్రపతి పాలన విధించి, హింసాకాండను చల్లార్చిన తర్వాత అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని పలువురు రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. బీరేన్ సింగ్ను సీఎం పదవి నుంచి తప్పించడం ద్వారా మణిపూర్ ప్రజల్లో విశ్వసనీయతను నిలబెట్టుకునే కీలక ప్రయత్నాన్ని బీజేపీ చేసిందని అంటున్నారు.
Also Read :Postal Jobs 21413 : భారీగా ‘తపాలా’ జాబ్స్.. తెలుగు రాష్ట్రాల్లోనూ వందలాది ఖాళీలు
బీజేపీ ప్రతిష్ఠను కాపాడుకునే యత్నమేనా ?
మణిపూర్లోని కుకీ వర్గం ప్రజలపై హింసకు పాల్పడేలా మెయితీ వర్గం ప్రజలను రెచ్చగొడుతూ బీరేన్ సింగ్ మాట్లాడిన ఆడియో క్లిప్పులు వైరల్ అయ్యాయి. ఆ అంశం చివరకు సుప్రీంకోర్టుకు చేరింది. ఆ ఆడియో క్లిప్పులపై కేంద్ర ప్రభుత్వ ఫోరెన్సిక్ విభాగం దర్యాప్తు జరుగుతోంది. ఈ పరిణామం చోటుచేసుకున్న వారంలోపే బీరేన్ సింగ్తో బీజేపీ పెద్దలు రాజీనామా చేయించారు. తద్వారా పార్టీ ప్రతిష్ఠను కాపాడుకునే ప్రయత్నం చేశారు. తదుపరిగా జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి నష్టం జరగకూడదనే ఉద్దేశంతోనే ఇలా చేసి ఉండొచ్చని పరిశీలకులు అంటున్నారు.
మోడీ తిరిగి వచ్చాక కీలక నిర్ణయం
భారత రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర అసెంబ్లీ రెండు సమావేశాల మధ్య ఆరు నెలల కంటే ఎక్కువ అంతరం ఉండకూడదు. కానీ మణిపూర్ అసెంబ్లీ విషయంలో ఈ రాజ్యాంగ కాలపరిమితి ఈరోజు (బుధవారం)తో ముగుస్తుంది. అయితే, రెండు అసెంబ్లీ సమావేశాల మధ్య గరిష్టంగా 6 నెలల అంతరానికి సంబంధించిన రాజ్యాంగ నిబంధనలు 6 నెలల తర్వాత అసెంబ్లీని రద్దు చేయాలని స్పష్టంగా పేర్కొనలేదని నిపుణులు చెబుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విదేశీ పర్యటన నుంచి తిరిగి వచ్చిన తర్వాత మణిపూర్ సీఎం ఎంపికపై తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.