Adani Group : అమెరికాలో అదానీ గ్రూపుపై కేసులు.. భారత సుప్రీంకోర్టుకు చేరిన వ్యవహారం
కనీసం భారతీయ ఇన్వెస్టర్ల నమ్మకాన్ని నిలుపుకునేందుకైనా.. అదానీ గ్రూపు(Adani Group) కంపెనీల షేర్లలో షార్ట్ సెల్లింగ్తో ముడిపడిన దర్యాప్తు నివేదికను సెబీ విడుదల చేయాలని పిటిషనర్ తెలిపారు.
- Author : Pasha
Date : 24-11-2024 - 3:04 IST
Published By : Hashtagu Telugu Desk
Adani Group : అదానీ గ్రూపుపై అమెరికాలో నమోదైన కేసుల వ్యవహారం సుప్రీంకోర్టు దాకా చేరింది. దీనిపై ఒక పిటిషన్ దేశ సర్వోన్నత న్యాయస్థానంలో దాఖలైంది. అదానీ గ్రూపు దానికి చెందిన కంపెనీల షేర్లలో షార్ట్ సెల్లింగ్ చేయించి ధరలు పెరిగేలా చేస్తోందంటూ గతంలో అమెరికా సంస్థ హిండెన్బర్గ్ సంచలన నివేదికను విడుదల చేసింది. ఆ నివేదికలోని ఆరోపణలపై దర్యాప్తు చేయించాలంటూ గతంలో సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన వ్యక్తే ఈసారి కూడా పిటిషన్ వేసినట్లు తెలుస్తోంది. ఇప్పుడు అదానీ గ్రూపు, దాని యజమాని గౌతం అదానీ, మరో కీలక వ్యక్తి సాగర్ అదానీలపై అమెరికాలో నమోదైన ముడుపులు, అవినీతి అభియోగాలను కూడా గతంలో తాను దాఖలు చేసిన పిటిషన్లో చేర్చి విచారించాలని సుప్రీంకోర్టును పిటిషనర్ కోరారు.
Also Read :President Vs Vice President : అవసరమైతే దేశాధ్యక్షుడినే చంపిస్తా.. ఫిలిప్పీన్స్ వైస్ ప్రెసిడెంట్ వార్నింగ్
హిండెన్బర్గ్ నివేదికతో ముడిపడిన పలు అంశాలకు ఇటీవలే అమెరికాలో అదానీ గ్రూపుపై నమోదైన కేసుల్లోనూ ఉన్నాయని పిటిషనర్ తెలిపారు. అమెరికాలోని ఇన్వెస్టర్లకు తప్పుడు సమాచారాన్ని అందించి మోసగించారనే అభియోగాన్ని అమెరికా ఫెడరల్ ప్రాసిక్యూటర్లు నమోదు చేశారని ఆయన గుర్తు చేశారు. భారత దేశ ప్రయోజనాలు, స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే కోట్లాది మంది ప్రజల ప్రయోజనాలను కాపాడేందుకు ఈ అంశంపై భారత దర్యాప్తు సంస్థలతో విచారణకు ఆదేశించాలని సుప్రీంకోర్టును పిటిషనర్ కోరారు. అదానీ గ్రూపునకు సంబంధించిన కొన్ని కంపెనీల షేర్లలో షార్ట్ సెల్లింగ్ జరుగుతోందనే అభియోగాలపై జరిగిన దర్యాప్తునకు సంబంధించిన నివేదికను సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) ఇప్పటిదాకా సుప్రీంకోర్టుకు అందించలేదని తెలిపారు. ఇలాంటి చర్యల వల్ల దేశ ప్రజలకు సెబీపై విశ్వాసం సన్నగిల్లుతోందన్నారు.
Also Read :Mana Desam : ఎన్టీఆర్ ‘మన దేశం‘ మూవీకి 75 ఏళ్లు.. నారా భువనేశ్వరి ఎమోషనల్ ట్వీట్
కనీసం భారతీయ ఇన్వెస్టర్ల నమ్మకాన్ని నిలుపుకునేందుకైనా.. అదానీ గ్రూపు(Adani Group) కంపెనీల షేర్లలో షార్ట్ సెల్లింగ్తో ముడిపడిన దర్యాప్తు నివేదికను సెబీ విడుదల చేయాలని పిటిషనర్ తెలిపారు. అయితే షార్ట్ సెల్లింగ్ ఆరోపణలను గతంలోనే అదానీ గ్రూపు ఖండించింది. తమ గ్రూపునకు చెందిన 11 పబ్లిక్ కంపెనీలకు అలాంటి వ్యవహారాలతో సంబంధం లేదని స్పష్టం చేసింది. ఇక అమెరికాలో తమ కంపెనీపై నమోదైన కేసులను కూడా అదానీ గ్రూపు ఖండించింది.